logo

పెంచమంటే...తుంచుతారా

జిల్లాలోని మచిలీపట్నం సహా పలు ప్రాంతాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఉద్యోగుల పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ తదితర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫ్యాప్టో, జాక్టో పిలుపు

Published : 21 Jan 2022 03:11 IST

పీఆర్సీపై భగ్గుమన్న ఉద్యోగులు

మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లలో బైఠాయింపు

ఈనాడు, అమరావతి - మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ప్రభుత్వానికి

వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

జిల్లాలోని మచిలీపట్నం సహా పలు ప్రాంతాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఉద్యోగుల పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ తదితర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫ్యాప్టో, జాక్టో పిలుపు మేరకు మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ కార్యాలయ ముట్టడి, అన్ని మండలాల్లో నిరసనలు హోరెత్తాయి. ప్రధానంగా మచిలీపట్నానికి వచ్చే దారులన్నీ ఉపాధ్యాయులతో కిక్కిరిసిపోయాయి. ప్రతి మండలం నుంచి వందలాది మంది ఉపాధ్యాయులు రకరకాల మార్గాల్లో.. మచిలీపట్నం చేరుకున్నారు. ప్రతి మండలంలో పోలీసులు అడ్డుకుంటున్నా, బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తున్నా.. వారిని దాటుకుంటూ జిల్లా కేంద్రానికి వేలాది మంది చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో అత్యధికశాతం మంది విధులకు గైర్హాజరై.. కలెక్టరేట్‌ ముట్టడికి తరలివెళ్లారు. మచిలీపట్నం నగరం మొత్తం పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ప్రధాన కూడళ్లలో బారికేడ్ల ముందే బైఠాయించి ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. నగరం మొత్తం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

విజయవాడ సహా పలు మండలాల్లో ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ కార్యాలయాల వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నిరసనను తెలియజేశారు.మచిలీపట్నం కలెక్టరేట్‌ చుట్టుపక్కల వలయంలా పోలీసులు మోహరించి లోపల ఉన్నవాళ్లు బయటకు రాకుండా, బయట నుంచి ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు లోపలికి పంపించారు. దీంతో పలువురు సిబ్బంది తమ విభాగాలకు చెందిన అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగుల విషయంలో కలెక్టర్‌ బంగ్లా గేటు వైపు విధులు నిర్వహిస్తున్న ఒక ఎస్సై అమర్యాదగా వ్యవహరించారంటూ ఆందోళనకు దిగారు. ఎస్సై వ్యవహారశైలిపై జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు.

జిల్లాలో పలుచోట్ల నిరసనలు

జగ్గయ్యపేట మండలం, పామర్రు నుంచి చలో కలెక్టరేట్‌ ఆందోళనలో పాల్గొనేందుకు బయలుదేరిన ఉపాధ్యాయ సంఘాల నాయకులను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ● విజయవాడ ఆర్‌అండ్‌బి కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసనకు దిగారు.

న్యాయం చేయాలని వేడుకుంటూ నినాదాలు చేస్తున్న మహిళా ఉద్యోగినులు

నివేదికను బహిర్గతం చేయాలి..

అశుతోష్‌మిశ్రా కమిషన్‌ ప్రభుత్వానికి ఇచ్చిన పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయాలి. కేంద్రం అమలు చేస్తున్న పే కమిటీ స్కేల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలి. రాష్ట్ర పే కమిషన్‌ను యథాతథంగా అమలు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఫింఛనుదారులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించే పీఆర్‌సీ జీవోలను తక్షణం ఉపసంహరించుకోవాలి. సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలి. - చేబ్రోలు శరత్‌చంద్ర, ఫ్యాప్టో రాష్ట్ర ప్రధానకార్యదర్శి

ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం..

పదవీవిరమణ వయస్సు 62 ఏళ్లు కావాలని ఎవరూ అడగలేదు. ఇప్పటివరకు ఉన్న 60 ఏళ్ల వయసునే కొనసాగించడంతోపాటు అన్ని డిమాండ్‌లు పరిష్కరించాలి. న్యాయపరమైన హక్కుల సాధనకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తుంటే ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో పోలీసులను ప్రయోగించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు వేల సంఖ్యలో ఉపాధ్యాయ, ఉద్యోగులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. - కొమ్ము ప్రసాద్‌, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వం మోసం చేసింది..

ఉపాధ్యాయ, ఉద్యోగులు అందరినీ ప్రభుత్వం మోసం చేసింది. న్యాయబద్ధంగా అడిగిన పీఆర్‌సీ ఇవ్వకుండా, హక్కుల సాధనకు నిరసన తెలియజేస్తుంటే అక్రమ అరెస్టులు చేసి నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎస్‌ రాజకీయ నాయకుల మాదిరిగా మాట్లాడటం సరికాదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అన్నింటినీ తక్షణం ఉపసంహరించుకోవాలి. అప్పుడు మాత్రమే చర్చలకు వెళ్తాం. 27శాతానికి మించి పీఆర్‌సీ ఇవ్వాలి, పాతహెచ్‌ఆర్‌ఏ స్లాబులను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నాం. - ఎన్‌.వెంకటేశ్వర్లు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

చీకటి జీవోలు రద్దయ్యే వరకు పోరాటం..

ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోలు రద్దయ్యేవరకు ఉద్యమం ఆగదు. మా డిమాండ్‌ పరిష్కరించకపోతే అన్ని సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. జులై 2019 నుంచి మార్చి 2020 వరకు ఇచ్చిన ఐఆర్‌ 27శాతాన్ని రికవరీ చేస్తామని చెప్పడం దారుణం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై పునరాలోచన చేయాలి. - తమ్ము నాగరాజు, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

అరెస్టులతో అడ్డుకోలేరు..

ప్రభుత్వం ఇచ్చిన జీవోల వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనుదారులు, సచివాలయ సిబ్బంది.. అందరికీ నష్టమే. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలి. ఐదేళ్లకోసారి ఇచ్చే పీఆర్‌సీని 10ఏళ్లకు చేసే ఆలోచన విరమించుకోవాలి. అశుతోష్‌మిశ్రా ఇచ్చిన నివేదికను బయటపెట్టాలి. అధికారుల ప్రతిపాదనలను రద్దు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవోల వల్ల ఉపయోగం లేదు. - మద్ది బాబూరాజేంద్రప్రసాద్‌, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రధాన కూడళ్లలో ప్రత్యేక బందోబస్తు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: పీఆర్‌సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ద్విచక్రవాహనంపై మచిలీపట్నంలో పర్యటించి బందోబస్తును పరిశీలించడంతోపాటు డీఎస్పీ మాసుంబాషా, ఎస్‌బి డీఎస్పీ ధర్మేంద్ర తదితరులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కలెక్టరేట్‌, పరాసుపేట, జిల్లాపరిషత్‌, లక్ష్మీటాకీస్‌ కూడళ్లలో పర్యటించారు.జిల్లా వ్యాప్తంగా 1200మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించడంతోపాటు ప్రధాన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలోనే 300మందికి పైగా బందోబస్తు విధులు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

పెడన పోలీసు స్టేషన్‌కు తరలింపు

పెడన, న్యూస్‌టుడే: ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (ఫ్యాప్టో) మచిలీపట్నంలో కలెక్టరేట్‌ ముట్టడి సందర్భంగా గురువారం వందలాది మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మచిలీపట్నంలో స్టేషన్లు నిండిపోవటంతో సమీపంలోని పెడనకు కొంత మందిని తరలించారు. పెడనకు తీసుకొచ్చిన ఉపాధ్యాయులను మధ్యాహ్నం నుంచి పంపించి వేశారు. మొత్తం 15 మందిని పెడన పోలీసు స్టేషన్‌లో ఉంచామని ఎస్సై టి.మురళి చెప్పారు.

ఉపాధ్యాయుడిని లాగేస్తున్న పోలీసులు

ఆందోళన చేస్తున్న వారిని వ్యానులోకి ఎక్కిస్తూ..

మచిలీపట్నం లక్ష్మీటాకీసు కూడలిలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆందోళన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని