logo

వైద్యుల ఖాళీశాల

 కర్నూలు వైద్య కళాశాలకు ఎంతో పేరుంది. ఇక్కడ చదువుకొన్నవారు దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనిక్‌, అనస్థీషియా, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌ విభాగాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూకుమ్మడిగా వైద్యుల బదిలీలు చేపట్టింది.

Published : 24 May 2022 04:15 IST
వైద్య కళాశాలలో బోధకుల కొరత

పీజీ, యూజీ సీట్లు రద్దయ్యే ప్రమాదం

ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌ బదిలీ కావడంతో కేవలం నలుగురు అసిస్టెంట్లు ఉన్నారు. ఇక్కడ పీజీ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరవయ్యారు. ఇప్పటికిప్పుడు ఎన్‌ఎంసీ (నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) అధికారులు పరిశీలనకొస్తే పీజీ సీట్లు రద్దయ్యే ప్రమాదముంది.

ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌.. ఇద్దరూ బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఓ ప్రొఫెసర్‌ వచ్చి సెలవుపై వెళ్లారు. చేసేది లేక జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన పీజీలు, సీనియర్‌ రెసిడెన్సీలు బాధ్యతలు చూస్తున్నారు. ఈ విభాగానికి డీఎం సీట్ల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. గతంలో తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం మరోసారి ప్రతిపాదిస్తే ఇదే పరిస్థితి నెలకొంటుంది.

న్యూరో ఫిజీషియన్‌ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ బదిలీ కాగా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. కేవలం ఇద్దరు అసిస్టెంట్లతో నెట్టుకొస్తున్నారు. ఈ విభాగానికి డీఎం సీట్లు కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకొన్నారు. ప్రొఫెసర్‌ లేకపోవడంతో సీట్లు వచ్చే పరిస్థితి కానరావడం లేదు.

-న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం : కర్నూలు వైద్య కళాశాలకు ఎంతో పేరుంది. ఇక్కడ చదువుకొన్నవారు దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనిక్‌, అనస్థీషియా, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌ విభాగాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూకుమ్మడిగా వైద్యుల బదిలీలు చేపట్టింది. కర్నూలు వైద్య కళాశాల నుంచి 128 మంది బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా 28 మంది ప్రొఫెసర్లు, 25 మంది అసోసియేట్లు, 63 మంది అసిస్టెంట్లు, 13 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కర్నూలు వైద్య కళాశాలకు 18 మంది ప్రొఫెసర్లు, 28 అసోసియేట్లు, 52 మంది అసిస్టెంట్లు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సి గ్రేడ్‌కు పడిపోయింది.

పీజీలు రాకపోవచ్చు

జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో బదిలీలు జరగకముందు ఆరుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్లు, 14 మంది అసిస్టెంట్లు ఉండగా.. ఈ విభాగంలో 20 పీజీ సీట్లు ఉన్నాయి. మార్చిలో ఆచార్యుల బదిలీలు జరిగిన తర్వాత ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్లు, ఏడుగురు అసిస్టెంట్లు ఉన్నారు. అనుభవం ఉన్న సీనియర్లు లేకపోవడంతో సమస్య ఏర్పడింది. ఈ విభాగంలో ఉన్న పీజీ సీట్లకు చాలా డిమాండ్‌ ఉండేది. బదిలీల తర్వాత ఆచార్యుల కొరత నేపథ్యంలో ప్రతిభావంతులైనవారు ఇక్కడ పీజీ చేసేందుకు మొగ్గు చూపకపోయే ప్రమాదముంది. మరోవైపు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు పరిశీలనకు వస్తే పీజీ సీట్లతోపాటు యూజీ సీట్లలోనూ కోత పడే ప్రమాదముంది. ఈ ప్రభావం రోగులపైనా పడుతుంది.

ఏ విభాగంలో ఎలా ఉందంటే

వైద్య కళాశాలలో ప్రధానంగా జనరల్‌ మెడిసిన్‌ విభాగం, ప్లాస్టిక్‌ సర్జరీ, రేడియాలజీ, న్యూరో ఫిజీషియన్‌, గైనిక్‌ వంటి విభాగాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కాకపోతే రానున్న రోజుల్లో సూపర్‌ స్పెషాలిటీ విభాగానికి వచ్చిన డీఎం సీట్లు, జనరల్‌ మెడిసిన్‌, రేడియాలజీ వంటి విభాగాల్లో పీజీ సీట్లతోపాటు యూజీ సీట్లు తగ్గిపోయే ప్రమాదముంది.

న్యూరో సర్జరీ విభాగంలో పనిచేసే ప్రొఫెసర్‌ ఈనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. ఈ విభాగంలో ఉన్నవారందరూ అసిస్టెంట్లే. అసోసియేట్లు లేకపోవడంతో ఈ విభాగానికి వచ్చిన డీఎం సీట్లను ఎన్‌ఎంసీ (నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) పరిశీలిస్తే ఈ సీట్లు ఉంటాయో? పోతాయో తెలియని పరిస్థితి.

అందని వైద్య సేవలు

పెద్దఎత్తున వైద్యుల బదిలీలు జరగడంతో కర్నూలు సర్వజన ఆస్పత్రిపైనా ప్రభావం చూపుతోంది. కర్నూలు పెద్దాస్పత్రికి రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం రోగులు వస్తుంటారు. పలు విభాగాల్లో వైద్యులు లేకపోవడంతో రోగులకు వైద్యం అందడం లేదు. ఫలితంగా రోగులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఇది శస్త్రచికిత్సలపైనా ప్రభావం చూపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని