మనువాడతాడని నమ్మి.. మోసపోయాయని తెలిసి

పెళ్లి చేసుకుంటాడని వచ్చిన వాడిని నమ్మి అతనితో సహజీవనం చేసింది. గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోమని కోరింది. అతను నిరాకరించడంతో దిక్కుతోచక ప్రాణం తీసుకుంది.

Updated : 04 Dec 2022 04:40 IST

పురుగుమందు తాగి గర్భిణి ఆత్మహత్య

మృతి చెందిన తాయమ్మ

ఆదోని నేరవార్తలు, కోసిగి, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుంటాడని వచ్చిన వాడిని నమ్మి అతనితో సహజీవనం చేసింది. గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోమని కోరింది. అతను నిరాకరించడంతో దిక్కుతోచక ప్రాణం తీసుకుంది. ఈ విషాద ఘటన కోసిగి మండలంలో జరిగింది. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కోసిగి మండల కేంద్రానికి చెందిన తాయమ్మ(30)కు పన్నెండేళ్ల క్రితం హనుమంతుతో వివాహం చేశారు. వారికి ఒక కుమార్తె సంతానం. ఏడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో తాయమ్మ కుమార్తెతో కలిసి పుట్టింటికి వచ్చి నివాసముంటోంది. రెండేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ మాట నమ్మి అతనితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె గర్భిణి కావడంతో తనను పెళ్లి చేసుకోమని కోరింది. అప్పటికే అతనికి వివాహమై, పిల్లలున్నారు. దీంతో పెళ్లి చేసుకోవడం కుదరదన్నాడు. మనస్తాపం చెందిన తాయమ్మ శనివారం ఆ వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి పురుగుమందు తాగింది. గుర్తించిన ఆ వ్యక్తి బంధువులు తాయమ్మను ఆమె తల్లి ఇంటి వద్ద వదిలేశారు. తల్లి హనుమంతమ్మ ఆమెను చికిత్స కోసం కోసిగి ఆస్పత్రికి తరలించింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. కోసిగి మండల కేంద్రానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడే తాయమ్మ మృతికి కారణమని మృతురాలి బంధువులు, గ్రామస్థులు విలేకరులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని