logo

బాలల భవితకు భరోసా

కార్పొరేట్‌కు దీటుగా ఆధునిక సాంకేతిక సొబగులు సమకూర్చుకొని విద్యార్థుల భవితకు భరోసా ఇస్తోందీ సర్కారు బడి.

Updated : 04 Jun 2023 04:56 IST

పీఎం శ్రీ పథకానికి ఎంపికైన సత్తుపల్లిలోని పాత సెంటర్‌ ప్రాథమిక పాఠశాల  
సత్తుపల్లి, న్యూస్‌టుడే

కార్పొరేట్‌కు దీటుగా ఆధునిక సాంకేతిక సొబగులు సమకూర్చుకొని విద్యార్థుల భవితకు భరోసా ఇస్తోందీ సర్కారు బడి. చదువు, పిల్లల సంఖ్యలో మేటిగా నిలుస్తూ పీఎంశ్రీ పథకానికి ఎంపికైంది. ఉమ్మడిజిల్లాలో ప్రాథమిక పాఠశాలల విభాగంలో ఎంపికైన ఏకైక పాఠశాలగా గుర్తింపు పొందింది. దీంతో మరిన్ని సౌకర్యాలు ఒనగూరనున్నాయి. ఇదీ సత్తుపల్లి పాతసెంటర్‌ ప్రాథమిక పాఠశాల ఘనత.

ఇవీ పాఠశాల విశేషాలు

పాత సెంటర్‌ ప్రాథమిక పాఠశాల 1951లో ప్రారంభమైంది. హెచ్‌ఎం చిత్తలూరి ప్రసాద్‌ ఇదే పాఠశాలకు పూర్వ విద్యార్థి కావడంలో అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారు. గతేడాది బడిబాటలో విస్తృతంగా ప్రచారం చేసి విద్యార్థుల నమోదును అమాంతంగా పెంచారు. తాజాగా ముగిసిన విద్యా సంవత్సరంలో 226 మంది విద్యార్థులు నమోదు కావడం విశేషం. మండల స్థాయిలో టీఎల్‌ఎం మేళాలో నాలుగు పాఠ్యాంశాలకు మూడింటిలో బహుమతులు సాధించి జిల్లా స్థాయికి ఎంపికైంది. పూర్వ విద్యార్థులు కొచ్చర్లపాటి రాజన్‌రాజు రూ.లక్షతో డిజిటల్‌ తరగతి గది, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు రూ.50వేలతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.60వేలు విలువైన ల్యాప్‌టాప్‌ను, రూ.50వేలు విద్యా ప్రోత్సాహక నిధిని అందజేశారు. పాఠశాల విద్యా ప్రోత్సాహక నిధి నుంచి వచ్చే వడ్డీతో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏటా నగదు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. విద్యార్థుల మానసికోల్లాసానికి ఆటలు, పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు యోగా, కరాటే శిక్షణలు ఇప్పిస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాల సమయం అనంతరం ఒక గంట కేటాయించి పాఠ్యాంశాల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జూమ్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు తరగతులు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని