logo

ప్రగతిలో జిల్లా పరుగు

రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్‌ నివాస్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించిన కలెక్టర్‌ జాతీయ జెండాను ఎగరవేశారు.

Updated : 27 Jan 2022 06:13 IST

గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ నివాస్‌

పరేడ్‌గ్రౌండ్‌లో వాహనంలో పర్యటిస్తూ పోలీసుల గౌరవవందనం

స్వీకరిస్తున్న కలెక్టర్‌ నివాస్‌, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్‌ నివాస్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించిన కలెక్టర్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ముఖ్య అతిధిగా హాజరైన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఎందరెందరో మహానుభావులు స్వాతంత్రోద్యమంలో అలుపెరగని పోరాటం చేశారంటూ పేరుపేరునా కీర్తిస్తూ అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వారిని స్మరించుకుంటున్నామన్నారు. గణతంత్ర రాజ్యాన్ని అందించేందుకు శ్రమించిన మహనీయులకు నమస్కరిస్తూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

నూరుశాతం వృద్ధి

జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2019తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూరుశాతం వృద్ధి సాధించామని కలెక్టర్‌ చెప్పారు. రైతు భరోసా, పీఎంకిసాన్‌ పథకం ద్వారా గడచిన మూడు సంవత్సరాల్లో 3.26 లక్షల రైతులకు రూ.935 కోట్లు అందజేశామన్నారు. జిల్లాలోని 738 రైతు భరోసా కేంద్రాల ద్వారా 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి రూ.310 కోట్లను రైతు ఖాతాలకు జమచేశారనీ, పాల రైతులకు కనీస మద్దతు ధర దక్కాలన్న లక్ష్యంతో తొలివిడతగా నూజివీడు డివిజన్‌లో 100 గ్రామాల్లో పాలవెల్లువ పథకాన్ని విస్తరించినట్టు తెలిపారు. రిజస్ట్రేషన్లలో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలవుతోందనీ, ఉపాధిహామీ పథకం ద్వారా గత 12 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా 1.38 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. రూ.911 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సంపూర్ణ గృహహక్కు పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు పేదలకు కేటాయించిన లేఅవుట్‌లో గృహనిర్మాణాలు వేగవంతం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. మహిళలు, వివిధ వర్గాలు, ఆయా సామాజిక వర్గాల వారీ అందజేస్తున్న పింఛన్లు, ఆసరా, నేతన్న నేస్తం, వాహన మిత్ర, తదితర సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుస్తున్నారనే విషయాలను గణాంకాల వారీ వివరించారు.

పోలీసుల కవాతు

మెరుగైన వైద్యం

పేద వర్గాలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో 1.18 లక్షల మందికి రూ.463 కోట్లు ఖర్చుచేశామన్నారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటే 1,381 నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి మొత్తం 2,440 చికిత్సలకు ఉచితంగా వైద్యసేవలు చేరువ చేస్తున్నట్టు చెప్పారు. రూ.560 కోట్ల వ్యయంతో మచిలీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటుకాబోతోందని తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని అంటూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జిల్లాలో అలుపులేని పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, ఇతర విభాగాలకు చెందిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి తగు సహాయ, సహకారాలు అందిస్తున్న జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథంలో పయనించేందుకు అన్ని విధాల సహకరిస్తున్న జిల్లాలోని ఇతర ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకర్లు తదితరులకు అభినందనలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, మేయర్‌ వెంకటేశ్వరమ్మ, జేసీలు కె.మాధవీలత, శివశంకర్‌, మోహన్‌కుమార్‌, శ్రీవాస్‌నుపూర్‌అజయ్‌కుమార్‌, ఏఆర్‌ ఏఎస్పీ ప్రసాద్‌, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బాలానృత్య నికేతన్‌ విద్యార్థుల ప్రదర్శన


వైద్య ఆరోగ్యశాఖ (తృతీయ)

ఆకట్టుకున్న శకటాలు

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: పరేడ్‌ గ్రౌండ్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. సమగ్రశిక్ష శకటం ప్రథమ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వితీయ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించింది. గ్రామీణాభివృద్ధి శాఖ నాలుగు, వ్యవసాయశాఖ శకటం ఐదో స్థానంలో నిలిచాయి.విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు వ్యవసాయశాఖ, మత్స్యశాఖ, గృహనిర్మాణ, మెప్మా, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి.

పెడన మండలం తోటమూల జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థుల పిరమిడ్‌ విన్యాసం

రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండవ బహుమతి సాధించిన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ శకటాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని