logo

రొయ్య.. ధర మోసమయ్యా..!

రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న బళ్లారి జిల్లా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు.

Published : 30 Nov 2022 00:38 IST

నిలిచిన విక్రయాలతో రైతుల విలవిల
పెట్టుబడులు కూడా రావడమే కష్టం
విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలి

చేపల కోసం వల వేస్తున్న రైతులు బుజ్జిరాజు

బళ్లారి, న్యూస్‌టుడే: రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న బళ్లారి జిల్లా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. మూడు నెలల క్రితం కిలో రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయించే రొయ్యలు నేడు రూ.175 నుంచి రూ.350లకు పడిపోయినా..అడిగే నాథుడు లేకుండాపోయాడు. మైనింగ్‌, జీన్స్‌ గార్మెంట్‌ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన బళ్లారి జిల్లా నేడు రొయ్యల పెంపకంలో మొదటి స్థానంలో నిలిచింది. బళ్లారి-6 వేలు, యాదగిరి-3 వేలు, రాయచూరు-1500, కరావలి జిల్లాలైన చిక్కమగళూరు, ఉడుపి జిల్లాలలో మొత్తం 2 వేల టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. పదేళ్ల క్రితం 500 ఎకరాల విస్తీర్ణానికి పరిమితమైన మత్స్య సంపద నేడు కురుగోడు, సిరుగుప్ప, కంప్లి తాలూకాల్లో సుమారు 3వేల ఎకరాలకు విస్తరించింది. ఇందులో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. 1,500 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. సాగుకు పనికిరాని చౌడు భూమిని ఇందుకు వినియోగిస్తున్నారు. తుంగభద్ర జలాశయంలో నీటి వనరులు ఉన్నా, మంచి నీటిలో రొయ్యల పెంపకం కష్టమైంది. దీంతో రైతులు వరి పొలాల నుంచి వృథాగా వాగులకు విడుదల చేసిన నీరు, వర్షపునీటిని నిల్వ చేసి చేపలు, రొయ్యల పెంపకానికి ఉపయోగించుకుంటున్నారు. 

అధికారి శివన్నను కలసి చేపలను చూపుతున్న రైతులు

జిల్లాలో 6వేల టన్నుల ఉత్పత్తి

బళ్లారి జిల్లాలో 1,500 ఎకరాల్లో 3 వేల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. చేపలు ఏడాదికి ఓసారి వస్తే రొయ్యలు ఏడాదికి రెండు సార్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాదికి 6వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. జిల్లాలో ఉత్పత్తి అయిన రొయ్యలను 90 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కర్ణాటక నుంచి అమెరికా, చైనా, జపాన్‌ దేశాలకు ఏటా 1.25 లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతుండగా రూ.48,000 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఏడాది ఈక్వెడార్‌లో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. దీంతో ధర ఒక్కసారిగా పడిపోయిందని మత్య్సశాఖ సహాయ సంచాలకుడు శివన్న తెలియజేస్తున్నారు. హైదరాబాద్‌, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లోని శీతల గిడ్డంగుల్లో 75 శాతం రొయ్యలు నిల్వ ఉన్నాయి. వాటిని విక్రయించిన తర్వాత వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనవరి తర్వాత మార్కెట్‌లో మంచి అవకాశాలు ఉండవచ్చని అధికారి తెలిపారు. బళ్లారి జిల్లాలో రొయ్యలు ఉత్పత్తి చేస్తున్నా వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంఏ, ఎంకాం , డిప్లొమా తదితర ఉన్నత చదువులను అభ్యసించిన వారు, ఉద్యోగాలు కూడా వదులుకుని మరీ ఈ వృత్తిలో చేరారు. మార్కెట్‌ అనుకూలంగా లేకపోవడంతో కోలుకోకపోతే భవిష్యత్తు అంధకారమేనని వారు ఆందోళన చెందుతున్నారు.

దిగుబడి బాగా వచ్చిందని చూపుతున్న రైతు శ్రీనివాసరావు

ఖర్చులు తడిసిమోపెడు

కర్ణాటక సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్‌లో చేపలు, రొయ్యలు ఉత్పత్తి చేస్తున్న రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ.3.75లకు ఇస్తున్నారు. దాన్ని రూ.1.50లకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కర్ణాటకలో రొయ్య రైతుల నుంచి యూనిట్‌కు రూ.7లు వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా విద్యుత్తు యూనిట్‌ ఛార్జీలు తగ్గిస్తే అనుకూలంగా ఉంటుందని ఎమ్మిగనూరు గ్రామానికి రొయ్యలు ఉత్పత్తి చేస్తున్న రైతులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు ‘న్యూస్‌టుడే’కి తెలిపారు. ప్రస్తుతం రొయ్యల ధరలుపడిపోయాయి. ఏప్రిల్‌లో 30 కౌంట్‌ రకం రూ.600 ఉండగా, 60 కౌంట్‌ రూ.400లు, 80 కౌంట్‌ కిలో రూ.250లు ధరలు ఉండటంతో అనుకూలంగా ఉండేది. ప్రస్తుతం 100 కౌంట్‌ రూ.170, 90 కౌంట్‌ రూ.180, 80 కౌంట్‌ రూ.190, 70 కౌంట్‌ రూ.200, 60 కౌంట్‌ రూ.220, 30 కౌంట్‌ రూ.360కి ధర పడిపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు విచారం వ్యక్తం చేశారు.

రొయ్యలను పట్టుకుని చూపుతున్న రైతులు జానకిరామ్‌, రాఘురావ్‌ రాజు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని