logo

ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ

ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రగతి చక్రాన్ని పురోగతి వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.

Published : 31 Jan 2023 02:12 IST

ఆర్టీసీని వీడని నష్టాలు  
ఈపీకే, ఈపీబీలో నంద్యాల వెనుకంజ

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రగతి చక్రాన్ని పురోగతి వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. బస్సుకు కిలోమీటర్‌కు అయ్యే ఖర్చుకు తగినంత ఆదాయం రాక నష్టాల బాటలో నడుస్తోంది. ఈపీకే (ఎర్నింగ్‌ పర్‌ కిలోమీటర్‌), ఈపీబీ (ఎర్నింగ్‌ పర్‌ బస్‌)లో ఆదాయాన్ని తీసుకువచ్చేందుకు అధికారులు తపన పడుతున్నా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈపీకేలో నంద్యాల రీజియన్‌ కంటే కర్నూలు రీజియన్‌ అధికంగా ఉండటం గమనార్హం.  

గతేడాది కంటే తక్కువ కి.మీ. తిరిగి..

ఆర్టీసీలో 2022-23లో నంద్యాల రీజియన్‌లో 7 డిపోలకుగాను 4,72,75,859 కి.మీ. తిరిగి రూ.170,43,92,077 ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు రీజియన్‌లో 5 డిపోలకుగాను 4,48,06,067 కి.మీ. తిరగగా రూ.162,35,94,548 ఆదాయాన్ని తీసుకువచ్చాయన్నారు. నంద్యాలకు డిపోలు, బస్సులు ఎక్కువగా ఉండి కర్నూలు పరిధిలోని డిపోల కంటే ఎక్కువ కి.మీ. తిరిగి ఎక్కువ ఆదాయాన్ని తీసుకువచ్చాయి. గతేడాది (2021-22) కర్నూలు రీజియన్‌లో 5,01,13,656 కి.మీ.కుగాను రూ.157,40,29,181 ఆదాయం రాగా, నంద్యాల రీజియన్‌లో 5,19,14,891 కి.మీ.కుగాను రూ.157,78,37,756 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

2022-23లో కర్నూలు రీజియన్‌ కంటే నంద్యాల రీజియన్‌లో 7 డిపోలకుగాను బస్సుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో 24,69,792 కి.మీ. ఎక్కువ తిరిగి రూ.8,07,97,529 ఎక్కువ ఆదాయాన్ని సాధించగలిగింది. 2021-22 సంవత్సరంతో పోల్చితే 2022-23లో రెండు రీజియన్లలో బస్సులు తక్కువ కి.మీ. తిరిగి ఎక్కువ ఆదాయాన్ని తీసుకువచ్చాయి. ఇందుకు కారణం బస్సు ఛార్జీలు పెంచడమేనని అభిప్రాయపడుతున్నారు.


కర్నూలు రీజియన్‌ ముందు

ర్నూలు రీజియన్‌లో ఆదోని, కర్నూలు-1, కర్నూలు-2, పత్తికొండ, ఎమ్మిగనూరు డిపోలు రాగా, వాటిల్లో ఆర్టీసీ, అద్దె బస్సులు 419 ఉన్నాయి. నంద్యాల రీజియన్‌ పరిధిలోకి ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, డోన్‌, కోవెలకుంట్ల, నందికొట్కూరు, నంద్యాల డిపోలు వస్తాయి. వాటిల్లో ఆర్టీసీ, అద్దె బస్సులు 510 ఉన్నాయి. కానీ ఈపీకే, ఈపీబీ విషయంలో నంద్యాల రీజియన్‌ కంటే కర్నూలు రీజియన్‌లో ఆదాయం మెరుగ్గా ఉంది.  

ఈపీకేలో నంద్యాల రీజియన్‌లో 7 డిపోలకుగాను సగటున రూ.36.05 రాగా, కర్నూలు రీజియన్‌లో ఐదు డిపోలకే రూ.36.24 రావడం గమనార్హం. కర్నూలు-1 డిపోకు సంబంధించి రూ.38.12 ఎక్కువ ఈపీకే సాధించగా, ఆదోని డిపో రూ.33.73తో తక్కువ తీసుకువచ్చింది. నంద్యాల రీజియన్‌లో ఆత్మకూరు డిపో రూ.37.98 ఎక్కువ రాగా, డోన్‌ రూ.34.11 వచ్చింది.

ఈపీబీ విషయంలో కర్నూలు రీజియన్‌లో సగటున రూ.16,473 రాగా, నంద్యాల రీజియన్‌లో రూ.13,613తో వెనుకంజలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని