logo

ఇసుక, మద్యంపైనే వైకాపా నేతల దృష్టి : కోట్ల

అధికార వైకాపా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, ఇసుక, మద్యంపైనే నాయకులు దృష్టి పెట్టారని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు.

Updated : 07 Dec 2022 04:09 IST

బూడిదపాడులో పర్యటిస్తున్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

గూడూరు, న్యూస్‌టుడే: అధికార వైకాపా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, ఇసుక, మద్యంపైనే నాయకులు దృష్టి పెట్టారని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. గూడూరు మండలం బూడిదపాడు గ్రామంలో మంగళవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో మాస్కులు కుట్టిన వాళ్లకు సైతం వైకాపా నాయకులు డబ్బు చెల్లించలేదన్నారు. జేబులు నింపుకోవడానికే వారికాలం సరిపోతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెదేపాకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తెదేపా అధికారంలోకి రాగానే రైతులకు సంవృద్ధిగా ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా కోడుమూరు బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌, మండల బాధ్యుడు సుధాకరరెడ్డి, బంగారు శ్రీను, సుందరరాజు, మద్దిలేటి, రాముడు, ఈరన్న, సురేశ్‌, బుగ్గన్న, కాడప్ప, నరసింహులు, రాజు తదితరులు పాల్గొన్నారు.


పాదయాత్ర విజయవంతం చేస్తాం

నారా లోకేశ్‌తో తెలుగుయువత నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: మోసపూరిత హామీలతో ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా అన్ని వర్గాలనూ నయవంచనకు గురి చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు పార్లమెంటరీ తెలుగు యువత కార్యదర్శి ఎస్‌.మోతిలాల్‌, పాణ్యం తెలుగుయువత అధికార ప్రతినిధి కోట్ల తిమ్మారెడ్డి, నందమూరి యువసేవా సమితి అధ్యక్షుడు డి.రమేశ్‌కుమార్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌లో లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం చేపట్టబోయే ఏ కార్యక్రమానికైనా వెన్నంటి నడుస్తామని, పాదయాత్రను విజయవంతం చేస్తామని వారు ఆయనకు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఫారూక్‌, అస్లామ్‌, మనోహర్‌బాబు, శంకర్‌, ఓబులేసు పాల్గొన్నారు.


ప్రజా సమస్యలు గాలికొదిలేశారు

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో గౌరు చరితారెడ్డి, తదితరులు

కల్లూరు గ్రామీణ : వైకాపా ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి తెలిపారు. కల్లూరు పట్టణం 34వ వార్డులో మంగళవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీల్లో పర్యటించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేశారు.


బీసీలను మోసం చేస్తున్న జగన్‌

ఆదోని గ్రామీణం : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని ఆదోని నియోజకవర్గ తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు అన్నారు. ఆదోని పట్టణంలోని శుక్రవారం పేట 41 వార్డు, కార్వన్‌పేట 14 వార్డులో మంగళవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు పాల్గొని ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ గర్జన పేరిట సభలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై జగన్‌ను ఇంటికి పంపే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. తెదేపా నాయకులు గిడ్డి శంకర్‌, బాలాజీ, లక్ష్మన్న, మల్లికార్జున, హనుమంతు, శివ, మహానంది, తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబు పర్యటన భయంతోనే రాయలసీమ గర్జన

మాట్లాడుతున్న పి.తిక్కారెడ్డి

మంత్రాలయం : జిల్లాలో చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం కావడంతో భయపడి వైకాపా నాయకులు సీమ గర్జన పెట్టారని మంత్రాలయం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు పి.తిక్కారెడ్డి విమర్శించారు. మంత్రాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో చంద్రబాబునాయుడు పర్యటనకు అర్ధరాత్రి అయినా ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారన్నారు. లక్ష మందితో గర్జన అని పెడితే 14 వేల మంది లేరని ఎద్దేవా చేశారు. చావడి వెంకటేశులు, కృష్ణమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, చంద్ర, లక్ష్మయ్య, సత్యనారాయణరెడ్డి, చైర్మన్‌ నరసింహ, ఏబు, విజయ్‌, భీమన్న, సుంకప్ప పాల్గొన్నారు.


సంక్షేమం పేరుతో నిలువు దోపిడీ

ముగతిలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బీవీ

నందవరం(ముగతి), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో నిలువు దోపిడీ చేస్తోందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ.జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. మండలం లోని ముగతి గ్రామంలో బుధవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి తెదేపా జెండా ఆవిష్కరించి, ఎన్‌టి.రామారావు, మాజీ మంత్రి బీవీ.మోహన్‌రెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి అసమర్థ పాలనలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు ఈరన్నగౌడ్‌, భార్గవ్‌ యాదవ్‌,  దేశాయి మాధవరావు, చిన్నరాముడు, ఖాశీంవలి, నారాయణరెడ్డి, గోపాల్‌, బాలరాజు, రఘుమూర్తి స్వామి, తాయన్న, బండేగురు స్వామి, కొండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో అభివృద్ధిలో శూన్యం

తెర్నేకల్‌ (దేవనకొండ) న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆలూరు తెదేపా బాధ్యురాలు కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు. దేవనకొండ మండలంలోని కరివేముల, తెర్నేకల్‌ గ్రామాల్లో మంగళవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జలాశయాల్లో నీరున్నా పాలకుల నిర్లక్ష్యంతో పంటలకు డిసెంబర్‌ వరకే ఇస్తామని చెప్పడం ఇదేం ఖర్మ మనకు అని విమర్శించారు. గర్జనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ విజయ్‌, మల్లయ్య, ఉచ్చీరప్ప, వెంకటరెడ్డి, నాగేష్‌, రాముడు, తిమ్మప్ప, లతీఫ్‌, మాలీక్‌, గిడ్డయ్య, మండల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని