logo

విస్తరిస్తున్న మద్యం గొలుసు వ్యాపారం

పల్లెల్లో మద్యం గొలుసు దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. జిల్లాలో దాదాపు 1200 వరకు మద్యం గొలుసు దుకాణాలు ఉన్నట్లు అంచనా.

Published : 21 Mar 2023 06:21 IST

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లెల్లో మద్యం గొలుసు దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. జిల్లాలో దాదాపు 1200 వరకు మద్యం గొలుసు దుకాణాలు ఉన్నట్లు అంచనా. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 వరకు ఉన్నాయి. జగిత్యాల, మెట్‌పల్లి, ధర్మపురి సర్కిల్‌ పరిధిలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం సైతం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుండడంతో సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. జిల్లాలో 71 మద్యం దుకాణాలు ఉండగా 18 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజు రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఆదివారం రూ.2 కోట్ల వరకు అమ్మకాలు ఉంటున్నాయి.

కుటుంబాల్లో కలహాలు

గ్రామీణ ప్రాంతంలో నిత్యం కూలీ పనిచేసుకుంటూ వచ్చిన కొంత ఆదాయాన్ని మద్యానికి ఖర్చు చేస్తున్నారు. పని ఉన్నా లేకున్నా సాయంత్రానికి మద్యం తాగనిదే ఇంటికి వెళ్లడం లేదని పలువురు వాపోతున్నారు. మద్యం తాగొచ్చి నిత్యం ఇంట్లో గొడవ పడి పోలీసు ఠాణాలను ఆశ్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాలను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం తమ పరిధి కాదని పోలీసులు దాటవేస్తున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు నిషేధించాలని మహిళలు కోరుతున్నారు.  

నాటుసారా విక్రయాలు..

గ్రామాల్లో గొలుసు మద్యం విక్రయాలు పెరిగిపోతుండగా గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా విక్రయాలు జోరందుకున్నాయి. ఇటుకబట్టీల్లో పనిచేసేవారు, రోజువారి కూలీలు నాటుసారాకు బానిసలుగా మారుతున్నారు. జగిత్యాల పట్టణ సమీపంలోని టీఆర్‌నగర్‌లో గుడుంబా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. నాటుసారా విక్రయాలపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని