logo

లక్ష్యం చేరని వ్యవసాయ మార్కెట్ల ఆదాయం!

తగ్గిన పంట దిగుబడి, ధరల ప్రభావం వ్యవసాయ మార్కెట్లపై పడింది. మార్కెటింగ్‌ శాఖ గతేడాది వరంగల్‌ రీజినల్‌ పరిధిలోని 19 జిల్లాల్లో 106 వ్యవసాయ మార్కెట్లలో నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని నిర్ణయించగా 80 శాతం ఆదాయమే లభించింది.

Published : 21 Mar 2023 06:16 IST

జమ్మికుంట మార్కెట్‌లో పత్తి బిడ్డింగ్‌ దృశ్యం

న్యూస్‌టుడే, జమ్మికుంట: తగ్గిన పంట దిగుబడి, ధరల ప్రభావం వ్యవసాయ మార్కెట్లపై పడింది. మార్కెటింగ్‌ శాఖ గతేడాది వరంగల్‌ రీజినల్‌ పరిధిలోని 19 జిల్లాల్లో 106 వ్యవసాయ మార్కెట్లలో నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని నిర్ణయించగా 80 శాతం ఆదాయమే లభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లలో రూ.431.68 కోట్లు ఆదాయం సాధించేందుకు నిర్ణయించిన లక్ష్యంలో తాజాగా రూ.346.15 కోట్లు (80శాతం) సాధించింది. రీజినల్‌ పరిధిలోని నాలుగు జిల్లాల మార్కెట్లు మాత్రం నిర్ణయించిన ఆదాయ లక్ష్యాన్ని అధిగమించటం విశేషం.


4 జిల్లాల్లో ముందంజ

గతేడాది నిర్ణయించిన మార్కెట్ల నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని 11 మాసాల్లోనే యాదాద్రి జిల్లా అధిగమించి రూ.25.95 కోట్ల ఆదాయంతో (137 శాతం) రీజినల్‌ పరిధిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. సిరిసిల్ల జిల్లాలోని మార్కెట్ల ద్వారా 8.98 కోట్ల ఆదాయం (109 శాతం), నల్గొండలోని మార్కెట్ల ద్వారా రూ.70.43 కోట్ల ఆదాయం (105శాతం), కరీంనగర్‌లోని ఏడు మార్కెట్ల ద్వారా రూ.22.92 కోట్ల (102 శాతం) ఆదాయం లభించగా మిగితా 15 జిల్లాలు వెనుకంజలో నిలిచాయి.


మన వద్ద ఇలా..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌, సిరిసిల్ల్లలోని మార్కెట్లు నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించటం విశేషం. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు రూ.7.02 కోట్ల ఆదాయం (101 శాతం) లభించింది. కరీంనగర్‌ రూ.4.39 కోట్ల (110 శాతం), హుజూరాబాద్‌ రూ.5.15 కోట్ల (159 శాతం), మానకొండూరు రూ.1.83 కోట్ల (101 శాతం), గోపాల్‌రావుపేట మార్కెట్‌ రూ.1.35 కోట్ల (64 శాతం) ఆదాయం లభించింది. ప్రభుత్వం నుంచి ధాన్యం విక్రయాలకు సంబంధించిన మార్కెట్‌ ఫీజు, పలు రకాల పాత బకాయిలు తాజాగా జమ కావటంతో జమ్మికుంట, హుజూరాబాద్‌ మార్కెట్ల ఆదాయం అంచనాకు మించి దాటింది. జిల్లాలో 22.38 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించగా, 22.92 కోట్ల ఆదాయం మార్కెట్ల ద్వారా లభించింది. సిరిసిల్ల జిల్లాలోని 8 వ్యవసాయ మార్కెట్ల ద్వారా 8.25 కోట్ల లక్ష్యం కాగా, 8.92 కోట్లు లభించటం విశేషం. పెద్దపల్లి జిల్లాలోని 8 మార్కెట్ల ఆదాయ లక్ష్యం రూ.24.48 కోట్ల ఉండగా రూ.14.26 కోట్లు మాత్రమే (58 శాతం) లభించింది. జగిత్యాల జిల్లాలోని 13 మార్కెట్ల ద్వారా 21.52 కోట్ల లక్ష్యానికి రూ.18.43 కోట్ల ఆదాయం (86 శాతం) లభించింది.  వ్యవసాయ మార్కెట్లకు పంట క్రయవిక్రయాలతో వచ్చే మార్కెట్‌ ఫీజు, లైసెన్స్‌ ఫీజులు, గిడ్డంగులు, క్యాంటిన్ల నిర్వహణ, చెక్‌పోస్టుల ద్వారా పలు రకాల టెండర్లు, ఇతరత్రా ఆదాయం లభిస్తాయని అధికారులు అంటున్నారు.  


పాత బకాయిలు జమ కాకపోవడంతో..

* ఇ.మల్లేశం, ఆర్‌జేజీ, మార్కెటింగ్‌ శాఖ, వరంగల్‌వరంగల్‌ రీజినల్‌ పరిధిలో నాలుగు జిల్లాల్లోని మార్కెటింగ్‌ శాఖకు నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం సమకూరింది. పత్తి ధర, పంట దిగుబడి తగ్గుదల, ధాన్యానికి సంబంధించిన మార్కెట్‌ ఫీజు ఆయా మార్కెట్లకు జమకాకపోవటంతోనూ నిర్ణీత ఆదాయం లభించలేదు. మార్చితో ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక కొద్దిమేర మార్కెట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు