logo

తలాపునే గోదావరి.. గొంతు తడిపే దారేది!

తలాపునే గోదావరినది ఉన్నా ధర్మపురిలో మాత్రం తాగు నీటి సమస్యలు నేటికీ పరిష్కారం కావడం లేదు.

Updated : 09 Jun 2023 05:42 IST

 మిషన్‌ భగీరథ నీటి సరఫరా అంతంతే
 పట్టణ ప్రజల పాట్లు

ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా

న్యూస్‌టుడే, ధర్మపురి: తలాపునే గోదావరినది ఉన్నా ధర్మపురిలో మాత్రం తాగు నీటి సమస్యలు నేటికీ పరిష్కారం కావడం లేదు. గత మూడు రోజులుగా మిషన్‌ భగీరథ ప్రధాన గ్రిడ్‌ నుంచి ధర్మపురికి తాగునీరు సరఫరా కావడం లేదు. అసలే వేసవి, మరోవైపు శుభ కార్యాలు, భక్తుల రద్దీ వెరసి తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా మిషన్‌ భగీరథ గ్రిడ్‌ పైపు లైనుకు పలు చోట్ల లీకేజీలు ఏర్పడటంతోనే, పురాతన నీటి ట్యాంకులోకి నీరందడం లేదని స్థానికులు భావిస్తున్నారు. గత మూడు రోజులుగా మిషన్‌ భగీరథ గ్రిడ్‌ పైపుల ద్వారా నీరందకపోవడంతో ప్రజలు తీవ్రస్థాయిలో తాగు నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని పుర అధికారులు సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో నల్లాల ద్వారా నీరందక వేసవిలో ప్రజలు శుద్ధజల నీటి ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. నూటికి యాభై శాతం మంది పట్టణంలో ప్రైవేటు శుద్ధజల నీటి ప్లాంట్లపై ఆధార పడుతుండగా మిగతా యాభైశాతం మంది నల్లాలపై ఆధార పడుతున్నారు. ధర్మపురి పట్టణంలో ఐదువేల నల్లా కనెక్షన్లుండగా వీటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీరందడం లేదు. నూతనంగా నిర్మించిన బోలిచెరువు పథకం ద్వారా సరఫరా చేయాలని యోచించినా, చెరువులో నీరు లేకుండా పోయింది. దీంతో ప్రధానంగా మిషన్‌ భగీరథ పైపులైను పథకం ద్వారానే సరఫరా అయ్యే నీటిపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ పథకం ప్రధాన గ్రిడ్‌ పైపులైన్లకు బుద్దేశ్‌పల్లి, బుగ్గారం మండలంలోని పలు గ్రామాల్లో లీకేజీలు ఏర్పడటంతో స్థానికులకు నీటికోసం ఇక్కట్లు తప్పడం లేదు. వారానికోమారు ఒక్కోచోట గండి పడటంతో ప్రధాన పైపులైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. గత్యంతరం లేక పురపాలకసంఘం అధికారులు గోదావరినది పురాతన పైపులైనుకు అనుసంధానం చేశారు. కాగా గాంధీ విగ్రహ కూడలి వద్ద కింది ప్రాంతంలో పైపులైను దెబ్బతినడంతో అనుసంధానం చేయలేకపోతున్నారు. వేసవి దృష్ట్యా మిషన్‌ భగీరథ పైపులైను ద్వారా పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆయా అంశాలను ‘న్యూస్‌టుడే’ పుర కమిషనర్‌ సీహెచ్‌ రమేష్‌ దృష్టికి తీసుకువెళ్లగా... తాగునీటి సరఫరా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నామన్నారు. ప్రధానంగా మిషన్‌ భగీరథ పథకం పైపులైను లీకేజీలతో కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయని... వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని