logo

బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి క్షేత్రం ముస్తాబు

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరగనున్న ఉత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 31 Jan 2023 02:12 IST

రూ.2.50 కోట్లతో పనులు
ఏర్పాట్లపై నేడు కలెక్టర్‌ సమీక్ష

రథశాల నుంచి నంది మండపం వరకు పురవీధుల విస్తరణ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరగనున్న ఉత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి పది లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. వారికి వసతులు కల్పించేందుకు రూ.2.50 కోట్లతో వివిధ రకాల పనులు చేపడుతున్నారు. ఏర్పాట్లపై కలెక్టర్‌, ఎస్పీ మంగళవారం సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

దర్శనానికి అదనపు క్యూలైన్లు

ఆలయానికి ఇరువైపులా ఉన్న పాత దుకాణాలు ఇటీవల తొలగించారు. ఆ స్థలంలో రేకులషెడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్లు నిర్మిస్తున్నారు.

గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సీసీ రహదారులు నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈసారి రథోత్సవం, ప్రభోత్సవాలు ఎక్కువ మంది భక్తులు వీక్షించడానికి అవకాశం కలిగింది.

అదనపు లడ్డూ విక్రయ కేంద్రాలు, క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. టిక్కెట్‌ కౌంటర్ల వద్ద కొత్తగా షెడ్డు నిర్మిస్తున్నారు.

పాతాళగంగ స్నాన ఘాట్ల వద్ద మెష్‌, బారికేడ్లు, క్యూలైన్ల ప్రవేశం వద్ద కొత్తగా మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు వస్తువులు భద్రపరుచుకునే గదులు సిద్ధం చేస్తున్నారు.

వీటిపై దృష్టి సారించాలి మరి

ఉత్సవాల ప్రారంభానికి వారం రోజుల ముందుగానే భక్తులు పాదయాత్రగా వస్తారు. నాగులూటి నుంచి కైలాసద్వారం వరకు జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాలి.

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నందున దేవస్థానం ఆధ్వర్యంలో పలు ప్రదేశాల్లో శివదీక్షా శిబిరాలు ఏర్పాటు చేయాలి. గతంలో ఆయా శిబిరాల్లో భక్తులకు మూడు పూటలా అన్నప్రసాదం అందించేవారు. అన్నదానం చేసే దాతలకు సకాలంలో సదుపాయాలు కల్పించాలి. అన్నదాన కేంద్రాల వద్ద విద్యుద్దీపాలు, తాగునీటిని డ్రమ్ములు అదనంగా ఏర్పాటు చేయాలి.

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా బస్సులు, ఇతర వాహనాలను రింగ్‌రోడ్డు మీదుగా పార్కింగ్‌ ప్రదేశాలకు మళ్లిస్తారు. రింగ్‌రోడ్డు సుమారు 6 కి.మీ పైగా దూరం ఉంది. అంత దూరం నుంచి భక్తులు సత్రాల వద్దకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. రింగ్‌రోడ్డులో ప్రతి కిలోమీటర్‌కు ఒకచోట సత్రాలు, వసతి సముదాయాల వివరాలతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. పలుచోట్ల ట్రాఫిక్‌ నియంత్రణకు గేట్లు ఏర్పాటు చేశారు. వీటి వల్ల కార్తిక మాసంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

దుకాణాలు, హోటళ్లలో ఆహార పదార్థాలు నాణ్యతతో, నిర్ణీత ధరలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.

అదనపు క్యూలైన్‌ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు


మంచినీరు.. చలువ పందిళ్లు

భక్తులకు 30 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. 20 లక్షల గ్యాలన్లు ఫిల్టర్‌, 10 లక్షల గ్యాలన్లు క్లోరినేషన్‌ చేసిన నీటిని సరఫరా చేయనున్నారు. వీటికి సంబంధించి టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు. వెంకటాపురం, నాగులూటి, పెచ్చెరువు, కైలాస ద్వారం వద్ద నిరంతర నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు.

బ్రహ్మోత్సవాలకు వందలాది ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. డ్రైవర్లు, కండక్టర్లకు బస్టాండ్‌ ప్రాంగణంలో రక్షితనీటి సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక విధులకు వచ్చే డ్రైవర్లకు వసతి పెంచాలని కోరుతున్నారు.

ఆలయ మాడవీధులు, క్షేత్ర పరిధిలో చలువ పందిళ్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు అన్నదానం చేసే ప్రదేశాల వద్ద షామియానాలు, పెండాల్స్‌ పనులు చేపడుతున్నారు. కైలాస ద్వారం, వెంకటాపురం వద్ద చలువపందిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బస్సుల పార్కింగ్‌ ప్రదేశాల వద్ద ఏటా అరకొరగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని