logo

పవిత్ర బంధం.. ఎగతాళి

అనుమానం.. వివాహేతర సంబంధం.. మద్యం అలవాటు.. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య విభేదాలకు ఇవే ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. కొందరు తెగించి బంధాలను అడ్డుతొలగించుకునేందుకూ వెనకాడటం లేదు.

Published : 27 Mar 2023 04:02 IST

పగతో కడతేర్చేందుకూ వెనుకాడని వైనం
కొత్తగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే

మార్చి 19: సహజీవనానికి అడ్డొస్తున్నాడన్న కోపంతో కొత్తగూడెం సన్యాసిబస్తీకి చెందిన గాయపాక ప్రవీణ్‌కుమార్‌ (35)ను ప్రియుడితో కలిసి భార్య లావణ్య అంతమొందించింది. తనతో విడాకులు తీసుకోకుండా వేరొకరితో సహజీవనం చేస్తున్నావెందుకని నిలదీయడమే అతని పాలిట మృత్యుపాశమైంది.


జనవరి 4: చుంచుపల్లి మండలం గాంధీకాలనీకి చెందిన శ్రీనివాస్‌కు 29 ఏళ్ల క్రితం సీతామహాలక్ష్మితో వివాహమైంది. రెవెన్యూ శాఖలో అటెండర్‌గా పనిచేసే అతడు మద్యానికి బానిసయ్యాడు. రెణ్నెల్ల క్రితం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తను భార్య కర్రతో కొట్టి చంపింది. ఇంట్లో జారిపడ్డాడని నమ్మించే ప్రయత్నం చేసింది.


జనవరి 20: గుండాల మండలానికి చెందిన ఓ యువతితో అదే గ్రామానికి చెందిన యువకుడికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కట్న వేధింపులతో భార్య పుట్టింటికి వెళ్లగా.. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. నిలదీసేందుకు వెళ్లిన అత్తింటి వారిపై యవకుడు దాడి చేయగా.. వారు ప్రతిదాడికి పాల్పడ్డారు.


జనవరి 26: ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన రాంబాబు (పేరుమార్చాం)కు మహబూబాబాద్‌ జిల్లా మరిపెడకు చెందిన మహిళతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. అతడు మద్యానికి బానిసయ్యాడు. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టినా మారలేదు. ఓ రోజు అతడు భార్యపై ఆగ్రహంతో గొడ్డలితో విచక్షణా రహితంగా దాడిచేశాడు.

నుమానం.. వివాహేతర సంబంధం.. మద్యం అలవాటు.. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య విభేదాలకు ఇవే ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. కొందరు తెగించి బంధాలను అడ్డుతొలగించుకునేందుకూ వెనకాడటం లేదు. ఇటీవల కాలంలో ఉమ్మడి ఖమ్మంలో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అధిక శాతం భర్త మద్యం అలవాటు కారణంగా సంసారాల్లో చిచ్చురేగుతోంది. మత్తుకు బానిసైన వారిలో ‘అనుమానం’ పెనుభూతం అవుతోంది. ఇది దంపతుల మధ్య ఎడబాటుకు కారణమవుతోంది.  సర్దుబాటుతో సమస్య తీరే అవకాశం ఉన్నా.. కక్షతో దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు వ్యక్తిగత సుఖం కోసం పెడదోవ పడుతున్నారు. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. భర్త ప్రవర్తనతో వేగలేక కొందరు ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు.ఆగ్రహావేశాలు పక్కనపెడితే, ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం దొరుకుతుందని, మానసిక నిపుణులు, పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణాలివే..

పరస్పర అవగాహన లేకపోవడం. పట్టుదల, పంతాలకు వెళ్లడం.

ఒకరిపై మరొకరు విశ్వాసం కోల్పోవడం. అనుమానాలు పెనుభూతంగా మారడం.

పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందని.. ప్రతీకారమే శరణ్యమనుకోవడం.

మద్యం కారణంగా కుటుంబాన్ని పట్టించుకోకపోవడం.

వివాహేతర సంబంధాలు.

అదనపు కట్నం వేధింపులు

ధనాపేక్ష, మితిమీరిన స్వేచ్ఛ కోరుకోవడం.

క్షణికావేశానికి లోనై తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం.


కౌన్సెలింగ్‌తో పరిస్థితిలో మార్పు

ఎన్‌.వెంకటేశ్‌, డీఎస్పీ, పాల్వంచ

భార్యాభర్తలు చిన్నపాటి మనస్పర్థలు పెరిగి పెద్దవై ఒకరిపై మరొకరు కక్ష తీర్చుకునే వరకు వెళ్తున్నాయి. కుటుంబ గొడవలతో ఠాణాకు వచ్చేవారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ ఇస్తున్నాం. చాలామంది దంపతుల్లో మార్పు గమనిస్తున్నాం. కొందరు మాత్రం తమ వైఖరిపై ఏమాత్రం పశ్చాత్తాపం చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరే చివరకు తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారు. సంసార సమస్యలు భయపెట్టేంత బరువైనవి కావు. కలిసి ఎదుర్కొంటే సమసిపోతాయి. విసుగు.. అసహనాన్ని వదిలి ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి. ఇతర కుటుంబ సభ్యులకూ ఇది వర్తిస్తుంది. కుటుంబ వ్యవస్థలో పిల్లలు, యువతకు నైతిక విలువలు, బాంధవ్యాలను నేర్పించడం ఎంతో ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని