logo

అక్కలే అమ్మానాన్నలు

పెట్టుబడులు మట్టిలో కలిశాయి.. అప్పులు గుండెల్లో గునపాలయ్యాయి... భారమైన బతుకులతో పెద్దలు ఊరుగాని ఊరెళ్లారు!! అక్షరం మరిస్తే రాత చెదిరిపోతుందని.. ఆ పసి హృదయాలు పల్లెను దాటలేదుఅమ్మానాన్నకు దూరంగా ఉంటున్నారు..

Published : 24 Jan 2023 02:25 IST

నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం
- న్యూస్‌టుడే, కౌతాళం

పెట్టుబడులు మట్టిలో కలిశాయి..
అప్పులు గుండెల్లో గునపాలయ్యాయి...
భారమైన బతుకులతో పెద్దలు ఊరుగాని ఊరెళ్లారు!!
అక్షరం మరిస్తే రాత చెదిరిపోతుందని..

ఆ పసి హృదయాలు పల్లెను దాటలేదు
అమ్మానాన్నకు దూరంగా ఉంటున్నారు..

ఇంటి వద్ద ‘అమ్మ’ పాత్ర పోషిస్తున్నారు..  
గుండె ధైర్యంతో నాన్న బాధ్యత నిర్వర్తిస్తున్నారు..

పదో తరగతైనా పూర్తికాకుండానే కొందరు బాలికలు జీవిత పాఠం నేర్చుకుంటున్నారు. పెద్దలు వలస పోతే పిల్లలకు ఎదురయ్యే కష్టాలు అనుభవమే.. వారి చదువు పాడవుతుందని తెలుసు.. అయినా సరే అప్పులు తీర్చే మార్గంలేక సుగ్గికిపోతున్నాయి పశ్చిమ పల్లెలు. బడి కోసం బిడ్డలను ఇక్కడే వదిలేసి ఎందరో ఉపాధి బాట పట్టారు. అమ్మానాన్నల తోడులేని ఆ బాలికలు చదువుతున్న జీవిత పాఠం వింటుంటే భళా అనిపిస్తోంది.!!


ఆరు గంటలకు లేచి అన్నం వండి

కంటతడి పెడుతున్న చిన్నారులు

బతకడానికి అమ్మానాన్నలు హైదరాబాద్‌ వెళ్లారు. నేను, చెల్లి గ్రామంలోనే ఉంటున్నాం. గోతులదొడ్డిలోని పాఠశాలలో నేను ఆరో తరగతి, చెల్లి మల్లిక నాలుగో తరగతి చదువుతున్నాం. ఉదయం, రాత్రి నేనే వంట చేస్తా. మధ్యాహ్నం బడిలో తింటాం. ఇల్లు శుభ్రం చేయడం.. నీళ్లు తేవడం అన్ని పనులు నేనే చేస్తా. పప్పు వండటం రాదు.. ఎక్కువగా టమాట, ఉల్లిగడ్డ, ఆకుకూరలతో కూరలు చేస్తా. కూరగాయలు కొనుక్కోవడానికి మా వద్ద రూ.200 ఉన్నాయి. బడిలేనప్పుడు కూలి పనులకెళ్తా. ఇంటి పక్కనే అవ్వాతాతల ఇల్లు ఉంది. రాత్రివేళ అక్కడికి వెళ్తాం. అమ్మ గుర్తుకొచ్చినప్పుడు చెల్లిని ఓదార్చలేకపోతున్నా.. ఫోన్లో మాట్లాడాలనుకుంటాం. మా వద్ద ఫోన్‌ లేదు.’’ అంటూ గాయత్రి కంటతడి పెట్టింది.


అవ్వ.. తమ్ముడికి ఆధారం

నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. నాన్న పెద్ద హనుమంతు, అమ్మ గుంటెమ్మలు మిరప పనుల నిమిత్తం గుంటూరుకు వెళ్లారు. ఇద్దరు తమ్ముళ్లను వెంట తీసుకెళ్లారు. మరో తమ్ముడు హర్షవర్ధన్‌ను నా వద్దే ఉంచి వెళ్లారు. కళ్లు కనిపించని అవ్వ, తమ్ముడిని నేనే చూసుకుంటున్నా. ఉదయం 6 గంటలకే లేచి ఇళ్లంతా శుభ్రం చేస్తా. వంట చేసి తమ్ముడు, అవ్వకు తినిపించి కోసిగి మండల కేంద్రం పల్లెపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్తాను. మధ్యాహ్నం బడిలో భోజనం చేసి వెంటనే ఇంటికొచ్చి అవ్వకు తినిపించి మళ్లీ వెళ్తా. సాయంత్రం వచ్చాక.. ఇంటి, వంట పనులు చేస్తా’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది పద్మావతి

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు


చెల్లి ఏడుస్తుందని దుఃఖాన్ని దిగమింగుకుని

గాయత్రి

అమ్మ నాగలక్ష్మి, నాన్న హనుమంతు సుగ్గికెళ్లారు. వారితోపాటు ఇద్దరు అన్నయ్యలను తీసుకెళ్లారు. నేను, చెల్లి అవ్వా, తాతల వద్ద ఉంటున్నాం. కోసిగి మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నేను ఏడో తరగతి చదువుతున్నా. చెల్లెలు శీర్షిక ఒకటో తరగతిలో ఉంది. మిరప పనులకెళ్లి డబ్బులు తెస్తామని అమ్మ చెప్పింది.. రోజూ బడికెళ్లి బాగా చదువుకోవాలని.. ఇంట్లో అవ్వకు తోడుగా ఉండాలంది. మంచినీరు, కిరాణా సరకులు నేనే తెస్తా. చెల్లెలికి స్నానం చేయించి బడికి తీసుకెళ్తా. అమ్మా కోసం చెల్లెలు ఏడిస్తే కొత్త దుస్తులు, చెప్పులు తేవడానికి వెళ్లారని ఓదారుస్తా. అమ్మ ఇంట్లో లేకపోతే ఏడుపొస్తోంది. నేను ఏడిస్తే చెల్లి ఏడుస్తుంది.. అందుకే దుఃఖాన్ని దిగమింగుకుంటున్నా.’’ అంటోంది గాయత్రి

న్యూస్‌టుడే, కోసిగి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని