సత్తుపల్లిలో రూ.10లక్షలు చోరీ
సత్తుపల్లిలో రూ.10లక్షలు చోరీకి గురైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక అడపా సత్యనారాయణవీధికి చెందిన నడిపల్లి రామారావు తన కుటుంబ సభ్యులతో 15 రోజుల కిందట షిర్డీ వెళ్లారు.
సత్తుపల్లి, న్యూస్టుడే: సత్తుపల్లిలో రూ.10లక్షలు చోరీకి గురైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక అడపా సత్యనారాయణవీధికి చెందిన నడిపల్లి రామారావు తన కుటుంబ సభ్యులతో 15 రోజుల కిందట షిర్డీ వెళ్లారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రామారావు బెడ్రూమ్ కిటీకీ పగలగొట్టి గదిలో సంచిలో దాచి ఉంచిన రూ.10లక్షలను అపహరించారు. షిర్డీ నుంచి సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన రామారావు కిటీకి పగులగొట్టి ఉండటం, నగదు కన్పించకపోవడంతో మంగళవారం స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.
వేధింపులపై కేసు నమోదు
చింతకాని, న్యూస్టుడే: తిమ్మినేనిపాలెంకు చెందిన నారపోగు దాసు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా దాసు తన భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో కొద్ది రోజుల క్రితం సదరు యువతి పుట్టింటికి వెళ్లింది. సోమవారం రాత్రి దాసు కుటుంబ సభ్యులు సదరు యువతి ఇంటిపై దాడి చేసి కొట్టారు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ట్రాక్టర్ల కలప స్వాధీనం
కామేపల్లి, కారేపల్లి, న్యూస్టుడే: రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఖమ్మం తరలిస్తున్న కలపను కొత్తలింగాల వద్ద మంగళవారం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కారేపల్లి మండలం చిన్నతండా నుంచి ఒక ట్రాక్టర్, అదే మండలం కమలాపురం నుంచి మరో ట్రాక్టర్లో కలపను తరలిస్తుండగా మార్గంమధ్యలో పట్టుకొని కారేపల్లి అటవీ కార్యాలయానికి తరలించామని తాళ్లగూడెం ఎఫ్ఎస్వో రమేశ్ తెలిపారు.
మిరపతోటపై కలుపు మందు చల్లారని ఫిర్యాదు
ఏన్కూరు, న్యూస్టుడే: టీఎల్పేటలో మిరప పొలంపై గుర్తుతెలియని వ్యక్తులు కలుపుమందు పిచికారీ చేసి నష్టపరిచారు. బాధిత రైతు పొన్నం రామారావు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తాను ఇతర ప్రాంతానికి వెళ్లానని, మంగళవారం పొలం వచ్చిచూడగా రెండు ఎకరాల విస్తీర్ణంలో మొక్కలపై కలుపుమందు పిచికారి చేయడంతో ఆవి దెబ్బతింటున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.