logo

అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్‌ కసరత్తు

విధానసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. కీలక నేతలంతా కలిసి దాదాపు 150 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు.

Published : 03 Feb 2023 02:39 IST

సమావేశంలో పాల్గొన్న రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య, వీరప్పమొయిలీ, ఎంబీ పాటిల్‌ తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : విధానసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. కీలక నేతలంతా కలిసి దాదాపు 150 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల సమితి సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, ఎగువ సభలో ప్రతిపక్ష నేత బీకేహరిప్రసాద్‌, పీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పలుమార్లు ఇదే విషయంలో సమీక్షించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్‌ అత్యధిక చోట్ల విజయం సాధించవచ్చునని సమీక్షలు వెల్లడించాయని పార్టీ నేతలు వివరించారు. 130 చోట్ల విజయమే లక్ష్యమని తెలిపారు. వీలైనంత వేగంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని అధిష్ఠానం సూచించడంతో కాంగ్రెస్‌ నేతలు సమావేశమై చర్చించారు. ప్రతి నియోజకవర్గంపైనా పలు మార్లు చర్చించారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ సమితి నివేదికలను పరిశీలించారు. అభ్యర్థుల విజయావకాశాలపై విశ్లేషించారు. ప్రస్తుత శాసనసభ్యుల్లో తొమ్మిది మంది మినహా మిగతా వారందరికీ టిక్కెట్‌ ఇవ్వాలని తీర్మానించారు. కొందరు శాసనసభ్యులు వయోభారం, ఇతర కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొంటారని సమాచారం. అభ్యర్థుల ఎంపిక సమయంలో ఉదయ్‌పుర్‌ తీర్మానాలను అమలు చేయాలని అధిష్ఠానం సూచించింది. ఏ నాయకుడైనా పార్టీలో చేరిన తక్షణం టిక్కెట్‌ పొందే అవకాశానికి ఈసారి స్వస్తి చెబుతున్నారు.

త్యాగాలకు సిద్ధం

కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఎన్నికల సమితి సమావేశం నిర్వహిస్తున్నామని, విధానసభకు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే వారందరికీ అవకాశాలు కష్టమని, నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ త్యాగాలు చేయాలన్నారు. అభ్యర్థుల పేర్లను అధిష్ఠానానికి సిఫార్సు చేస్తామన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపిక ఘట్టం సవాల్‌గా మారిందన్నారు. కాంగ్రెస్‌ గెలుపు కచ్చితమని తేల్చిచెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని