logo

వీధి వ్యాపారులకు రుణాల దన్ను

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా చిరు వ్యాపారులు బజారున పడ్డారు.. తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి పైసా లేక.. అప్పులు దొరకక అవస్థలు పడుతున్న వేళ వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి, ఆత్మనిర్భర్‌ పథకాన్ని ప్రారంభించారు.

Published : 01 Jun 2023 05:37 IST

పీఎం స్వనిధి సద్వినియోగం
రెండో స్థానంలో కరీంనగర్‌ నగరపాలిక
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సుభాష్‌నగర్‌

కరీంనగర్‌లో ఫుట్‌పాత్‌పై విక్రయాలు

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా చిరు వ్యాపారులు బజారున పడ్డారు.. తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి పైసా లేక.. అప్పులు దొరకక అవస్థలు పడుతున్న వేళ వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి, ఆత్మనిర్భర్‌ పథకాన్ని ప్రారంభించారు.. పట్టణాలు, నగరాల్లో గుర్తించిన చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా దన్నుగా నిలిచారు.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించి మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి కావడంతో జూన్‌ 1 నుంచి 3 వరకు దిల్లీలో ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనమిది..

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 పురపాలికలు, 2 నగరపాలికల్లో 65,246 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. రోడ్ల మీద, ఫుట్‌పాత్‌లపై పండ్లు, కూరగాయలు, అల్పాహార కేంద్రాలు, వస్త్రాలు, నిత్యావసరాలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కరోనా మహమ్మారి వీరి వ్యాపారాలను బాగా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ తర్వాత వ్యాపారాలు చక్కదిద్దుకునేందుకు చిరు వ్యాపారులు అష్టకష్టాలు పడ్డారు. ఉపాధి లేక, జీవనం గడవక అవస్థలు పడుతున్న చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించింది. 

* మొదట్లో నిరాకరించి : పీఎం స్వనిధి, ఆత్మనిర్భర్‌ కింద వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా నేరుగా రుణాలు అందించేందుకు ముందుకొచ్చారు. రూ.10 వేలు ఖాతాలో జమ చేస్తుండగా ప్రతి నెలా వడ్డీతో సహా కట్టాల్సి ఉండటంతో చిరు వ్యాపారులు మొదట్లో నిరాకరించారు. ఇచ్చే మొత్తం సరిపోదనే భావనతోనే ఉండేవారు. పురపాలక అధికారులు అవగాహన కల్పించడంతోపాటు దగ్గరుండి రుణాన్ని ఇప్పించారు. తర్వాత లక్ష్యాన్ని విధించడం, ఈ మొత్తం రెట్టింపు అవుతుందనే ఆశతో రుణాలు తీసుకోవడానికి చిరు వ్యాపారులు ఆసక్తి చూపించారు.

* రూ.10 వేల నుంచి రూ.50 వేలకు.. : పీఎం స్వనిధి కింద మొదటి విడతలో రూ.10 వేలు ఖాతాల్లో జమ చేస్తే, ఈ మొత్తాన్ని ఏడాదిలోగా వడ్డీతో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. సక్రమంగా చెల్లించిన వారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు స్వయంగా బ్యాంకర్లే ముందుకొచ్చారు. దాంతో రెండో విడతలో రూ.20 వేలకు అర్హత కల్పించారు. ప్రస్తుతం మూడో విడతలో రూ.50 వేలు అందించేందుకు లక్ష్యాన్ని విధించడంతో అర్హులైన వీధి వ్యాపారులు కూడా ముందుకొస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. పీఎం స్వనిధి అమలులో రెండో విడతలో కరీంనగర్‌ నగరపాలక సంస్థ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా, దేశంలో పది లక్షల లోపు జనాభాలోని కార్పొరేషన్లలో రెండో స్థానంలో నిలిచింది. మూడో విడతలో కూడా లక్ష్యాన్ని సాధించేలా కసరత్తు చేస్తున్నారు.


అడగకముందే రుణం మంజూరు

రోడ్డుపై దుస్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తాను. వీధి వాపార గుర్తింపు కార్డు ఇచ్చారు. ఆ సమయంలో రూ.10 వేలు రుణం ఇప్పించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో చెల్లించడంతో రూ.20 వేలు ఇచ్చారు. ఆ మొత్తాన్ని కూడా చెల్లించడంతో మూడోవిడతకు దరఖాస్తు చేయమని మున్సిపల్‌ అధికారులు ఫోన్‌ చేశారు. బయట ఫైనాన్స్‌ కంటే నయమే. అడగకముందే రుణం మంజూరు చేశారు.

రాజేశం, కరీంనగర్‌


సమయానికి ఆదుకుంది

లాక్‌డౌన్‌ సమయంలో పైసలు లేక, పని చేసుకుందామంటే పెట్టుబడి లేక ముప్పు తిప్పలు పడ్డాం. కుటుంబ పోషణ భారంగా మారింది. ఆ సమయంలో తక్కువ వడ్డీతో ఈ రుణం ఆదుకుంది. మూడు విడతలుగా రుణం తీసుకొని చెల్లించా. బ్యాంకు అధికారులు మళ్లీ రుణం ఇస్తామని చెబుతున్నారు. చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తీసుకోవడం లేదు.

అంజయ్య, చెరుకు జ్యూస్‌ సెంటర్‌, కరీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని