logo

వాద్రా, సిద్ధుపై లోకాయుక్తకు ఫిర్యాదు

ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని భాజపా బెంగళూరు దక్షిణ విభాగం అధ్యక్షుడు ఎన్‌.రమేశ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 03 Feb 2023 02:39 IST

లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన వివరాలకు సంబంధించి ఫొటోలు ప్రదర్శిస్తున్న భాజపా బెంగళూరు దక్షిణ విభాగ అధ్యక్షుడు ఎన్‌.ఆర్‌.రమేశ్‌

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని భాజపా బెంగళూరు దక్షిణ విభాగం అధ్యక్షుడు ఎన్‌.రమేశ్‌ డిమాండ్‌ చేశారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదికి పైగా భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, సిద్ధరామయ్య, కేజే జార్జ్‌, కృష్ణ భైరేగౌడ, యు.టి.ఖాదర్‌, ఎంబీ పాటిల్‌, జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, దినేశ్‌ గుండూరావు, ఎం.కృష్ణప్ప, హ్యారిస్‌, ప్రియకృష్ణ ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ 3,728 పుటల ఫిర్యాదును లోకాయుక్తకు గురువారం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్‌ అధికారులు పాండురంగ నాయక, జి.సతీశ్‌, అతుల్‌ కుమార్‌ తివారి, వస్త్రద్‌, వి.శంకర్‌, మనోజ్‌ రాజన్‌, డాక్టర్‌ పి.బోరేగౌడ, లీలా సంపిగె, చెలువరాజు, కృష్ణమూర్తిపైనా లోకాయుక్తకు ఫిర్యాదు చేశానని చెప్పారు. రాబర్ట్‌ వాద్రాకు వాటా ఉన్న డీఎల్‌ఎఫ్‌ సంస్థకు తావరకెరె సమీపంలోని గంగేనహళ్లి, వర్తూరు సమీపంలోని నరసీపుర, పెద్దనపాళ్య గ్రామం వద్ద అక్రమంగా భూములను కేటాయించారని ఆయన ఆరోపించారు. బీఎంటీసీ బస్టాప్‌లు, ఇందిరా క్యాంటీన్ల నిర్మాణం, పొలాలలో కుంటల నిర్మాణం, పాలికె పరిధిలో కుంటల నిర్మాణం తదితర పనులలో అక్రమాలు జరిగాయని తెలిపారు. అన్నింటికీ సంబంధించిన దాఖలాలను లోకాయుక్తకు అందజేశానని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని