logo

హనుమంతప్ప..హల్‌చల్‌ చేశాడప్పా

అర్ధరాత్రి సమయంలో మద్యం లేదన్నారని, తనతో తెచ్చుకున్న మద్యం కూడా తాగనివ్వని కారణంగా సింధనూరు శ్రీపురం కూడలిలోని ఓ రెస్టారెంట్‌లో కలబురగి వాసి హనుమంతప్ప తన రివాల్వర్‌తో గాలిలో కాల్పులు జరిపి అలజడి సృష్టించాడు.

Published : 30 Nov 2022 00:38 IST

మద్యం లేదన్నందుకు తుపాకీతో కాల్పులు

పోలీసుల అదుపులో ఉన్న హనుమంతప్ప

సింధనూరు, న్యూస్‌టుడే: అర్ధరాత్రి సమయంలో మద్యం లేదన్నారని, తనతో తెచ్చుకున్న మద్యం కూడా తాగనివ్వని కారణంగా సింధనూరు శ్రీపురం కూడలిలోని ఓ రెస్టారెంట్‌లో కలబురగి వాసి హనుమంతప్ప తన రివాల్వర్‌తో గాలిలో కాల్పులు జరిపి అలజడి సృష్టించాడు. భయంతో పరుగులు తీసిన జనం పోలీసులకు కబురు పెట్టగా..అప్పటికే కారులో వెళ్లిపోతున్న ఆ వ్యక్తిని సింధనూరు పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. రాత్రి పొద్దుపోయాక ఈ సంఘటన చోటు చేసుకుంది. హనుమంతప్ప కలబురిగి వెళ్తూ మార్గం మధ్యలో కుటుంబంతో కారులో రెస్టారెంట్‌కు చేరుకున్నాడు. మద్యం కావాలని అడగ్గా..రెస్టారెంట్‌ యాజమాన్యం తమ వద్ద మద్యం లేదన్నారు. దీంతో కారులో ఉన్న తన మద్యం సీసా తెచ్చుకుని తాగబోయాడు. దాన్ని సిబ్బంది అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన హనుమంతప్ప కోపంతో ఊగిపోతూ బయట కారులో ఉన్న రివాల్వర్‌ తెచ్చి వీరంగం సృష్టించాడు. గాలిలో ఓ రౌండ్‌ కాల్చాడు. దీంతో జనం బెంబేలెత్తి తలోదిక్కుకూ పరుగులు తీశారు. యాజమాన్యం పోలీసులకు కబురు పెట్టారని తెలుసుకుని పారిపోగా..గ్రామీణ పోలీసులు మస్కి మార్గంలో కొంతదూరం వెంబడించి ఆయన్ని పట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న హనుమంతప్పను ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఉదయం స్టేషన్‌కు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కుటుంబాన్ని అదే కారులో తమ ఊరికి పంపేశారు. హనుమంతప్ప కలబురగిలో రాజకీయ వ్యక్తులతో పరిచయాలు ఉన్న వ్యక్తి, మద్యం వ్యాపారి అని తెలుసుకున్నారు. స్థానిక గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని