logo

ఆహ్లాదం.. నిర్వహణ అధ్వానం!

జనానికి ఆహ్లాదం కోసం హుజూరాబాద్‌లోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నాలుగేళ్ల క్రితం రూ.45 లక్షలతో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు.

Published : 10 Jun 2023 04:51 IST

కొలనులో మురుగు

జనానికి ఆహ్లాదం కోసం హుజూరాబాద్‌లోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నాలుగేళ్ల క్రితం రూ.45 లక్షలతో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. విలువైన పూలమొక్కలు, గడ్డిజాతులు, రంగురంగుల కళాకృతులు, కుర్చీలు, నీటిని వెదజల్లే ఫౌంటేన్‌తో పార్కు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచేది. చిన్నారులకు క్రీడా పరికరాలతో మంచి ఆటవిడుపుగా ఉండేది. 2020లో కొవిడ్‌ రావడంతో దాదాపు రెండేళ్లపాటు తెరవ లేదు. ఏడాదిగా తెరుస్తుండగా ఉదయం వేళలో కొందరు వ్యాయామం కోసం వస్తుండగా, సాయంత్రం నుంచి రాత్రి వరకు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఆటలాడుతూ సేదతీరుతున్నారు. పార్కులో వ్యాయామ పరికరాలు, ఫౌంటెన్‌, చిన్నారులకు వివిధ రకాల క్రీడాపరికరాలు ఉన్నా వాటిలో చాలా వరకు నిర్వహణ లేకుండా పోయాయి. పురపాలిక ఆధ్వర్యంలో పార్కు నిర్వహిస్తుండగా పారిశుద్ధ్య నిర్వహణ సరిగా ఉండటం లేదు. తినుబండారాల కవర్లు, చెత్తాచెదారం పార్కులో ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. పిచ్చి మొక్కలు పెరిగినా తొలగించేవారే లేరు. ఫౌంటేన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన కొలనులో నీరు దుర్వాసన వస్తోంది. ఈ విషయమై ఛైర్‌పర్సన్‌ రాధికతో మాట్లాడగా పార్కును పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చూస్తామని చెప్పారు. ఉదయం, సాయంత్రం పర్యవేక్షణ బాధ్యతలను కార్యాలయ సిబ్బందికి అప్పగిస్తామని, ఆటవస్తువులు, జిమ్‌, కొలను, ఫౌంటేన్‌ తదితర సామగ్రిని మరమ్మతు చేయిస్తామని తెలిపారు.

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌ పట్టణం

పాడైపోయిన చిన్నారుల ఆటపరికరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని