logo

బాబోయ్‌.. భయోమెట్రిక్‌

బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలన పాటించేందుకు ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్‌ పరికరాలు మొరాయిస్తున్నాయి.

Published : 04 Feb 2023 04:37 IST

మొరాయిస్తున్న పరికరాలు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే

కారేపల్లి కళాశాలలో హాజరు కోసం బారులు తీరిన ఉద్యోగులు

బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలన పాటించేందుకు ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్‌ పరికరాలు మొరాయిస్తున్నాయి. కళాశాలకు సకాలంలో చేరుకున్నా బయోమెట్రిక్‌ యంత్రాలు మొరాయిస్తుండటంతో 15 నిమిషాల గ్రేస్‌ టైం ముగిసిపోతుందని, ఆతర్వాత వేలిముద్రలు వేసినా గైర్హాజరైనట్టే చూపుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాజరు వేయాలంటూ మళ్లీ లేఖలు రాయాల్సి వస్తోందని చెబుతున్నారు.

ఫిబ్రవరి 1 నుంచి అమలు..

2014 వరకు ఆయా కళాశాలల్లో వసూలు చేసిన రుసుముల్లో మిగిలిన మొత్తాలను ఇంటర్‌ బోర్డు డిపాజిట్‌ చేయించుకుంది. ఆ డబ్బుల నుంచి ఒక్కో కళాశాలకు నాలుగు సీసీ కెమెరాలు, రెండు బయోమెట్రిక్‌ యంత్రాల చొప్పున నాటి బోర్డు కార్యదర్శి టెండర్లు పిలిచి కొన్నారు. ఆ తర్వాత సరఫరా చేశారు. ఆరు నెలలు కాగానే మంత్రమేసినట్లు యంత్రాలు పనిచేయటం మానేశాయి. సుమారు రూ.4కోట్ల వరకు వృథా అయినట్లు సమాచారం. ఆపై కొవిడ్‌ పేరిట బయోమెట్రిక్‌ పరికరాలను పక్కన పెట్టారు. ఇటీవల విధుల్లో చేరిన కొత్త కార్యదర్శి ఇంటర్‌ బోర్డు నిధుల నుంచి బయోమెట్రిక్‌ యంత్రాలు కొని 405 కళాశాలలతో పాటు 33 జిల్లాల ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కార్యాలయాలకు సరఫరా చేశారు. ఈఏడాది ఫిబ్రవరి 1 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

సాంకేతిక సమస్యలతో సతమతం

ఒక్కో కళాశాలలో అటెండరు నుంచి ప్రిన్సిపల్‌ వరకు 30 నుంచి 60 మంది ఉద్యోగులున్నారు. ఓ కంపెనీ సిమ్‌ కార్డు సాయంతో యంత్రాలు పనిచేస్తాయి. సిగ్నళ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో ఒక్కొక్కరు వేలిముద్రలు వేయాలంటే మూడు నుంచి నాలుగు నిమిషాల సమయం పడుతోంది. సిబ్బంది అందరూ తమ హాజరు నమోదు చేసుకోవటానికి సుమారు గంట నుంచి 2 గంటల వరకు సమయం పడుతోంది. యంత్రాలను ఆహ్వానించినా, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఆధార్‌ అనుసంధాన బయోమెట్రిక్‌ హాజరు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.


జాగ్రత్తలు తీసుకోవాలి

కె.రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం

సిరిపురం కళాశాలలో చిన్న సమస్య ఉంటే పరిష్కరించాం. వేలిముద్రలు సరిగ్గా రాకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈసమస్యను అధిగమించవచ్చు. ఇంతవరకు ఎక్కడి నుంచి ఫిర్యాదులు రాలేదు. సమస్య ఉత్పన్నమైతే సాంకేతిక సహాయకుడిని పంపించి పరిష్కరిస్తాం. బయోమెట్రిక్‌ విధానం వల్ల ఉద్యోగులు సకాలంలో కళాశాలలకు హాజరవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని