logo

పత్తి పరిశ్రమ కుదేలు

ఆదోని.. పత్తి వ్యాపారానికి పెట్టింది పేరు. ప్రస్తుతం పరిశ్రమల నిర్వహణ దినదిన గండంగా మారింది. ఒకప్పుడు లక్షల పత్తి బేళ్లు ఉత్పత్తి చేసిన చరిత్ర ఆయా పరిశ్రమలకు ఉంది.

Published : 31 Jan 2023 02:12 IST

ఆదోని మార్కెట్లో పత్తి

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆదోని.. పత్తి వ్యాపారానికి పెట్టింది పేరు. ప్రస్తుతం పరిశ్రమల నిర్వహణ దినదిన గండంగా మారింది. ఒకప్పుడు లక్షల పత్తి బేళ్లు ఉత్పత్తి చేసిన చరిత్ర ఆయా పరిశ్రమలకు ఉంది. ఈసారి రెండు లక్షల పత్తిబేళ్లు ఉత్పత్తి అయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగు చేశారు. పది లక్షల పత్తి బేళ్ల వ్యాపారం జరుగుతుందని అందరూ అంచనా చేశారు. అకాల వర్షాలు, చీడపీడలు బారిన పడి దిగుబడి పూర్తిగా పడిపోయింది.

నిర్వహణకు తప్పని కష్టాలు

ఆదోనిలో 50-60 వరకు పత్తి పరిశ్రమలున్నాయి. ఒక్కో పరిశ్రమ స్థాపనకు రూ.10-15 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇవన్నీ సవ్యంగా కొనసాగాలంటే కనీసం రోజుకు 50 వేల క్వింటాళ్ల పత్తి కావాలి. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌కు 2-4 వేల క్వింటాళ్ల పత్తి వస్తోంది. ముడిసరకు లేక.. వాటి విద్యుత్తు, యంత్రాలు, బ్యాంకు రుణాల కలిపి నెలకు కనీసం రూ.20-25 లక్షల రుణభారంతో నెట్టుకొచ్చేందుకు పరిశ్రమదారులు ఆపసోపాలు పడుతున్నారు. విద్యుత్తు బిల్లే కనీసం నెలకు రూ.లక్ష ఉండటం గమనార్హం. ‘‘ ధరలు పడిపోవడం, సరకు లేకపోవడంతో చాలా పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించుకున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది ఉపాధి దెబ్బతిసేలా చేసింది. ఇంతటి దీన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ’’ పత్తి వ్యాపార సంఘం కార్యదర్శి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

ఆర్థిక మాంద్యం ప్రభావం

ఆర్థిక మాంద్యంతో పాటు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం, వస్త్ర పరిశ్రమల్లో ఉత్పత్తి లేకపోవడం, నూలుకు గిరాకీ లేకపోవడం.. ఆ ప్రభావం పత్తిపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాది సీజన్‌ ఆరంభానికి ఆగస్టులో పత్తి క్వింటాలు రూ.12-13 వేలు ఉండేది. దూది కండి ధర రూ.లక్ష ఉండేది. అక్కడి నుంచి ధరలు దిగుతూ వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధరలు కనిష్ఠ-గరిష్ఠంగా రూ.5-8 వేలు నడుస్తోంది. ఇక దూది కండె ధర రూ.50-62 వేలు, పత్తి గింజలు రూ.3వేలు- 3500 దాకా పలుకుతున్నాయి.

నిల్వ నష్టం రూ.30 కోట్లు

ఒక్కసారి పత్తి కొనుగోలు చేసి.. దూదిగా మలిచేందుకు రోజులు పడతాయి. అలాంటిది దీపావళి అనంతరం అధిక ధరలతో కొనుగోలు చేసిన పత్తి నిల్వలు పరిశ్రమల్లో పేరుకుపోయాయి. ఎప్పటికైనా ధర పెరుగుతుందని ఆశ. ఇలా అన్ని పరిశ్రమల్లో సుమారు 30-40 వేల బేళ్లు నిల్వ ఉంటాయనేది అంచనా. ఒక్కో బేళ్లపై కనీసం నిర్వహణ ఖర్చులు కలుపుకొంటే రూ.10 వేల దాకా ఉంటోంది. ఇలా సుమారు 30-40 కోట్లు దాకా నష్టం చవిచూడాల్సి వస్తోంది. దీంతో నష్టానికి అమ్ముకోలేక ధర కోసం ఎదురుచూస్తున్నారు.

కార్మికులకు ఉపాధి దెబ్బ

ఆదోని మార్కెట్లో ఏటా పత్తి వ్యాపారం తగ్గుతోంది. 2020-21 ఏడాదిలో సరాసరి ఆరేడు లక్షల పత్తి బేళ్లు ఉత్పత్తి అయిన దాఖలాలూ ఉన్నాయి. 2021-22 ఏడాదిలో నాలుగు లక్షల పత్తి బేళ్లు, 2022-23 ఏడాదిలో కేవలం రెండు లక్షల పత్తి బేళ్ల వ్యాపారం సాగింది.

మార్కెట్‌ యార్డు నమ్ముకుని ప్రత్యక్షంగా 4-5 వేల మంది కార్మికులు, పరోక్షంగా పది వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో హమాలీలే అధికం. వంద మంది పత్తి వ్యాపారులు, 300లకు పైగా కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు.

ఏటా దసరా మొదలు ఉగాది వరకు సీజన్‌ నడుస్తుంది. ఈ సారి డిసెంబరు ఆరంభానికే ముగిసినట్లైంది. మార్కెట్‌ను నమ్ముకుని గుమస్తాలు, హోటళ్లు, తోపుడు బండ్లు, మహిళా కూలీలతో పాటు పట్టణ మార్కెట్‌ ఆధారపడి ఉంది. ప్రస్తుతం వ్యాపారాలు లేక డీలా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని