logo

దేశభవిష్యత్తు నిర్దేశకులు ఓటర్లే

ఓటుహక్కు.. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి లాంటిదని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికలంటే తమకు సంబంధించిన అంశం కాదనే భావనను యువతీయువకులు, పట్టణవాసులు విడనాడాలని సూచించారు.

Published : 25 Jan 2023 03:45 IST

‘ఈనాడు’తో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

ఓటుహక్కు.. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి లాంటిదని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికలంటే తమకు సంబంధించిన అంశం కాదనే భావనను యువతీయువకులు, పట్టణవాసులు విడనాడాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ విధిగా ఓటరుగా నమోదై ఉండాలన్నారు. ఇంట్లో కూర్చునే ఓటుహక్కు పొందేలా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ‘ఈనాడు’తో కలెక్టర్‌ గౌతమ్‌ ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..

యువత నిర్లిప్తం వీడాలి..

పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం అధికంగా నమోదవుతోంది. పేదలు, వృద్ధులు ఓటేసేందుకు ముందంజలో ఉంటున్నారు. సెలవు ఉన్నా సరే కొందరు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత ఇళ్లల్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికలంటే తమకు సంబంధం లేదనే అపోహను వీడాలి. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా.. ప్రతి ఒక్కరి జీవితంలో రాజకీయం మిళితమై ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. వ్యక్తి, వ్యవస్థ భవిష్యత్తును మార్చే సాధనంగా ఉన్న ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.

జాబితాలో పేరు ఉండాల్సిందే..

కొంతమంది ఓటర్లు తమ వద్ద ఓటరు గుర్తింపు కార్డు ఉందని, ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేసేందుకు వెళ్తారు. కానీ వారి పేరు ఓటరు జాబితాలో ఉండదు. రోజురోజుకూ కొత్త ఓటర్లు నమోదవుతూనే ఉంటారు. ఈ ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో పాత ఓటరు తన గుర్తింపు కోల్పోతారు. ప్రతిసారీ ఓటర్ల జాబితా మారుతుంది. ఓటరు కార్డుంటే ఓటుహక్కు ఉన్నట్లు కాదు.. కొత్తగా వెలువడిన ఓటరు జాబితాలో పేరుంటేనే ఓటేసేందుకు అర్హులు. జాబితాలో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.

విరివిగా అవగాహన కార్యక్రమాలు..

జిల్లాలో ఓటరు నమోదు, ఓటుహక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎన్నికల సంఘం తాజాగా దరఖాస్తు ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చింది. ఏటా నాలుగుసార్లు ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 17 ఏళ్లు నిండినవారూ ఏడాది ముందుగానే ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అంశాలన్నీ యువతకు తెలియజేసేలా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలు, గురుకుల విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి కళాశాలకు తహసీల్దారును ఇన్‌ఛార్జిగా నియమించి యువతీ, యువకులను ఓటర్లుగా చేర్చాం. మూడు నెలల పాటు చేపట్టిన కార్యక్రమాలతో 44 వేల మంది ఓటర్లు కొత్తగా చేరారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని 47 వేల మందికి కొత్తగా ఓటరు కార్డులు జారీ చేస్తున్నాం.  


నేడు విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

ఖమ్మం నగరం: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు స్వీప్‌ నోడల్‌ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ తెలిపారు. ఓటు నమోదు, ఓటుహక్కు వినియోగంపై ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఏఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, నయాబజార్‌ జూనియర్‌ కళాశాల, ఎస్‌ఆర్‌బీజీఎన్నార్‌ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. కొత్త ఓటర్లకు మధ్యాహ్నం 3 గంటలకు ఐడీవోసీ భవనంలో గుర్తింపు కార్డులు కలెక్టర్‌ గౌతమ్‌ అందజేస్తారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌లో ప్రార్థనతో పాటు ఓటు నమోదుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని కలెక్టర్‌ సూచించారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని