logo

రైతులకు రుణపాశం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్‌లో 17.46 లక్షల ఎకరాలు, రబీలో 3.94 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు.

Published : 22 Jan 2023 01:24 IST

ఏడాదిలోపు చెల్లించని వారికి నోటీసులు

సున్నా వడ్డీకి చాలా మంది దూరం

కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్‌లో 17.46 లక్షల ఎకరాలు, రబీలో 3.94 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. ఖరీఫ్‌ కాలాన్ని అతివృష్టి ముంచింది. అప్పులు తీర్చుదామన్న ఆశతో అన్నదాతలు రబీ సీజన్లో అడుగుపెట్టారు. ఇచ్చే రుణాలే తక్కువ.. తీసుకున్నవారూ ఏడాదిలోగా అసలు, వడ్డీతో కలిపి చెల్లించాలని సహకార బ్యాంకు అధికారులు డి…మాండ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. రుణాలు సకాలంలో చెల్లించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏడు శాతం వడ్డీ రాయితీని పొందొచ్చని సూచిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నాలుగు శాతం వడ్డీపై  కొర్రీలు పెడుతోంది. బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు, ఈ-పంట నమోదుకు అనుసంధానం చేయడంతో లబ్ధిపొందే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం.

కొందరికే వడ్డీ రాయితీ

2021 ఖరీఫ్‌లో రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీ పథకం అందించింది. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 75,272 మంది రైతులకు రూ.17.16 కోట్ల ప్రయోజనం దక్కింది. ఇందులో 58 వేల మంది రైతులకు కేంద్రం ఇచ్చే 3 శాతం వడ్డీ రాయితీ జమైంది. 17 వేల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ రాయితీ వచ్చినట్లు తెలుస్తోంది.

నాడు..

రూ.3 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని గత తెదేపా ప్రభుత్వ హయాంలో వర్తింపజేశారు. రూ.లక్ష వరకు 4 శాతం వడ్డీ రాయితీ, మిగిలిన రెండు లక్షలకు ఒక శాతం వడ్డీ రాయితీ ఇస్తూ.. 3 శాతానికి పావలా వడ్డీ వసూలు చేసేవారు. ఇది అప్పట్లో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేంది. రూ.3 లక్షల వరకు పంట రుణాలు తీసుకునే రైతులకు కేంద్రం 3 శాతం వడ్డీ ఇచ్చేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడు శాతం వడ్డీ రాయితీ  రైతులకు దక్కేది.

నేడు..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని రూ.లక్ష లోపు పంట రుణం తీసుకునే రైతులకే వర్తింపజేస్తోంది. రూ.లక్షకు పైబడి రూ.3 లక్షల వరకు పంట రుణం తీసుకునేవారికి ఇది వర్తించదు. రూ.లక్షలోపు పంట రుణం తీసుకునేవారూ ఏడాది లోపు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. ఈ-పంట నమోదు ఆధారంగా రుణం తీసుకున్న పంటకు, ఈ-పంట నమోదులో సాగైన పంట ఒక్కటిగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తుంది.

ఇస్తోంది అరకొరనే

* ఉమ్మడి కర్నూలు జిల్లాలో సహకార బ్యాంకులతోపాటు అన్ని వాణిజ్య బ్యాంకులు కలిపి ఖరీఫ్‌, రబీ సీజన్లలో సుమారు రూ.9 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. రెండు సీజన్లకు కలిపి రూ.6 వేల కోట్ల రుణాలు మంజూరు చేశాయి.

*  ఉమ్మడి జిల్లాలో కౌలు రైతులకు రూ.100 కోట్ల రుణాలు లక్ష్యం కాగా కేవలం 220 మంది రైతులకు రూ.1.50 కోట్లు ఇవ్వడం గమనార్హం. రూ.లక్ష లోపు పంట రుణం తీసుకున్న రైతులు లక్ష మందికి పైగా ఉన్నారు.

*  ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో 80 వేల మంది రైతులకు రూ.500 కోట్ల రుణాలు ఇచ్చారు. ఏడాదిలోగా చెల్లించకుంటే 12 నుంచి 13.5 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని