logo

ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) ఛైర్మన్‌, కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 22 Jan 2023 01:24 IST

మాట్లాడుతున్న ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) ఛైర్మన్‌, కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. దిశా కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బిర్లాగేటు వద్ద ఉన్న నేషనల్‌ అకాడమీ కోచింగ్‌ సెంటరులో మరిన్ని కోర్సులు పెంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు ప్రాంతాల్లో జింకల బెడద కారణంగా పంటలకు తీవ్ర నష్టం జరుగుతోందని కమిటీ సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. స్పందించిన ఛైర్మన్‌ సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ సమస్య చాలాకాలంగా ఉందని, జింకల పార్కు ఏర్పాటుకుగాను రూ.35 కోట్లు మంజూరు చేసేలా చూడాలని కమిటీ ద్వారా కలెక్టర్‌ను కోరారు. కోడుమూరులో 30 ఏళ్లుగా తాగునీటి సమస్య వేధిస్తోందని, తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రూ.20 కోట్లు మంజూరు చేయించానని.. త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎంపీ ఆదేశించారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు కర్నూలు జిల్లాకు 18 మంజూరు కాగా 12 పూర్తయ్యాయని.. మిగిలినవి త్వరలో పూర్తవుతాయని డీఎంహెచ్‌వో డా. రామగిడ్డయ్య విన్నవించారు. వైఎస్సార్‌ జలకళ ద్వారా బోర్లు వేస్తున్నారని.. వీటికి విద్యుత్తు కనెక్షన్లు త్వరగా ఇచ్చేలా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని ఎంపీ పేర్కొన్నారు. కర్నూలు నుంచి గుంటూరు రోడ్డు మార్గం పనులు మంజూరయ్యాయని, త్వరితగతిన పనులు మొదలుపెడతారని నేషనల్‌ హైవే అధికారులు చెప్పారు.

వైద్య సిబ్బందిపై చర్యలు అవసరం

దిశా కమిటీ వైస్‌ ఛైర్మన్‌, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణకొట్కూరు పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది సరిగా విధులు నిర్వహించడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు పూడికతో నిండిపోతోందని, జలవనరులశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తగు సూచనలు పంపాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కింద కిచెన్‌ షెడ్డు నిర్మించాలని సభ్యులు కోరగా స్పందించిన కలెక్టర్‌ కోటేశ్వరరావు స్పందించారు.  ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు సమస్య పరిష్కరించాలని, ప్రధానమంత్రి సడక్‌ యోజన పథకం కింద బళ్లారి చౌరస్తా నుంచి పెద్దపాడు వరకు రోడ్డు పనులు మంజూరు చేయాలని కోరారు.  ఎమ్మెల్యేలు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, డా.జె.సుధాకర్‌, డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి, నంద్యాల డీఆర్వో పుల్లయ్య, కమిటీ సభ్యులు రమేష్‌, నరసింహ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని