logo

దావోస్ లో పారిశ్రామిక కాంతిరేఖ

పారిశ్రామిక ప్రగతికి కీలక వేదికగా పరిగణించిన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్య్యూఈఎఫ్‌)లో కర్ణాటక ప్రభుత్వం తొలి రోజే దూకుడు ప్రదర్శించింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నేతృత్వంలోని బృందం దావోస్‌ సమావేశంలో ప్రపంచ వ్యాపార దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించింది

Published : 24 May 2022 02:28 IST

వ్యాపార దిగ్గజాలతో బొమ్మై సమాలోచనలు

ఈనాడు, బెంగళూరు : పారిశ్రామిక ప్రగతికి కీలక వేదికగా పరిగణించిన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్య్యూఈఎఫ్‌)లో కర్ణాటక ప్రభుత్వం తొలి రోజే దూకుడు ప్రదర్శించింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నేతృత్వంలోని బృందం దావోస్‌ సమావేశంలో ప్రపంచ వ్యాపార దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించింది. ముందుగా ప్రకటించినట్లు ఒప్పందాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా కార్యాచరణ లక్ష్యంతో ఈ భేటీలు కొనసాగాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం నాటి సమావేశంలో ముఖ్యమంత్రి పలు సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు.

లులు ఒప్పందం..

లులు సంస్థ ప్రతినిధితో ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి

అబుదాబికి చెందిన విఖ్యాత లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌తో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2022-23లో ప్రారంభమయ్యే ప్రాజెక్టులో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు షాపింగ్‌ కాంప్లెక్సులు, హైపర్‌ మార్కెట్లు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రక్రియ చేపడతారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కనీసం 10 వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి సాధ్యమవుతుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఏసీఎస్‌ డాక్టర్‌ ఈవీ రమణారెడ్డి, లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ ఎ.వి.అనంతరామ్‌ ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి బొమ్మై సమక్షంలో మార్చుకున్నారు.

ఔషధ, ఎఫ్‌ఎంసీజీలో..

‘బియాండ్‌ ద బెంగళూరు’ పథకంలో భాగంగా భారత్‌కు చెందిన ఫార్మా, ఆహార, వ్యవసాయ, ఏరోస్పేస్‌ తదితర సేవల సంస్థ జుబులియంట్‌ భార్టియా గ్రూప్‌తో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. ధార్వాడలో ఎఫ్‌ఎంసీజీ పార్క్‌, దేవనహళ్లిలోని పది ఎకరాల స్థలంలో జుబిలియంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ సెంట్రలైజ్డ్‌ కిచెన్‌, జుబిలియంట్‌ బయోసిస్‌ ఆర్‌అండ్‌డీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులతో 10 వేల మందికి ఉపాధి సాధ్యమవుతుంది. జుబిలియంట్‌ సంస్థ చైర్మన్‌ హరిశంకర్‌ భార్టియా, గ్లోబల్‌ చీఫ్‌ అజయ్‌ ఖన్నాలతో ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుపై చర్చించారు.

హిటాచీ- ఈవీ యూనిట్‌

హిటాచీ సీఈఓ క్లాడియా ఫాచిన్‌తో బొమ్మై

విద్యుత్తు వాహన (ఈవీ) రంగంలో విశిష్ట ప్రాజెక్టులపై దృష్టి సారించిన రాష్ట్రం.. ఇంధన రంగంలో ప్రపంచ అగ్రగామి హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు వాహన ఛార్జింగ్‌ యూనిట్‌లు, విడి భాగాల యూనిట్‌లను హిటాచీతో కలిసి ఏర్పాటు చేయనుంది. బెంగళూరులోని ఇంధన, డిజిటలైజేషన్‌ రంగాల నైపుణ్యాన్ని పూర్తిగా వినియోగించుకుని దొడ్డబళ్లాపురలో క్వాలిటీ ఇన్‌స్ట్రుమెంట్‌ యూనిట్‌, బెంగళూరులో ఇంజినీరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ రెండు కేంద్రాల్లో కనీసం నాలుగు వేల మంది ఇంజినీర్లకు ఉపాధి సాధ్యమవుతుంది. సంస్థ అధ్యక్షులు, సీఈఓ క్లాడియో ఫాచిన్‌తో ముఖ్యమంత్రి బొమ్మై ఈ ఒప్పందంపై చర్చలు జరిపారు.

ఆరోగ్య రంగంలో..

ఆరోగ్య రంగంలో పరిశోధనలు, ప్రపంచ శ్రేణి చికిత్సలు అందించే దిశగా సీమెన్స్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం దోహదపడనుంది. బెంగళూరులో మ్యాగ్నెటిక్‌ ఇమేజింగ్‌, డయోగ్నస్టిక్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ఆర్‌అండ్‌డీ ప్రాజెక్టులు చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. రానున్న సెప్టెంబరులో బొమ్మసంద్రలో వైద్య ఉపకరణాల తయారీ యూనిట్‌, ధార్వాడ, తుమకూరు, మైసూరుల్లో మరిన్ని యూనిట్లను స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం రెండు వేలకు పైగా ఇంజినీర్లకు ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి దొరుకుతుంది. సంస్థ సీఈఓ బెర్న్డ్‌ మోంటగ్‌తో ముఖ్యమంత్రి బొమ్మై, భారీ పరిశ్రమల మంత్రి మురుగేశ్‌ నిరాణి, ఏసీఎస్‌ డాక్టర్‌ ఈవీ రమణారెడ్డి చర్చించారు.

మరిన్ని సంస్థలతో..

హీరో సంస్థ చైర్మన్‌ పవన్‌ ముంజాలతో చర్చలు

విద్యుత్తు వాహన ఉత్పత్తులు, సాంకేతికత సంస్థ సహకారంతో స్థాపించే ఆధునిక ఈవీ ఉత్పాదన కేంద్రం, విద్యార్థులకు పారిశ్రామిక 4.0 డిజిటల్‌ సాంకేతికతపై శిక్షణ, స్మార్ట్‌ సిటీ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్స్‌ సిస్టమ్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. నంజనగూడులో ఇన్‌స్టంట్‌ కాఫీ కర్మాగార ఆధునికీకరణ, విస్తరణ ప్రక్రియలు చేపట్టేందుకు నెస్లె సంస్థ ముందుకు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని