logo

ఫీజుల భారం..మేం మోయలేం

బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో (వీఎస్కేయూ) విద్యార్థులకు చదువులు భారమయ్యాయి. పదవీ (డిగ్రీ) ప్రమాణ పత్రాలు పొందడానికి విద్యార్థులు అధిక రుసుములు చెల్లించే వాతావరణం నెలకొందని విద్యార్థులు,

Published : 30 Jun 2022 00:46 IST

వీఎస్కేయూ తీరుపై విద్యార్థుల ఆక్రోశం


బళ్లారి వీఎస్కేయూ పరిపాలన భవనం

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో (వీఎస్కేయూ) విద్యార్థులకు చదువులు భారమయ్యాయి. పదవీ (డిగ్రీ) ప్రమాణ పత్రాలు పొందడానికి విద్యార్థులు అధిక రుసుములు చెల్లించే వాతావరణం నెలకొందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 2020-21లో డిగ్రీ ముగించిన విద్యార్థులు ప్రమాణ పత్రాలు పొందడానికి జూన్‌ 25న రూ.2,500 రుసుములు చెల్లించాల్సి ఉండాలి. ఐదు రోజులు ఆలస్యంగా రుసుములు చెల్లించే వారికి జరిమానా రూ.200, ఆరో రోజు నుంచి 10 రోజులు లోపు చెల్లిస్తే రూ.500, 11వ రోజు నుంచి 30 రోజులు రుసుములు చెల్లించే విద్యార్థులు రూ.7,000లు, అనంతరం రుసుములు చెల్లించే విద్యార్థులు రూ.10వేలు జరిమానా విధించాలని నిబంధనలు పెట్టింది. ఈ రుసుములు విద్యార్థులకు భారంగా మారాయి. ఉదాహరణకు 2015లో పదవీ(డిగ్రీ) ముగిసిన విద్యార్థులు ప్రమాణ పత్రాలు పొందడానికి రూ.11,940లు చెల్లించాల్సి ఉంటుంది.

పదివేల మంది ఉత్తీర్ణత

బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లాలు వస్తాయి. ఏటా సుమారు 10వేలమందికిపైగా విద్యార్థులు స్నాతకోత్తర, డిగ్రీ ప్రమాణ పత్రాలు పొందుతారు. వారిలో 2,500 మంది విద్యార్థులు స్నాతకోత్తర పదవి ముగిస్తే మిగిలిన విద్యార్థులు డిగ్రీ, డిప్లొమా ముగిసిన వారు ఉంటున్నారు. 10వేల మంది విద్యార్థులు ప్రమాణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఆదేశాలు ప్రకారం స్నాతకోత్తర, డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు రూ.2,500, విదేశీ విద్యార్థులు రూ.10,150లు, అనుపస్థితిలో (నేరుగా కాకుండా) పోస్టల్‌ ద్వారా డిగ్రీ ప్రమాణ పత్రాలు పంపితే రూ.19,200 చెల్లించాల్సి ఉంటుంది. పీహెచ్‌డీ అభ్యర్థులు రూ.3,500 రుసుము చెల్లించాలి. 2020-21 ఏడాది కంటే ముందు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రూ.5,940 రుసుములతోపాటు, జరిమానా కూడా చెల్లించి ప్రమాణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. రుసుములు పెంచడం వల్ల విద్యార్థులతో పాటు, కళాశాల ప్రధాన ఆచార్యులు విశ్వవిద్యాలయంపై తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెంచిన రుసుములు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆమోదంతోనే పెంచాం... బళ్లారి వీఎస్కేయూలో డిగ్రీ పట్టాలు పొందే విద్యార్థులు రుసుములుపై విద్యా విషయక పరిషత్‌, సిండికేట్‌ సభ ఆమోదించిందని మూల్యాంకనం రిజిస్ట్రార్‌ రమేష్‌ ఓంలేకార్‌ తెలిపారు. 2020-21లో డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు 11 రోజుల్లో ప్రమాణ పత్రాలు పొందాలంటే రూ.7000లు చెల్లించాలి. 30 రోజుల్లోపు ప్రమాణ పత్రాలు పొందేవారు రూ.10వేలు, అనంతరం ప్రమాణ పత్రాలు పొందే విద్యార్థులు రూ.7000లు, జరిమానా రూ.10,000 చెల్లించాలన్నారు.

సమితిలో సభ్యులు వీరే...

విశ్వవిద్యాలయంలో రుసుములు నిర్ధారించే సమితిలో ఉపకులపతి సిద్దు పి.అలగూరు, పరిపాలన రిజిస్ట్రార్‌ సి.ఎస్‌.పాటిల్‌, మూల్యాంకనం రిజిస్ట్రార్‌ రమేష్‌ ఓంలేకార్‌, వివిధ డిపార్ట్‌మెంట్‌ డీన్లు, సిండికేట్‌ సభ్యులు మల్లికార్జున మర్చేడు, విద్యావిషయక పరిషత్‌ సభ్యులు డా.విజయకుమార్‌, బి.మలశెట్టి, కళాశాల అభివృద్ధి మండలి నిర్దేశకులు, విద్యార్థి క్షేమాభివృద్ధి మండలి సభ్యులు, ఎస్‌.సి, ఎస్‌.టి విభాగం సభ్యులు, కొప్పళ, గవిసిద్దేశ్వర పదవి కళాశాల ప్రధాన ఆచార్యులు, కురుగోడు ప్రభుత్వ పదవి కళాశాల ప్రధాన ఆచార్యులు, తదితరులు ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని