logo

పర్యవేక్షణ లోపం.. పనులు నాసిరకం

ఏళ్ల తరబడి మన్నికగా ఉండాల్సిన పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. మద్దికెర, తుగ్గలి, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పనుల్లో నాణ్యత నగుబాటుగా మారింది.

Published : 07 Dec 2022 03:26 IST

ప్రారంభించకుండానే పడిపోతున్న నిర్మాణాలు 
గుంతకల్లు- డోన్‌ మార్గంలో పరిస్థితి

మద్దికెర రైల్వే స్టేషన్‌ ఎదుట సిమెంటు రహదారి దుస్థితి

పత్తికొండ, మద్దికెర, వెల్దుర్తి, తుగ్గలి, న్యూస్‌టుడే: ఏళ్ల తరబడి మన్నికగా ఉండాల్సిన పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. మద్దికెర, తుగ్గలి, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పనుల్లో నాణ్యత నగుబాటుగా మారింది. ఆయా స్టేషన్లలో కొత్త భవనాలు, ప్రహరీలు, ప్లాట్‌ఫాంలు సిమెంటు రహదారుల నిర్మాణానికి రైల్వే శాఖ రూ.కోట్ల మంజూరు చేసింది. నాసిరకంగా నిర్మిస్తుండటంతో నిర్మాణాలు పూర్తి కాకుండానే శిథిలమవుతున్నాయి. రూ.కోట్ల దుర్వినియోగం అవుతున్నా ఎవరికీ పట్టడం లేదు. మామూళ్లు తీసుకుని అధికారులు పర్యవేక్షణ మరవడంతో ప్రారంభానికి ముందే నిర్మాణాలు కూలిపోతున్నాయి.


మద్దికెర స్టేషన్‌ భవనంలో జలధార

మద్దికెరలో కొత్త రైల్వే స్టేషన్‌ భవనం, ప్లాట్‌ఫాం, తదితర అభివృద్ధి పనులకు రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేశారు. పనులు నాసిరకంగా చేయడంతో చిన్నపాటి వర్షానికే పూర్తిగా కారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా నెల రోజుల అనంతరం మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోయింది. ప్రారంభమై మూడు నెలలు గడవక ముందే ప్లాట్‌ఫాం కుంగిపోతోంది. భవనానికి వేసిన రంగులు వెలిసిపోతున్నాయి. స్టేషన్‌ ముందు నిర్మించిన సిమెంటు రహదారి మొత్తం శిథిలమై కంకర తేలిపోయింది. మెట్లకు వేసిన టైల్స్‌ పగిలిపోయాయి. ఇలా స్టేషన్‌లో జరిగిన ప్రతి పనిలో నాణ్యత లోపించింది. అయినా సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.


తుగ్గలిలో కుంగిన మెట్లు

తుగ్గలి రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం, నూతన భవనం తదితర అభివృద్ధి పనుల కోసం రూ.కోటికి పైగా నిధులు మంజూరయ్యాయి. గుత్తేదారులు పనుల్లో నాణ్యత మరిచారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి కొత్తగా వేసిన టైల్స్‌ ఊడిపోయి పగిలిపోతున్నాయి. నిర్మాణ సమయంలో క్యూరింగ్‌ చేయకపోవడం,  పనులు జరిగే సమయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పనుల్లో నాణ్యత లోపించింది. రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం విడుదల చేస్తున్న రూ.కోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.


వెల్దుర్తిలో కూలుతున్న ప్రహరీ

వెల్దుర్తి రైల్వే స్టేషన్‌లో రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్లాట్‌ఫాం ఎత్తు పెంచడంతో పాటు, తాగునీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణం తదితర పనులను గుత్తేదారు పూర్తి నాసిరకంగా నిర్మిస్తున్నారు. పూర్తికాకుండానే ప్రహరీ పగుళ్లు ఇస్తోంది. నీటి సౌకర్యం లేక చేపట్టిన పనులకు సరైన క్యూరింగ్‌ లేక నిర్మాణాలు దెబ్బతింటున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌ ముందు సిమెంటు రహదారికి బదులుగా కంకర వేసి వదిలేయడంతో దీనిపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే పనులపై పర్యవేక్షణ లేని కారణంగానే ఇలా నాసిరకంగా నిర్మించి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.


ఉన్నతాధికారులకు వివరించాం
- జీసన్‌ క్రిస్టోఫర్‌, మద్దికెర స్టేషన్‌ సూపరింటెండెంట్‌

మద్దికెరలో ఇటీవల ప్రారంభమైన నూతన రైల్వే స్టేషన్‌ భవనం మొదటి వర్షానికే కారింది. దీంతో తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వారు భవనం కారకుండా తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని