logo

అనిశా కేసుల అస్త్రం

ప్రభుత్వ శాఖల్లో అవినీతి రోజురోజుకు పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఏ శాఖలో చూసినా వెతికేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి.

Published : 09 Dec 2022 03:44 IST

నేడు ప్రపంచ  అవినీతి వ్యతిరేక దినం
కొత్త పంథాలో వెళ్లాలని నిర్ణయం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ శాఖల్లో అవినీతి రోజురోజుకు పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఏ శాఖలో చూసినా వెతికేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. అవినీతి నిరోధకశాఖ పలుమార్లు దాడులు జరపడం ద్వారా కొంతమేర అక్రమార్కుల ఆట కట్టిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి. ఈ క్రమంలో అవినీతిపరులపై గట్టి చర్యలకు అనిశా నూతన పంథాను అనుసరిస్తోంది.  సాక్ష్యాధారాలు సేకరించి దొరికిన అనధికార డబ్బును నిర్ధారించి కేసు నమోదు చేసే విధానాన్ని మొదలుపెట్టింది.

గతం...

లంచం తీసుకుంటుండగా నేరుగా పట్టుకోవటం... ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించి సీజ్‌ చేసి సదరు అధికారులపై కేసు నమోదు, ఆకస్మిక తనిఖీలు చేయటం వంటివి అవినీతి నిరోధకశాఖ అధికారులు చేసేవారు.
* ఆకస్మిక తనిఖీలో గుర్తించిన వాటిపై పంపే నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి బాధ్యులను సస్పెన్షన్‌ చేయడం గానీ.. బదిలీ చేసేది.. ఆ తర్వాత వారు తమ పలుకుబడి ఉపయోగించి తిరిగి విధుల్లో చేరే వారు.

ప్రస్తుతం

ఈ ఏడాది ఏప్రిల్‌ 27వ తేదీన కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ శివనారాయణస్వామి తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. కల్లూరులో రూ.40 వేల నగదు బీరువా వెనుక దొరికింది. దీనిని అవకాశంగా చేసుకుని డీఎస్పీ లోతుగా దర్యాప్తు చేశారు. వ్యూహాత్మకంగా ఆరోజు జరిగిన రిజిస్ట్రేషన్‌ వివరాలు సేకరించారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తులను గుట్టుగా విచారించగా.. కొందరు లంచం ఇచ్చినట్లు తెలిపారు. వారి వాంగ్మూలాలను.. సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించిన అనిశా అధికారులు కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ అరుణ్‌కుమార్‌ను ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేసి నవంబరు 7న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

ఫోన్‌ చేసి చెప్పొచ్చు

అవినీతిని నిరోధించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 14400 నంబరుతో టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయటంతోపాటు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  సదరు నంబరుకు ఫోన్‌ చేయడం గానీ.. యాప్‌ ద్వారా ఫిర్యాదు పత్రాన్ని పంపవచ్చు.

కాసుల కట్టలతో దొరికేశారు

* ఈ ఏడాది జనవరిలో నందికొట్కూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై దాడి చేసి రూ.78 వేల అనధికార నగదు, ఫిబ్రవరిలో ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై దాడి చేసి రూ.1.34 లక్షల అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు.
* మే 23వ తేదీన కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయానికి చెందిన ఏపీవో నాగమద్దిలేటి రూ.15 వేలు తీసుకుంటుండగా అనిశా డీఎస్పీ శివనారాయణస్వామి దాడి చేసి పట్టుకున్నారు. అదే నెల 27వ తేదీన వెల్దుర్తి ఏఎస్సై ఖాదర్‌వలి రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
* జూన్‌ 22న కర్నూలు నగరపాలకసంస్థ ఈఈ సురేంద్రబాబు రూ.15 లక్షలు  తీసుకుంటూ దొరికిపోయారు.
* సెప్టెంబరు 14న సి.బెళగల్‌ ఎస్సై శివాంజల్‌ రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికారు. అదే నెల 21న హౌసింగ్‌ కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వరరెడ్డి రూ.5 వేలు తీసుకుంటూ దొరికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని