logo

రామయ్యకు గోటి తలంబ్రాలు సమర్పణ

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి కల్యాణోత్సవంలో ఉపయోగించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం గోటి తలంబ్రాలను ఆదివారం అందించింది.

Published : 27 Mar 2023 04:02 IST

రామాయణ క్రతువులో భాగంగా నిర్వహిస్తున్న హోమం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి కల్యాణోత్సవంలో ఉపయోగించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం గోటి తలంబ్రాలను ఆదివారం అందించింది. మట్టి కుండలను తలపై పెట్టుకుని కొందరు రాగా, మరికొందరు కావడిలో కలశాలను ఉంచి వీటిని తెచ్చారు. గోటి తలంబ్రాలను ఈవో రమాదేవి, స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు చేతుల మీదుగా శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కల్యాణం అప్పారావు అందించారు. రామతత్వాన్ని చాటాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని 4వేల మంది 600 కిలోల గోటి తలంబ్రాలను ఒక యజ్ఞంలా తయారు చేశారు. ఇందులో సగం ఇక్కడ సమర్పించారు. మరో సగం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రామాలయంలో కల్యాణానికి అందించనున్నారు. అయోధ్య రామ మందిరానికీ కోటి గోటి తలంబ్రాలను పంపించారు. ఈ సందర్భంగా కల్యాణం అప్పారావు మాట్లాడుతూ కొద్ది నెలల కిందట భద్రాచలం రామాలయంలో వరి ధాన్యానికి పూజ చేసినట్లు వివరించారు.

ఈవోకి పట్టు వస్త్రాలను అందిస్తున్న గోటి తలంబ్రాల బృందం

శ్రీరామ నవమికి చిన్న జీయర్‌ స్వామి రాక: భద్రాచలం రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ నవమి క్రతువులో పాల్గొనేందుకు చిన్న జీయర్‌స్వామి రానున్నారు. 29న రాత్రికి ఇక్కడకు చేరుకుంటారని జీయర్‌ మఠం నిర్వహకులు గట్టు వెంకటాచార్య తెలిపారు. 30న మిథిలా మండపంలో నిర్వహించే కల్యాణంలో పాల్గొని సీతారాముల వారిని దర్శించుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం తిరిగివెళతారు. స్థానిక జీయర్‌ మఠంలో సోమవారం సాయంత్రం గరుడ ధ్వజ పట ఆవిష్కరణ వేడుక నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేవనాథ జీయర్‌స్వామి ఆదివారం రాత్రి ఇక్కడకు చేరుకున్నారు. వేడుక అనంతరం ఆయన తిరిగివెళ్లి 30న రాత్రి అహోబిల జీయర్‌స్వామితో కలిసి వచ్చి 31న నిర్వహించే పట్టాభిషేకంలో దేవనాథ జీయర్‌స్వామి పాల్గొంటారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని