బాబుకు తోడుగా గర్జించిన గనినాడు
తెదేపా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును ఖండిస్తూ గనినాడు బళ్లారి నగరంలో ఆయన అభిమానులు కదం తొక్కారు.
అరెస్టుపై బళ్లారిలో అభిమానుల కన్నెర్ర
వేలాదిగా తరలొచ్చి నిరసన
ప్రదర్శనగా వస్తున్న మహిళ లోకం
బళ్లారి, న్యూస్టుడే : తెదేపా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును ఖండిస్తూ గనినాడు బళ్లారి నగరంలో ఆయన అభిమానులు కదం తొక్కారు. బళ్లారి నగరం నుంచే కాకుండా వేర్వేరు ప్రాంతాలు నుంచి తరలివచ్చిన అభిమానులు ప్రవాసాంధ్రులు శాంతియుతంగా ఆందోళన నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. వివిధ తెలుగు సంఘాలు, నారా చంద్రబాబునాయుడు అభిమానులు, నందమూరి అభిమానులు, ఎన్.టి.ఆర్.అభిమానులు, పవన్ కల్యాణ అభిమానుల సంఘం, బళ్లారి కమ్మ సంఘం, ప్రవాసాంధ్రులు, అఖిలభారత కమ్మ యువ సంఘాలతో పాటు కుడతిని, సిరుగుప్ప కమ్మ సంఘాల సభ్యులు వివిధ క్యాంపుల నుంచి అభిమానులు స్థానిక దుర్గమ్మ దేవస్థానానికి తరలివచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయించి 101 కొబ్బరి కాయలు కొట్టారు. అక్కడి నుంచి దుర్గమ్మ గుడి భూగర్భ వంతెన మీదుగా, రెండు వరుసల రహదారి నుంచి గడిగి చెన్నప్ప కూడలికి చేరుకుని రహదారిపై బైఠాయించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సైకో పోవాలి....సైకిల్ రావాలి’ అని నిప్పులు చెరిగారు. నారా చంద్రబాబునాయుడిపై ఉన్న అక్రమ కేసులను తొలగించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 20 నిమిషాల పాటు రహదారిపై బైఠాయించారు. ప్రవాసాంధ్రుడు, భూవిజ్ఞానశాస్త్రవేత్త చల్లా అమరేంద్రనాథ్ చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి తీసుకుని వచ్చారని తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్ల్లు గడిచినా రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. అభివృద్ధిలో పోటీపడాలే తప్ప మచ్చలేని నారా చంద్రబాబునాయుడిపై లేనిపోని అక్రమ కేసులు సృష్టించి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఒకప్పుడు అమెరికా నుంచి బిల్గేట్స్ ఆంధ్రప్రదేశ్కు వచ్చి హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి నాయుడిని భుజం తట్టి ప్రోత్సహించారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు వేసిన ఐ.టి.బీజంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. కర్ణాటకలో స్థిరపడిన ప్రవాసాంధ్రులకు ఎలాంటి సంబంధం లేక పోయినా ఆంధ్రాలో బాబు చేసిన అభివృద్ధికి మద్దతు ప్రకటించి, ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు గుర్రం లాల్మోహన్, కోనంకి రామప్ప, శ్రీనివాసరావు, కుడతిని శ్రీనివాసులు, చంద్రశేఖర్, కుడతిని రాము, కార్పొరేటర్లు వివేక్, రామాంజినేయులు, కోనంకి తిలక్కుమార్, ప్రభంజన్కుమార్, తిమ్మరాజు, గుత్తి చంద్రశేఖర్, ముండ్లూరు విజయ్, కె.సి.బాబు, దామోదర్, రామాంజినేయులు, విష్ణు, ఈశ్వరయ్య, శ్రీనివాసరావు(వాసు), ప్రతాప్, రామబ్రహ్మం, అలివేలు సురేశ్, కమ్మనాయుడు, రంజిని, వైకుంఠం ఇందిరా, లక్ష్మినగర్ శ్రీనివాసులు, ఎర్రిస్వామి, ఆనంద్చౌదరి, మల్లికార్జున, కాకతీయ రవి, నందిమూర్తి అభిమానుల సంఘం అధ్యక్షుడు ఎర్రిస్వామి, సురేష్, న్యాయవాది జనార్దన్, బెస్ట్ స్కూల్ మన్నెం శ్రీనివాసులు, హేమలత, తులసి, కీర్తి, శశి, రేఖ, సీత, చట్టిబాబు, వాసు, రమణ, పూర్ణ, శివ, రంగరావు, శివప్ప, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.