logo

మృగశిరలోనూ మండిన ఎండ!

ప్రతి వేసవిలోనూ సాధారణంగా రోహిణి కార్తెలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై మృగశిర మొదలైన తరువాత క్రమంగా తగ్గుముఖం పడతాయి..

Updated : 10 Jun 2023 05:41 IST

తనుగులలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌ క్యాంపు : ప్రతి వేసవిలోనూ సాధారణంగా రోహిణి కార్తెలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై మృగశిర మొదలైన తరువాత క్రమంగా తగ్గుముఖం పడతాయి.. కానీ ఈ సారి మాత్రం మృగశిర కార్తె వచ్చినా వేడి తగ్గడం లేదు సరికదా మరింత పెరుగుతోంది.. ఈ వేసవిలోనే అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగులలో శుక్రవారం 46.5 డిగ్రీల సెల్సియస్‌ పగటి ఉష్ణోగ్రత నమోదైంది.. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 45.3, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 44.9, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 44.8, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌లో 42.4 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 39.0 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో పగలూ రాత్రీ అనే తేడా లేకుండా పూర్తిగా వేడి వాతావరణం అలుముకుని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ కారణాలు..

వానాకాలం వర్షాన్ని కురిపించే నైరుతి రుతుపవనాలు ఈసారి వారం రోజులు ఆలస్యంగా కేరళను తాకాయి. ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణకు నైరుతి చేరుకునే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మబ్బులు కమ్ముకోకపోవటంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి ఎండతీవ్రత చాలా పెరుగుతోంది. జూన్‌ 21వ తేదీ వరకు పగటిపూట సమయం పెరుగుతూ ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి ఎక్కువసేపు ఉండి ఎండప్రభావం అధికంగా చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు గాలిలో తేమ 30 శాతానికి తగ్గటం, వడగాలులు వీయడం, పంట పొలాలన్నీ నూర్పిడి కావటం, నేల పైపొరల్లోని తేమ పూర్తిగా ఆవిరి కావటం, రుతుపవనాల రాకకు ముందుగా వాతావరణ మార్పులు తదితర కారణాలతో ఎండ తీవ్రత ఎక్కువైనట్లు జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. రుతుపవనాలు వస్తే సముద్రం పైనుంచి చల్లని గాలులు వీచి మన ప్రాంతంలోనూ గాలిలో తేమశాతం పెరగటం, మబ్బులు కమ్ముకోవటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని