logo

ముఖ హాజరు.. ముప్పుతిప్పలు

కళాశాలల్లో బోగస్‌ హాజరుకు చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ హాజరు మొదటి రోజు ఇబ్బందులకు గురి చేసింది. ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలల్లో సాంకేతిక కారణాల వల్ల హాజరు సక్రమంగా చూపలేదు.

Published : 02 Dec 2022 07:51 IST

ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ముఖ హాజరు నమోదు చేస్తున్న అధ్యాపకురాలు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: కళాశాలల్లో బోగస్‌ హాజరుకు చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ హాజరు మొదటి రోజు ఇబ్బందులకు గురి చేసింది. ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలల్లో సాంకేతిక కారణాల వల్ల హాజరు సక్రమంగా చూపలేదు. విద్యా దీవెన, వసతి దీవెన లబ్ధి పొందుతున్న విద్యార్థుల పేర్లు మాత్రమే యాప్‌లో కనిపిస్తుండటంతో మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో బస్సుల్లేక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఆలస్యంగా వస్తారు. వీరంతా గైర్హాజరుగా నమోదవుతుంది... హాజరు శాతం తక్కువైతే ప్రభుత్వ విద్యా పథకాలకు దూరమవుతారు.

మొదటి దశలో డిగ్రీ కళాశాలల్లో

కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫేస్‌ అటెండెన్స్‌ (ముఖ హాజరు) విధానాన్ని అమలు చేయాలని ప్రభుతం నిర్ణయించింది. మొదటి దశలో డిగ్రీ కళాశాలల్లో ఈ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 26 ప్రభుత్వ, 9 ఎయిడెడ్‌, 103 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అధ్యాపకులతో పాటు విద్యార్థుల హాజరు నమోదుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఆయా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను పంపించారు. విద్యార్థుల ముఖాలను పలు కోణాల్లో ఫొటోలు తీసి యాప్‌లో పొందుపర్చారు. యాప్‌ను ఉపయోగించి తరగతి గది వద్ద విద్యార్థుల ముఖాలను ఫొటో తీస్తే హాజరు నమోదు అవుతుంది.

మొదటిరోజే అవాంతరాలు

* కర్నూలు కేవీఆర్‌ కళాశాలలో 1122 మంది విద్యార్థులకు 90 శాతం మంది గురువారం హాజరైనట్లు ప్రిన్సిపల్‌ తెలిపారు. 83 మంది మాత్రమే హాజరైనట్లు యాప్‌లో చూపుతోంది. 1039 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు నమోదైంది. ట్రయల్‌ రన్‌లో సాంకేతిక కారణాలతో హాజరు తక్కువగా నమోదైనట్లు ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు.

* ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 146 మంది ఉన్నారు. మొదటి రోజు 67 మంది ముఖ హాజరు నమోదైంది. 79 మంది గైర్హాజరయ్యారు.

* నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1743 మంది విద్యార్థులకు గాను 526 మంది హాజరయ్యారు. 34 శాతం హాజరు నమోదైంది.


పథకాలకు దూరమవుతాం
- కె.విజయ్‌కుమార్‌రాజు, బీఏ ద్వితీయ సంవత్సరం

మాది ఇందిరేశ్వరం. ఉదయం పొలం పనులకు వెళ్లొచ్చాక కళాశాలకు వస్తుంటాను. ఊరి నుంచి బస్సులో ఆత్మకూరు బస్టాండుకు వచ్చి అక్కడి నుంచి దాదాపు ఒకటిన్నర కి.మీ నడిచి కళాశాలకు వెళ్లాలి. బస్సు ఆలస్యమైన రోజుల్లో హాజరు నష్టపోవాల్సి వస్తోంది. మాలాంటి పేద విద్యార్థులు తక్కువ హాజరు కారణంగా విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వంటి పథకాలు కోల్పోవాల్సి వస్తుంది.


వెసులుబాటు కల్పించాలి
- మన్నెం, అశోక్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు

నాకు చిన్నప్పటి నుంచి మూర్ఛ వస్తుంటుంది. ఆరోగ్యం సరిగా ఉండదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులకు వెళుతుంటాను. ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఇంటి వద్దనే ఉంటాను. ముఖ హాజరు వల్ల రోజూ కళాశాలకు హాజరవ్వాల్సి ఉంటుంది. హాజరు శాతం తగ్గితే విద్యాదీవెన వంటి పథకాలు అందవు. అనారోగ్యంతో బాధపడే నాలాంటి వారికి వెసులుబాటు కల్పించాలి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని