logo

గంజాయి స్మగ్లర్ల బీభత్సం

ముగ్గురు యువకులు కారులో గంజాయి తరలిస్తూ బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన ఆబ్కారీ, పోలీసు అధికారులను ఢీకొనే ప్రయత్నం చేస్తూ తప్పించుకున్నారు.

Published : 04 Feb 2023 04:37 IST

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి దొరికిపోయిన నిందితులు

డీఎస్పీ రమణమూర్తి, పక్కన అబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ తిరుపతి,
సీఐలు రాజు, రాజశేఖర్‌, స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులు

ఇల్లెందు, న్యూస్‌టుడే: ముగ్గురు యువకులు కారులో గంజాయి తరలిస్తూ బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన ఆబ్కారీ, పోలీసు అధికారులను ఢీకొనే ప్రయత్నం చేస్తూ తప్పించుకున్నారు. తుదకు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన ఇల్లెందు పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి 350 కిలోల గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన సాగర్‌దుక్కడ్‌, ఆనంద్‌ బాలాజీ మక్కాడ్‌, అమూల్‌ రాందాస్‌లు కారులో బయలుదేరారు. విషయం తెలుసుకున్న అబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు భద్రాచలంలో బ్రిడ్జి పాయింట్‌ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించారు. గమనించిన స్మగ్లర్లు వేగం తగ్గించి వెంటనే అతివేగంతో రహదారిపై ఉన్న బారికేడును ఢీకొట్టి తప్పించుకున్నారు. దీంతో అటవీ శాఖ గార్డుకు ప్రమాదం తప్పింది.  అప్రమత్తమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు అబ్కారీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే పాల్వంచ, కొత్తగూడెం దాటిన యువకులు ఇల్లెందుకు చేరుకున్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న అబ్కారీ అధికారులు, సిబ్బంది కారును ఆపే ప్రయత్నం చేశారు. వారు ఆపకుండా అడ్డువచ్చిన అబ్కారీ హెడ్‌ కానిస్టేబుల్‌ బాబాను ఢీకొట్టి పట్టణంలోకి ప్రవేశించారు. వారిని అబ్కారీ, పోలీసులు వెంబడించగా రైల్వే బ్రిడ్జి నుంచి వెళ్తూ కొత్తబస్టాండ్‌ మలుపు వద్ద పురపాలక పారిశుద్ధ్య కార్మికులను తప్పించబోయి డివైడర్‌కు తగిలించి ఎదురుగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టారు. కారు మీద స్తంభం పడటంతో నిలిచిపోయింది. ఆ ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. డీఎస్పీ రమణమూర్తి, సీఐ రాజు, అబ్కారీ సీఐ రాజశేఖర్‌లు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.70లక్షల విలువైన 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని డీఎస్పీ చెప్పారు. కారు ఢీకొనడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ బాబాకు స్వల్ప గాయాలయ్యాయి. విలేకర్ల సమావేశంలో అబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్‌ తిరుపతి, ఎస్సై రాజేశ్‌, ఏఎస్సై గని, సిబ్బంది బాలు, యాకూబ్‌పాషలు పాల్గొన్నారు.

కారుకు ఆటో నంబర్‌ప్లేటు: గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు ఇన్నోవా కారును ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు. లోపలి వ్యక్తులు కనిపించకుండా నల్ల అద్దాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కారు నంబర్‌ను తీసేసి ఓ ఆటో నంబర్‌ను(ఏపీ 31 బీక్యూ 1154) జోడించారు. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగుచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని