logo

నకిలీ డబ్బు.. రాజకీయం గబ్బు

విధానసభ ఎన్నికలు, సంక్రాంతి మొదలు శివరాత్రి పండుగ నేపథ్యంలో నిర్వహించే జాతరలు నకిలీ నోట్ల చలామణికి అడ్డాగా మారాయి.

Published : 27 Jan 2023 03:08 IST

ఎన్నికల వేళ చెలరేగుతున్న ముఠాలు

ఈనాడు, బెంగళూరు : విధానసభ ఎన్నికలు, సంక్రాంతి మొదలు శివరాత్రి పండుగ నేపథ్యంలో నిర్వహించే జాతరలు నకిలీ నోట్ల చలామణికి అడ్డాగా మారాయి. ఈ పరిస్థితిని అనువుగా చేసుకుని ముఠాలు చెలరేగుతున్నట్లు రాష్ట్ర పోలీసులు గుర్తించి.. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. నకిలీ నోట్ల చలామణికి అంతర్జాతీయ స్థాయి ముఠాలూ రాష్ట్రంలో ప్రవేశించినట్లు బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసు అధికారులు వెల్లడించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠా ఒకటి సాధారణ నగదుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో నోట్లను తయారు చేయటం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. దాడుల్లో దొరికిన డబ్బు తక్కువైనా.. ఈ ఘటనలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువైన నకిలీ సొమ్ము ప్రవహించిందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్షర జ్ఞానం లేని గ్రామీణ ప్రజలు, రైతులు, భక్తులను లక్ష్యంగా చేసుకుని సాగే నకిలీ నోట్ల దందాలో స్థానిక యువత కూడా భాగస్వాములుగా మారినట్లు విచారణ ద్వారా వెల్లడవుతోంది.


ఆరు ముఠాల హవా

* ఎన్నికలకు ఏడాది ముందుగానే రాష్ట్రంలో నకిలీ నోట్ల ముఠాల కదలికలు మొదలవుతాయని సీసీబీ అధికారి ఒకరు ‘ఈనాడు’ ప్రతినిధికి వివరించారు. గత సెప్టెంబరు నుంచి జనవరి 25 వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆరు ముఠాల నకిలీ దందాను పోలీసులు అడ్డుకున్నారు. వీటిల్లో కోట్ల రూపాయల విలువైన భారతీయ నగదు మొదలు అమెరికన్‌ డాలర్ల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* సెప్టెంబరు 9న కేరళకు చెందిన నకిలీ నోట్ల ముఠాకు చెందిన ప్రదీప్‌, సనాల్‌ అనే వ్యక్తులను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.500, రూ.2 వేల ముఖవిలువ కలిగిన రూ.50 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
* అక్టోబరు 12న హుబ్బళ్లి బస్టాండ్‌లో శివానంద, కాలయ్య, గురురాజ్‌ అనే వ్యక్తుల నుంచి రూ.200లు, రూ.100 ముఖ విలువ కలిగిన రూ.లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
* డిసెంబరు 14న రూ.1.10 కోట్ల విలువైన రూ.500 భారతీయ, 708 అమెరికన్‌ డాలర్లు, మరో 100 అమెరికన్‌ రసీదులను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకోగా వీటిని చలామణి చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నైజీరియన్‌ జాతీయులను అదుపులోనికి తీసుకున్నారు. ఇదే కేసులో తమిళనాడుకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
* జనవరి 3న బెంగళూరుకు చెందిన నిజాముద్దీన్‌, రజీమ్‌ అనే వ్యక్తులను అదుపులోనికి తీసుకున్న వీరి నుంచి రూ.500 ముఖ విలువ కలిగిన రూ.4.5లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు మూలమైన మంగళూరు వాసి డానియేల్‌ పోలీసులకు దొరికిపోయాడు.
* జనవరి 19న చిక్కబళ్లాపురలోని క్రైస్తవ సముదాయ వసతి నిలయంలో కోలారు, చింతామణి ప్రాంతాలకు విస్తరించిన నకిలీ నోట్ల ముఠా దందాను పోలీసులు ఛేదించగా, ఇదే రోజున ఆంధ్రకు చెందిన మరో ముఠా బెంగళూరులో పోలీసుల వలలో చిక్కింది.

ఎన్నికల నేపథ్యం

* మరో నాలుగు నెలల్లో విధానసభకు ఎన్నికలుండగా నకిలీ నోట్ల చలామణి రెక్కలు విప్పుతోంది. పార్టీల కేంద్ర కార్యాలయానికి ఏమాత్రం సంబంధం లేకుండా స్థానిక నాయకులు ఈ ముఠాలను ప్రోత్సహిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ఎన్నికల సమయాల్లో మొదలయ్యే ఈ దందా, అసెంబ్లీ, లోక్‌సభ స్థాయి ఎన్నికల్లో మరింత విస్తృతం అవుతుందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసే నకిలీ నోట్లు కేవలం గ్రామాలకే పరిమితం కావటం, వీటి వినిమయం కూడా స్థానిక వ్యాపారాల వద్దనే సాగిపోవడం ప్రస్తావనార్హం. బ్యాంకుల నుంచి వచ్చే ఫిర్యాదుల నేపథ్యంలో కేసులు నమోదు చేయటం, ఆలోగా ముఠాలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడం ఓ సంక్లిష్ట అంశంగా సీసీబీకి చెందిన ఓ ఉన్నతాధికారి వివరించారు. పార్టీ నేతలు కూడా వీటి విషయంలో అంటీ ముట్టనట్లుగా ఉంటాయి. ఈ దందాలను పార్టీలకు ఆపాదించలేమని ఆయన పెదవి విరిచారు.
* నకిలీ నోట్ల అక్రమాలు ఎక్కువగా రూ.500, రూ.2వేల నోట్లతో ముడిపడి ఉంటాయి. రానున్న ఐదు నెలల పాటు ఈ నోట్లను స్వీకరించే సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని సీసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ సభలు, ప్రచారాల సందర్భంగా నోట్ల చలామణి అధికంగా ఉంటుంది. వీటిపై ఆయా పార్టీల కార్యకర్తలు దృష్టి సారించాలని సూచించారు. నిరుద్యోగ యువకులు తమకు తెలియకుండానే ఈ దందాలో చిక్కుకునే ప్రమాదం ఉండటంతో అపరిచితుల సలహాలు, సూచనలు, వ్యాపార మార్గాలపై ఆకర్షితులు కారాదని హెచ్చరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని