logo

బడి బాట షురూ

కొత్తగా బాలల ప్రవేశాలను పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం జిల్లాలో శనివారం ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ నుంచి బడులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనెల 17వ వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

Published : 04 Jun 2023 05:03 IST

ప్రవేశాలపై ప్రచారం చేస్తున్న తిమ్మాపూర్‌ మండలం మన్నెంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌  విద్యావిభాగం: కొత్తగా బాలల ప్రవేశాలను పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం జిల్లాలో శనివారం ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ నుంచి బడులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనెల 17వ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. శనివారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 651 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

బడుల్లోని సదుపాయాలు, ఉచితంగా అందించే ప్రయోజనాలు, బోధన తీరు, డిజిటల్‌ తరగతులు వంటి వాటిని తల్లిదండ్రులకు వివరించారు. కొత్తగా చేరే వారి వివరాలను తల్లిదండ్రుల నుంచి తీసుకున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అభివృద్ధి పనులకు ఎంపికైన పాఠశాలల్లో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. సదుపాయాలను వివరించడంతో వారు ముందుకొస్తున్నారు. ఎంఈవోలు, సమగ్ర శిక్ష సెక్టోరల్‌ అధికారులు బడిబాటలో పాల్గొన్నారు.

విడతల వారీగా విధులకు హాజరు?

పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులందరూ నిత్యం విధులకు హాజరుకావాలని జిల్లా విద్యా శాఖ చెబుతోంది. సెలవు రోజుల్లోనూ రావాలని చెప్పింది. చాలా పాఠశాలల్లో అందరూ విధులకు హాజరయ్యారు. కానీ కొన్ని బడుల్లో మొదటి రోజు పలువురు విడతల వారీగా విధులకు హాజరైనట్లు సమాచారం. కొందరు ఒక రోజు, మరికొందరు బడిబాట ముగిసే వరకు వంతుల వారీగా హాజరయ్యే ప్రణాళిక తయారు చేసుకున్నట్లు తెలిసింది. కొందరు శనివారం విధులకు హాజరు కాలేదని ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ అధికారులు పెద్దగా దృష్టి సారించలేదని సమాచారం.

గైర్హాజరైతే చర్యలు

బడి బాట కార్యక్రమం షెడ్యూల్‌ ముగిసే వరకు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాలి. విడతల వారీగా హాజరయ్యే పాఠశాలలపై దృష్టి సారిస్తాం. ఈ పద్ధతి పాటించిన వారిపై చర్యలు తీసుకుంటాం. సెలవు దినాల్లోనూ బడిబాట నిర్వహించాల్సిందే.

జనార్దన్‌రావు, డీఈవో, కరీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు