logo

కొత్తకొత్తగా దూసుకెళదామా!

ప్రజలకు ప్రాణసంకటంగా మారిన కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం విద్యుత్తు ఆధారిత వాహనాలను ప్రోత్సాహిస్తోంది.

Published : 02 Jun 2023 02:36 IST

నగరానికి అనువైనదిగా గుర్తించిన ‘మోనో కారు’ వ్యవస్థ

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ప్రజలకు ప్రాణసంకటంగా మారిన కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం విద్యుత్తు ఆధారిత వాహనాలను ప్రోత్సాహిస్తోంది. ఈ క్రమంలోనే వీటి కొనుగోలు విపరీతంగా పెరుగుతోంది. ప్రజలూ ఈ తరహా వాహనాల విషయంలో ఆసక్తి పెంచుకుంటున్నారు. వాహనాల ఛార్జింగ్‌ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విభాగాల్లో ఛార్జింగ్‌ కేంద్రాల స్థాపన పెరిగిపోతోంది. ప్రజా రవాణా రంగంలో ప్రత్యేక ముద్రవేసుకున్న కె.ఎస్‌.ఆర్టీసీ, బీఎంటీసీ డీపోల్లో వాహనాలకు విద్యుత్తు శక్తి నింపే వేగవంత వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్‌ వాహనాల కోసం వివిధ బెస్కాం కార్యాలయాల ఆవరణల్లో ఇదే తరహా యంత్ర పరికరాలు సిద్ధం చేశారు. విద్యుత్తు వాహనాల సాయంతో నగరంలో పొగ నివారణ సాధ్యమవుతున్నట్లు మాలిన్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. కొన్ని విద్యాలయాల్లో విద్యుత్తు ఆధారిత వాహనాలు తప్ప మిగతా వాటికి అవకాశం కల్పించకుండా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం నగరంలో బీఎంటీసీ పరిధిలోనే విద్యుత్తు ఆధారిత బస్సులు 600 దాకా సంచరిస్తున్నాయి. వాటి నిర్వహణ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలూ తలెత్త లేదని అధికారులు తెలిపారు. ఆరుగంటల ఛార్జింగ్‌ చేసే ఎకాఎకీ 160 కిలోమీటర్ల దాకా సంచరించే వీలుంది. మరోవైపు ప్రయోగాత్మకంగా బెంగళూరు- మైసూరు మధ్య అత్యాధునిక విద్యుత్తు బస్సులను నడిపారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో తిరుపతి, మైసూరు, హసన, చిక్కమగళూరు, దావణగెరె, చిత్రదుర్గ తదితర ప్రాంతాలకూ కొత్త సేవలు మొదలు పెట్టారు. ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేవు. కొత్త మార్గాలకూ కాలుష్యరహిత వాహనాలు పరుగులు తీయడానికి సిద్ధం చేస్తున్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, ముంబయి నగరాలకూ విద్యుత్తు వాహనాలు నడుపుతామని అధికారులు తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే వాటి కోసం వివిధ హోటళ్లు, విశ్రాంతి మందిరాలకు సమీపంలో ఛార్జింగ్‌ వ్యవస్థలు సమకూరుస్తున్నారు.

రాజధానిలో విరవిగా విద్యుత్తు ఛార్జింగ్‌ కేంద్రాలు

*నగరంలో వాయు మాలిన్యం నియంత్రించేందుకు ‘మోనో కారు’ సేవలను అందించేందుకు పథకాలను సిద్ధం చేశారు. అయస్కాంతం పట్టాలు ఆధారంగా ఈ ప్రజా రవాణా వ్యవస్థ పనిచేస్తుంది. వివిధ దేశాల్లో ఇది అందుబాటులోకి రావడంతో బెంగళూరుకూ వర్తింప చేయాలని యోచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఈ మార్గాన్ని నిర్మించవచ్చని గుర్తించారు. మినర్వ కూడలి- హెడ్సన్‌ సర్కిల్‌- మెజిస్టిక్‌ మధ్య ‘మోనో’ మార్గాలు నిర్మించేందుకు కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నారు. వీటి బోగీల్లో ఒక్కోదానిలో 50 మంది ఆసీనులై ప్రయాణించే వీలుంటుందని నిపుణులు వివరించారు.


విద్యుత్తు ఆధారిత స్లీపర్‌ కోచ్‌ బస్సులివిగో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని