logo

రాజకీయ రణకంకణం

విధానసభ ఎన్నికల తేదీ అధికారంగా ప్రకటించకపోయినా.. మూడు ప్రధాన పార్టీలూ ఎన్నికల నగారా మోగించాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే భాజపా ప్రచారం కాస్త నెమ్మదించినా శనివారంతో ఆ లోటూ పూడ్చారు.

Published : 29 Jan 2023 04:13 IST

బొమ్మై వాగ్బాణాలు

ఈనాడు, బెంగళూరు : విధానసభ ఎన్నికల తేదీ అధికారంగా ప్రకటించకపోయినా.. మూడు ప్రధాన పార్టీలూ ఎన్నికల నగారా మోగించాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే భాజపా ప్రచారం కాస్త నెమ్మదించినా శనివారంతో ఆ లోటూ పూడ్చారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి వెళ్లినా ఎన్నికల ప్రచారంగా పార్టీ ప్రకటించలేదు. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధార్వాడ, బెళగావిలో పాల్గొన్న కార్యక్రమాలు ఎన్నికల ప్రచారంగా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. శనివారం ఉదయం నుంచి మూడు కార్యక్రమాల్లో పాల్గొన్న అమిత్‌ షా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించారు. దాదాపు రెండు కిలోమీటర్ల పాటు ఆయన పాల్గొన్న రోడ్‌ షోకి వేలాదిగా కార్యకర్తలు విచ్చేశారు. ధార్వాడ, బెళగావి సరిహద్దులను కలుపుతూ సాగిన విజయ సంకల్ప యాత్ర రోడ్‌ షో కిత్తూరు కర్ణాటక భాజపా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

విజయసంకల్ప యాత్రలో అభివాదం చేస్తున్న అమిత్‌షా

రాజకీయ ప్రసంగం

డిసెంబరు చివరన మండ్య, బెంగళూరుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న అమిత్‌ షా.. పార్టీ బలహీన ప్రాంతాల్లో చైతన్యానికి శ్రమించారు. తాజా పర్యటనలో తమకు బలమైన ఉత్తర కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి పునాది వేశారు. ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించే విధానసభ ఎన్నికల్లో ఐదేళ్ల పాటు అధికారంలో ఉండే అవకాశం కల్పించాలని మనవి చేశారు. ఇదే సందర్భంగా ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్‌, జేడీఎస్‌లను వారసత్వ పార్టీలుగా ప్రకటించి ఎన్నికల కయ్యానికి కాలుదువ్వారు. జేడీఎస్‌కు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్‌ అధికారానికి సహకరిస్తుందని విశ్లేషించిన అమిత్‌ షా- పొత్తు రాజకీయాలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి జేడీఎస్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆరోపణలు రాజకీయ కోలాటానికి తెరలేపిపట్లే. జేడీఎస్‌ పంచరత్న రథయాత్ర కాకుండా తమ కుటుంబ సభ్యులందరూ కలిసి నవగ్రహ యాత్ర చేయాలని ఎద్దేవా చేశారు.

రాహుల్‌పైనే ఆశలు

ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ కోసం జాతీయ నేతల రాక అంతంత మాత్రమే. మొన్నటికి మొన్న బెంగళూరుకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించి వెళ్లారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్రధ్యుడు రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా నేతృత్వంలో ప్రజాధ్వని రాష్ట్రమంతా మోగుతోంది. ఇతర జాతీయ నేతల రాక ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జనవరి 30తో రాహుల్‌గాంధీ చేపడుతున్న జోడోయాత్ర ముగియనుంది. అనంతరం కర్ణాటక రాజకీయాలపై ఆయన పూర్తిగా దృష్టి సారిస్తారు. ఈ యాత్రలో భాగంగా సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో పర్యటించిన రాహుల్‌గాంధీ ఫిబ్రవరి నుంచి క్రమం తప్పకుండా ఇక్కడికి విచ్చేస్తారు. ప్రతి వారం రెండు కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రణాళిక తయారు చేసినట్లు పీసీసీ కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్‌ తెలిపారు. ఫిబ్రవరి నుంచి రాహుల్‌, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌ సింగ్‌ తదితరులు పర్యటిస్తారు. మార్చి తొలివారంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని సలీం తెలిపారు.

బెళగావి, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీకి ఓటమి భయం మొదలైందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలలో గెలిచేందుకు తమ స్థాయిని మరచి, దూషణలకు పాల్పడుతున్నట్లు విమర్శించారు. ఆ పార్టీ నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. బెళగావి జిల్లా ఎం.కె.హుబ్బళ్లిలో శనివారం నిర్వహించిన జనసంకల్ప యాత్రను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి బొమ్మై ప్రారంభించి మాట్లాడారు. కిత్తూరు కర్ణాటక విభాగంలో 2003 ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు అమిత్‌షా స్వయంగా వచ్చారని ప్రకటించారు. గతంలో కన్నా ఈసారి ఎక్కువ సీట్లు భాజపాకు వచ్చేలా ప్రజలు సహకరించాలని కోరారు. రాణి చెన్నమ్మ, సంగొళ్లి రాయణ్ణ, అమటేరు బాళప్ప వంటి వీరులకు ఇది జన్మస్థలమని గుర్తు చేశారు. భాజపా అధికారంలో ఉన్నప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హామీలను విశ్వసించవద్దని కోరారు. బెళగావి విభాగంలోని 18 నియోజకవర్గాలలో 15 చోట్ల గెలవాలనేదే లక్ష్యమని ప్రకటించారు. భాజపా రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మంత్రులు గోవింద కారజోళ, శశికళ జొల్లె తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


ఉత్సాహంగా విజయసంకల్పం

కుందగోళ రోడ్‌ షోలో పాల్గొన్న పార్టీ సానుభూతిపరులు

ధార్వాడ, న్యూస్‌టుడే : ధార్వాడ జిల్లా కుందగోళ నియోజవకర్గంలో శనివారం నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర అభియాన్‌కు చక్కని స్పందన లభించింది. కమలం బొమ్మలో రంగులు నింపి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓపెన్‌ టాప్‌ వాహనంపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, జగదీశ్‌ శెట్టర్‌, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, భాజపా రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి అరుణ్‌ సింగ్‌లతో కలిసి కుందగోళ వీధులలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ప్రధాన వీధులలో కాషాయపతాకాలు రెపరెపలాడాయి. చుట్టుపక్కల గ్రామాలు, నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన పార్టీ అభిమానులు అమిత్‌షా వాహనం ముందు నడిచారు.


పంచరత్న జోరు..

మాన్వి రోడ్‌షోలో శనివారం కుమారస్వామికి అపూర్వ స్వాగతం

కోలారు జిల్లాలో ప్రారంభమైన జేడీఎస్‌ పంచరత్న రథయాత్ర ప్రస్తుతం ఉత్తర కర్ణాటకలో జోరుగా కొనసాగుతోంది. శనివారం రాయచూరు, మాన్విల్లో కొనసాగిన యాత్రలో ఎప్పటిలాగే విభిన్న రకాల పూలమాలలు, గ్రామ వాస్తవ్యాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ యాత్రలో కుమారస్వామి, స్థానిక నేతలు మినహా.. రెండో శ్రేణి నాయకులు కనిపించకపోవటం చర్చకు దారితీస్తోంది. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ ఆరోగ్య రీత్యా ఈ యాత్రలో పాల్గొనలేకపోతుండగా, పార్టీ అధ్యక్షుడు సి.ఎం.ఇబ్రహీం పార్టీ కార్యకలాపాలకే పరిమితమయ్యారు. వారం రోజులుగా హాసన టికెట్‌ వివాదంతో రేవణ్ణ కుటుంబ సభ్యులు కుమారస్వామిపై విమర్శలకు దిగటం, భాజపా నేతలు కూడా ఈ అగ్నికి ఆజ్యం పోస్తూ వివాదాన్ని విస్తృతం చేస్తున్నారు. మొత్తంగా పంచరత్న యాత్రకు కుమారస్వామి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు