logo

ప్రతిపాదనలతో సరి

కొత్త స్టేషన్ల ఏర్పాటు ఊసే లేకపోవడం.. సిబ్బంది నియామకాలు కానరాకపోవడంతో మద్య నిషేధ అబ్కారీ శాఖ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలపై పనిభారం పెరిగిపోయింది.

Published : 28 Nov 2022 03:08 IST

అందుబాటులోకి రాని కొత్త సెబ్‌ స్టేషన్లు


కర్నూలులోని సెబ్‌ స్టేషన్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కొత్త స్టేషన్ల ఏర్పాటు ఊసే లేకపోవడం.. సిబ్బంది నియామకాలు కానరాకపోవడంతో మద్య నిషేధ అబ్కారీ శాఖ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలపై పనిభారం పెరిగిపోయింది. ఫలితంగా నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 సెబ్‌ స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్లవారీగా పరిశీలిస్తే.. కర్నూలు-3, కోడుమూరు-5, నందికొట్కూరు-4, ఆదోని-2, ఆలూరు-5, ఎమ్మిగనూరు-3, కోసిగి-2, పత్తికొండ-5, నంద్యాల-5, ఆళ్లగడ్డ-5, కోవెలకుంట్ల-4, బనగానపల్ల్లి-3, డోన్‌-3, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో డోన్‌ స్టేషన్‌ పరిధిలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలు కోడుమూరు స్టేషన్‌ పరిధిలోకి వచ్చాయి. నేరాల నియంత్రణ కోసం గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో మూడు కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. నంద్యాల జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీశైలం.. ఆత్మకూరు స్టేషన్‌ పరిధిలో ఉండటంతో నిఘా కొరవడటం పెద్ద సమస్యగా మారింది. కొన్ని స్టేషన్ల పరిధిలో తక్కువ మండలాలు.. మరికొన్నింటి పరిధిలో ఎక్కువ మండలాలు ఉండటంతో నేరాల నియంత్రణ కష్టసాధ్యంగా మారింది. పత్తికొండలో ఐదు మండలాలు ఉండగా ఆదోని, కోసిగి పరిధిలో రెండు మండలాలు మాత్రమే ఉన్నాయి. ఈ మేరకు పునర్విభజన చేయాలని ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త స్టేషన్ల ప్రతిపాదన, పునర్విభజన ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు.

తనిఖీలు అంతంతమాత్రమే

మద్య నిషేధ.. అబ్కారీ శాఖ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోగా విభజన చెందిన తర్వాత రెండింటిలో సిబ్బంది కొరత మరింత తీవ్రమైంది. సెబ్‌ స్టేషన్లలో కనీసం 10 మంది సిబ్బంది కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అధికారుల స్థాయిలో లోటు లేనప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్ల సంఖ్య మరీ తక్కువగా ఉంది. 250 మందికిగాను కేవలం 148 మంది మాత్రమే ఉన్నారు. 102 కానిస్టేబుళ్ల కొరత ఉండటం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో సెబ్‌ సమర్థంగా పనిచేయలేకపోతోందన్న అభిప్రాయం ఉంది. ఇటీవలకాలంలో జిల్లాలో తెలంగాణ, కర్ణాటక మద్యం అక్రమ రవాణా అదుపు చేయలేని స్థాయికి చేరింది. సిబ్బంది లోటుతో కర్నూలు మండలం పంచలింగాల పరిధిలోని అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో వాహనాలు తనిఖీ చేస్తున్న దాఖలాలు లేవు. మిగిలిన చెక్‌పోస్టుల పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపు సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మద్య నిషేధ, అబ్కారీ శాఖలోనూ సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లను పూర్తిస్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు.

కేసుల నమోదు ఇలా..

కర్నూలు జిల్లా పరిధిలో సారాకు సంబంధించి ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబరు వరకు 838 మందిని అరెస్టు చేసి 8,635 లీటర్ల సారా.. 21,660 కేజీల బెల్లం, 99 వాహనాలు సీజ్‌ చేశారు. అక్రమ మద్యానికి సంబంధించి 1,023 కేసులు నమోదు చేసి 1,211 మందిని అరెస్టు చేసి 21,526 లీటర్ల మద్యం, 110 వాహనాలు సీజ్‌ చేశారు. పోలీసుస్టేషన్‌లలోనూ కేసులు నమోదు చేస్తుండటంతో సెబ్‌పై కొంతభారం తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని