logo

కుళాయిల క్రమబద్ధీకరణ

ఇల్లు.. ఇంటి నెంబర్‌ ఉంటుంది.. నల్లా కనెక్షన్‌ ఉన్నా.. దానికి ప్రత్యేకంగా నంబర్‌ మాత్రం ఉండదు.. ఇంటి నంబర్‌తోనే నల్లా బిల్లు కట్టుకునే పరిస్థితి కొన్ని విలీన కాలనీల్లో ఉంది.

Published : 27 Mar 2023 04:55 IST

ఆన్‌లైన్‌లోకి విలీన కాలనీల కనెక్షన్లు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

ఇల్లు.. ఇంటి నెంబర్‌ ఉంటుంది.. నల్లా కనెక్షన్‌ ఉన్నా.. దానికి ప్రత్యేకంగా నంబర్‌ మాత్రం ఉండదు.. ఇంటి నంబర్‌తోనే నల్లా బిల్లు కట్టుకునే పరిస్థితి కొన్ని విలీన కాలనీల్లో ఉంది. ఈ విధానాన్ని పూర్తిగా మార్చి ఆన్‌లైన్‌ల్లోకి తీసుకొచ్చేలా బల్దియా అధికారులు చర్యలు ప్రారంభించారు.

నల్లా కనెక్షన్ల వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేస్తున్న బల్దియా ఉద్యోగులు

కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలోకి మూడేళ్ల కిందట సమీపంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేశారు. ఆ తర్వాత కాలనీలుగా పిలుస్తుండగా వీటిని డివిజన్లకు కలుపుతూ నగర స్థాయిలో సౌకర్యాలు మెరుగు పర్చేలా నిధులు కేటాయిస్తున్నారు. నగర వ్యాప్తంగా కల్పించే కనీస మౌలిక వసతులు ఆయా కాలనీలకు అందిస్తున్నారు. తాగునీటి సరఫరా అందించేందుకు వీలుగా ప్రధాన పైపులైన్లు వేసేందుకు రూ.5.50 కోట్లు కేటాయించారు. ఈ పనులు కొన్ని కాలనీల్లో పూర్తి కాగా, మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. వేసవిలో నల్లా నీరు పంపిణీ చేసేలా కార్యాచరణ తీసుకొని పనులు ముమ్మరంగా చేస్తున్నారు. గతంలో రూరల్‌ మిషన్‌ భగీరథ ద్వారా పైపులైన్లు, నల్లా కనెక్షన్లు ఇవ్వగా కనీసం మూడు రోజులకు ఒకసారి కూడా నీరు ఇవ్వడంలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిని పూర్తిగా తొలగించి రోజూ నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా నగర మేయర్‌ వై.సునీల్‌రావు ముందుకు సాగుతున్నారు. అమృత్‌ పథకంలో ఆయా కాలనీలకు ప్రత్యేకంగా రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు నిర్మించనున్నారు.

‘లెక్క’లేనన్ని..

విలీన కాలనీల్లో లెక్కలేనన్ని కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. పైగా పంచాయతీల సమయంలో తీసుకున్న కనెక్షన్లు కావడంతో ప్రత్యేకంగా టిన్‌ నంబర్‌ వంటివి ఏవీ లేవు. ఇలాంటివి ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించుకోవాలన్న ఇబ్బందులు పడాల్సిందే. పాసు పుస్తకం లేకుండా, నల్లా బిల్లు చెల్లించకుండా వందల సంఖ్యలో ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. కొందరు పబ్లిక్‌ నల్లాల పేరుతోనే ఇళ్లలో వాడుతున్నారు. మరికొందరైతే రెండు కనెక్షన్లు తీసుకున్న వారున్నారు. వీరంతా నామమాత్రంగా బిల్లు చెల్లిస్తుండగా.. అదే మాదిరిగానే నల్లా నీరు కూడా ఎన్ని రోజులకు వస్తుందో తెలియని గందరగోళం ఉండేది. ఇదంతా తొలగించి ప్రతి రోజు తాగునీరు సరఫరా చేసేందుకు, ఒక్కో విలీన కాలనీల్లో ఎన్ని నల్లా కనెక్షన్లు ఉన్నాయనే పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.  

వివరాలు నమోదు..

శివారు, విలీన కాలనీల్లోని నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటివరకు నల్లా వాడుతున్న వారి వద్దకు నీటి విభాగం సిబ్బంది వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఆయా వివరాల ఆధారంగా నగరపాలక సంస్థలోని నీటి విభాగం కార్యాలయంలో ఆయా కాలనీల్లోని కుళాయిలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. కొత్త నంబర్‌ కేటాయించడంతోపాటు నల్లా పన్ను చెల్లించుకొని ఆన్‌లైన్‌ రసీదు, ఉత్తర్వులు జారీ చేసేలా ప్రణాళికలు చేశారు. ఇంటి యజమాని సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపిస్తారు. లేదంటే ఆ ఏరియా లైన్‌మెన్‌ ద్వారా సమాచారం అందిస్తారు. డిపాజిట్‌తోపాటు మూడు నెలల ముందస్తు బిల్లు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించడంతోనే ఆన్‌లైన్‌ అవుతుండగా ఆస్తిపన్ను తరహాలోనే ఇంట్లోనే ఉండి నల్లా బిల్లు కూడా చెల్లించుకునే సౌకర్యం కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని