logo

ధాన్యం కేటాయింపులపై మల్లగుల్లాలు

జిల్లాలో ధాన్యం సేకరణ పదిహేను రోజులుగా నిలిచిపోయింది. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం తీసుకెళ్లిన వాహనాలు మిల్లుల్లో దిగుమతి కాక జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 1.93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తూకం పూర్తయింది.

Published : 04 Jun 2023 05:03 IST

జిల్లాలో 15 రోజులుగా నిలిచిన సేకరణ

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం సేకరణ పదిహేను రోజులుగా నిలిచిపోయింది. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం తీసుకెళ్లిన వాహనాలు మిల్లుల్లో దిగుమతి కాక జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 1.93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తూకం పూర్తయింది. ఇంకా లక్ష మెట్రిక్‌ టన్నులపైనే కేంద్రాల్లో ఉన్నట్లు అంచనా. ఇందులోనూ తూకం వేసి.. బస్తాల్లో నింపి తరలించేందుకు సిద్ధంగా ఉన్నవి సగానికిపైగా ఉన్నాయి. యాసంగి సీజన్‌కు జిల్లాలో 30 బాయిల్డ్‌ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించారు. వాటి సామర్థ్యం 1.5 లక్షల మెట్రిక్‌ టన్నులు. మిగతావి మిల్లులకు కేటాయించడంపై పౌర సరఫరాలశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌కు 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కేంద్రాలకు వచ్చింది 2.4 లక్షల మెట్రిక్‌ టన్నులుగా అధికారుల అంచనా. ఇందులో జిల్లాకు కేటాయించిన మిల్లుల సామర్థ్యం 1.57 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. వీటిలో ఇరవై రోజుల క్రితమే నిల్వ సామర్థ్యం పూర్తయింది. దీంతో కమిషనర్‌ ఆదేశాలతో కరీంనగర్‌ జిల్లాలోని మిల్లులకు 20 వేల మెట్రిక్‌ టన్నులు, కామారెడ్డి జిల్లాకు 30 వేల మెట్రిక్‌ టన్నులను కేటాయించారు. ఆయా జిల్లాలకు తరలించిన ధాన్యం లారీలు మిల్లుల్లో దించుకోకపోవడంతో అక్కడే నిలిచిపోయాయి. తొలుత ఆయా జిల్లాల్లోని ధాన్యం దింపుకున్నాక.. పక్క జిల్లాల ధాన్యం దించుతామని అక్కడి జిల్లా యంత్రాంగం ఈ వాహనాలను పక్కన పెట్టింది. జిల్లాలో పదిహేను రోజులుగా తూకం వేసిన ధాన్యం కేంద్రాల నుంచి కదలడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా రా రైస్‌ మిల్లులకు కూడా కొంత మొత్తంలో కేటాయించాలని నిర్ణయించారు. కాగా యాసంగి సీజన్‌ ధాన్యం మిల్లింగ్‌ చేస్తే 30 శాతం బియ్యం కూడా రావని మిల్లర్లు దింపుకునేందుకు ససేమిరా అంటున్నారు.

ఈ చిత్రంలో రహదారిపై ఉన్న ధాన్యం నిల్వలు ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) కొనుగోలు కేంద్రానివి. స్థలం లేక ఇలా రహదారిపై కుప్పలుగా పోశారు. ఇక్కడికి 8,221 క్వింటాళ్ల ధాన్యం రాగా, 2 వేల క్వింటాళ్లు తూకం వేశారు. లారీలు రాక పదిహేను రోజులుగా తరలించలేని పరిస్థితి. ఇంకా తూకం వేయాల్సిన ధాన్యం నిల్వలు ఉన్నాయి.

ఈ చిత్రంలోని ధాన్యం నిల్వలు చందుర్తి మండలం మల్యాల పీఏసీఎస్‌ కేంద్రంలోనివి. ఈ సీజన్‌లో 15 వేల క్వింటాళ్ల ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించారు. ఇంకా 10 వేల క్వింటాళ్లకు పైగా కేంద్రంలో ఉన్నాయి. లారీలు రాకపోవడంతో 15 రోజులుగా తూకాలు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలులో జాప్యానికి నిరసనగా వారం రోజుల వ్యవధిలో రైతులు రెండుసార్లు నిరసనకు దిగారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

జిల్లాలో బాయిల్డ్‌ మిల్లులకు కేటాయించిన సామర్థ్యం మేరకు నిండిపోయాయి. పక్క జిల్లాల మిల్లుల సామర్థ్య మేరకు కేటాయింపులకు అనుమతినివ్వాలని కమిషనర్‌ను కోరాం. దీనితోపాటు జిల్లాలోని రా రైస్‌ మిల్లర్లతో మాట్లాడి వారి నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా కేటాయించేలా చూస్తున్నాం.

జితేందర్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని