logo

ఆనందాల ప్రతిరూపం కవిత్వం

కవిత్వం ఆనంద లోకాల్లో విహరింపజేస్తుంది. వికాసానికి పదును పెడుతుంది. చైతన్యం రగిలిస్తుంది.

Updated : 21 Mar 2023 06:29 IST

నేడు కవితా దినోత్సవం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం: కవిత్వం ఆనంద లోకాల్లో విహరింపజేస్తుంది. వికాసానికి పదును పెడుతుంది. చైతన్యం రగిలిస్తుంది. వాస్తవికతకు అవాస్తవికత మధ్య విచక్షణ తెలియజేస్తుంది. చదివే వారికి భావస్ఫూర్తి కలిగితే.. సృజనకారులు ఆకాశమే హద్దుగా భావ పరిమళాలు పంచుతారు. ఈ సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాదికి ఒక రోజు ముందే ప్రపంచ కవిత్వ దినోత్సవం వస్తోంది. యువతరం కవులు.. సృజనకారులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తమ కలానికి పదును పెట్టారు. కవిత్వ దినోత్సవం, ఉగాది పర్వదినం సందర్భంగా యువ కవుల భావాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.


షడ్రుచుల మేళవింపు
శ్రీలత గోస్కుల, హుజురాబాద్‌

‘ఇంటి ముందున్న వేపచెట్టు
కమ్మటి పూల పరిమళాన్ని వెదజల్లుతుంది
చిగురులనారగించిన కోయిలమ్మ
కొమ్మల్లో దాగి..
కొత్తరాగమేదో అందుకుని..
సవరించిన గొంతుకతో సన్నాయినూదుతుంటే
పిన్నలు పెద్దలు పోటీపడి..
ఆ రాగానికి చేరేను జతగా..
ఉత్సాహం నింపే ఆశలతో..
నవలోకానికి మెరుగులు దిద్దుకుంటూ..
షడ్రుచుల మేళవింపుతో
నిజ వసంతం నిత్యం వెల్లివిరియగా..
మనతో కలిసిరాని గతానికి స్వస్తి పలికి
అందమైన ఆరోగ్యానంద జీవనానికి..
ఆహ్వానం పలుకుతూ..
పరుగు పరుగునా వచ్చింది
నవకాంతితో ‘శోభకృత్‌’ సంవత్సరాది..!

* హుజురాబాద్‌ పట్టణానికి చెందిన కవియిత్రి శ్రీలత గోస్కుల.. భర్త రమేశ్‌ సహకారంతో 2018 నుంచి కవితలు, వ్యాసాలు రాస్తున్నారు. వెయ్యికి పైగా కవితలు, 5 వందలకు పైగా కైతికాలు రాశారు. భద్రాచలంలో ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రముఖుల చేత ‘లేడి లెజెండ్‌ - 2020’ అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు.


ఇది ఆరంభం
ప్రీతి రిచర్డ్స్‌ , యువ కవయిత్రి, కరీంనగర్‌

ఉగాది కొత్త వసంతానికి ఆహ్వానం..
కొత్త ఆరంభాలతో.. అడవులు.. చెట్లు.. వసంతాలు..
ప్రకృతిలో ప్రతిదీ పరవశిస్తుంది.
కొత్త జీవితాలకు తెర తీస్తుంది.
ఆకులు లేని చెట్లకు.. నిస్సహాయులకు ఇది మనోజ్ఞతను జోడిస్తుంది.
ఉగాది ఒక ప్రతీకాత్మక లక్షణం
జీవితాన్ని ఉచ్చరించేది.
కేవలం తీపి చేదే కాదూ..
మానవ జీవితాలు షడ్రుచుల కలయిక.. అదే పరమార్థం

* కరీంనగర్‌కు చెందిన ప్రీతి రిచర్డ్స్‌ ఒక ప్రకృతి కవయిత్రి. ఈమె ‘నేక్డ్‌ లవ్‌’తో తన కవితా ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘సోలిటరీ సోల్‌’ అనే పుస్తకం ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ‘ది బర్డ్‌’ పేరుతో ఒక పుస్తకం ముద్రితమైంది.  


తెలుగు నేల మది పులకించగా..
- మెరుగు ప్రవీణ్‌, యువ కవి, కరీంనగర్‌

తెలుగు నేల మది పులకించగా
పునరుత్తేజం వెల్లివిరియగా
జీవన గమనం కదులుతుండగా
కొత్త ఆశ చిగురరిస్తూ ఉండగా
తరాలు మారిన తరగని మా ఎద
చప్పుడై నింగి మారుమోగెను
వెలుగులు పంచే కమ్మని పండుగ
నిండుతనంబున దీవెనలీయగ
తెనలోలికేటి వేదికలోన
కవితలతో కవి ఆహ్వానము పలికే

* మెరుగు ప్రవీణ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే ‘మేల్కొనండి’ పుస్తకం తీసుకొచ్చారు. ఆ తర్వాత తరచుగా కవితలు, వ్యాసాలు రాస్తున్నారు. బ్యాంకు ఉద్యోగిగా చేరిన తర్వాత పాటలు రాస్తూ స్వయంగా పాడి యూట్యూబ్‌ వేదికగా పంచుకుంటున్నారు. కవి సమ్మేళనాలలో పాల్గొనడం, కళా పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు కవిత్వంతో పాటు గేయ రచయితగా ఆడియో వీడియోలు రుపొందిస్తున్నారు.


కావ్య వసంతం
గసికంటి సంజీవ్‌, యువ కవి, కరీంనగర్‌

‘తెలుగువారి మోముపై చిరునవ్వులా
పడుచుపిల్ల సింగారాలంకారణలో
ప్రకృతి కొత్త వసంతాన ముస్తాబై
గత కాలాలను పరివర్తన కావిస్తూ
పంచాంగ శ్రవణాల కోలాహలంతో
నేలనేలంతా సప్తవర్ణ శోభితమై
ఈ జగతికి సుఖ సౌఖ్యాలను కాంక్షిస్తూ
శుభారంభంతో ప్రకృతి
కొత్త వసంత కావ్యగానం చేస్తూ
స్వాగతిస్తున్న ఉగాది సందర్భాన..!

ః కరీంనగర్‌కు చెందిన గసికంటి సంజీవ్‌ కళాశాల స్థాయి నుంచే కవిత్వం రాస్తున్నారు. కళాశాల సంచికలకు సంపాదకత్వంతో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ కవి సమ్మేళనాలను నిర్వహించారు. పలు అవార్డులు సాధించారు.


ఊహల్లో.. ఉగాది
ఈడెపు సౌమ్య, పీజీ విద్యార్థిని, రాజన్న సిరిసిల్ల జిల్లా

నవవసంతాలెందుకు, నందనవనాలెందుకు
కలకూజితాల కోకిల పాటలెందుకు
మావిచిగురులెందుకు, మరవవు పొత్తిళ్లపైన
మెరిసిపోయే బొండు మల్లెల సోయగాలెందుకు
ఉన్నవారికే ఉగాదులు.. లేనివారికి దగాదులు!
ఇన్నేళ్లలో ఏ ఉగాది కొత్త వసంతాలని కొనితెస్తుంది?
ఎప్పుడూ పచ్చడిలో చేదే తప్ప తీపెరగని నాలుకలకు
వయ్యారి వసంతం ఈసారైనా కరుణించి కడుపు నింపితే
అదే నిజమైన ఉగాది..!!

* రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఈడెపు సౌమ్య పీజీ చదువుతోంది. తన భావాలను కవిత్వాల రూపంలో పొందుపరుస్తుంది. గతంలో ఒక కవితా సంకలనం తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని