logo

ముఖ హాజరు.. ముప్పు తిప్పలు

ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) విధానం ఉద్యోగులను భయపెడుతోంది. వ్యక్తిగత వివరాల గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 31 Jan 2023 02:12 IST

వ్యక్తిగత వివరాల గోప్యతపై ఆందోళన

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) విధానం ఉద్యోగులను భయపెడుతోంది. వ్యక్తిగత వివరాల గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వర్తించే కార్యాలయాల్లో నిత్యం ఉదయం, సాయంత్రం ముఖ గుర్తింపు హాజరును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వ్యక్తిగత ఫోన్లలోనే నిర్దేశిత ‘ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంది. ఆధార్‌, ఉద్యోగ గుర్తింపు సంఖ్య వంటివి  నమోదు చేసేందుకు చాలామంది వెనుకంజ వేస్తున్నారు.


పత్తికొండ పంచాయతీరాజ్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఉదయం 10 గంటలకు కార్యాలయంలో విధులకు హాజరయ్యారు. ముఖ హాజరు నమోదు చేసుందుకు సుమారు గంటకు పైగా ఇబ్బందులు పడ్డారు.

పత్తికొండ గ్రామీణం


క్షేత్రస్థాయి సిబ్బందిలో ఆందోళన

క్షేత్ర పర్యటనకు వెళ్లే ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కార్యాలయంలోనే యాప్‌ ఓపెనవుతుంది. నిర్దేశిత దూరం దాటినా పనిచేయదు. హాజరు వేసుకుని క్షేత్ర పర్యటనకు వెళ్లాలంటే గగనమే. జలవనరుల శాఖలో పనిచేసే సిబ్బంది, ఇంజినీర్లు తమ ప్రధాన కార్యాలయం నుంచే పనిచేస్తున్నారు. ఇక నుంచి వారి సబ్‌ డివిజన్ల నుంచే హాజరు వేసుకోవాలి. ఈ తరహా ఉద్యోగులు సదరు యాప్‌పై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. ఆరోగ్యశాఖ సిబ్బంది నిత్యం గ్రామాలకు వెళ్లాలి. పీహెచ్‌సీలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హాజరు వేసుకోవాలంటే అవస్థలు పడాల్సి వస్తోంది. దీనికితోడు సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి.


యాప్‌లో నమోదుకు ఉద్యోగులు ససేమిరా

61 శాఖల పరిధిలో 16,870 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో ఇప్పటి వరకు 5,945 (35.24 శాతం) మంది  వివరాలు నమోదు చేసుకున్నారు. 10,925 (64.76 శాతం) మంది ఉద్యోగులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేసుకోలేదు. సైనిక్‌ వెల్ఫేర్‌, చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, లైఫ్‌ ఇన్సురెన్సు, ఫ్యాక్టరీస్‌ తదితర శాఖల ఉద్యోగులు వంద శాతం   నమోదు చేసుకున్నారు.

61 శాఖల పరిధిలో 5,945 మంది ఉద్యోగులు ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేసుకున్నారు. వీరిలో 4,175 (70.33 శాతం) సమయం వారీగా హాజరు వేస్తున్నారు. మిగిలిన 1,770 (29.77 శాతం) మంది స్పందించడం లేదు.

మున్సిపాలిటీలలో 431 మంది, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ 205, పంచాయతీరాజ్‌ 152, ముద్రణాలయ సంస్థ 109, పశు సంవర్ధకశాఖ 75, మార్కెటింగ్‌ 69, వ్యవసాయశాఖ 68, బీసీ సంక్షేమం 66, సెబ్‌ 64, సాంఘిక సంక్షేమశాఖ 53, ఆర్‌అండ్‌బీ 31, ఆర్‌డబ్ల్యూఎస్‌ 28, వాణిజ్య పన్నులు 26.. ఇలా పలు శాఖల్లో ఉద్యోగులు ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేసినా హాజరు వేయడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు