ఓర్వకల్లు విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్వాగతం
నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఓర్వకల్లు విమానాశ్రయంలో అధికారులు, నాయకులు స్వాగతం పలికారు.
ఓర్వకల్లు విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న మంత్రి బుగ్గన, ఎంపీ సంజీవకుమార్
నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఓర్వకల్లు విమానాశ్రయంలో అధికారులు, నాయకులు స్వాగతం పలికారు. ఉదయం 10.04 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కలెక్టర్ కోటేశ్వరరావు, ఎంపీ సంజీవకుమార్, డీఐజీ సెంథిల్కుమార్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జేసీ రామసుందరరెడ్డి, కర్నూలు కమిషనర్ భార్గవ్తేజ, విమానాశ్రయ డైరెక్టర్ విద్యాసాగర్ తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం 10.15 గంటలకు కొలిమిగుండ్ల మండలంలోని రామ్కో హెలిప్యాడ్కు బయలుదేరి వెళ్లారు.
- న్యూస్టుడే, ఓర్వకల్లు
పంచాయతీలకు నిధులు ఇవ్వండి
ముఖ్యమంత్రికి విన్నవించిన వైకాపా సర్పంచి
ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించిన వైకాపా సర్పంచి మహేశ్వరరెడ్డి
ఈనాడు-కర్నూలు : రాష్ట్రంలో 90 శాతం పంచాయతీలకు వైకాపా అభ్యర్థులే సర్పంచులుగా ఉన్నారు. గెలుపొంది ఇప్పటికీ దాదాపు 18 నెలలైంది. 14వ, 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం చేయలేకపోతున్నాం. పంచాయతీ ఖాతాల్లో బ్యాలెన్స్ జీరోగా ఉండటంతో గ్రామాభివృద్ధి కుంటుపడింది. ఆర్థికంగా సర్పంచులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తక్షణమే పంచాయతీలకు నిధులు విడుదల చేయందంటూ నంద్యాల జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మీర్జాపురం సర్పంచి మహేశ్వరరెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో రామ్కో సిమెంటు పరిశ్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు.
హైకోర్టు ఏర్పాటు చేయాలని వినతి
ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తున్న న్యాయవాదులు
కర్నూలు న్యాయవిభాగం, న్యూస్టుడే: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ న్యాయవాదుల సంఘం ఐకాస సభ్యులు కొలిమిగుండ్లకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించి హైకోర్టును కర్నూలుకు కేటాయిస్తానని చెప్పినట్లు వారు తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.