logo

నేర వార్తలు

పెద్దకడబూరు మండలం జాలవాడిలో జనవరి 27న భార్య, అత్తను వేటకొడవలితో నరికి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడైన కేసీ నాగరాజును సోమవారం అరెస్టు చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ వెల్లడించారు.

Published : 31 Jan 2023 02:12 IST

పొలం రాసివ్వలేదన్న కోపంతో ఇద్దరి హత్య

వివరాలు వెల్లడిస్తున్న ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌, పోలీసులు

ఎమ్మిగనూరు నేరవార్తలు, పెద్దకడబూరు, న్యూస్‌టుడే: పెద్దకడబూరు మండలం జాలవాడిలో జనవరి 27న భార్య, అత్తను వేటకొడవలితో నరికి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడైన కేసీ నాగరాజును సోమవారం అరెస్టు చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నాగరాజు నిత్యం మద్యం తాగి భార్య శాంతితో గొడవ పడుతున్నారన్నారు. అత్త లక్ష్మి పేరిట ఉన్న రెండెకరాల పొలాన్ని తన పేరిట రాసివ్వలేదనే కోపంతో జనవరి 27న తెల్లవారుజామున భార్య, అత్తను వేట కొడవలితో విచక్షణారహితంగా నరికి హత్య చేశారని వివరించారు. హత్య జరిగిన సమయంలో నాగరాజు, శాంతిల కుమార్తె చైత్రప్రసన్న ఉండడంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేశామని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిందితుడి కోసం గాలించినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో రాగిమాన్‌దొడ్డి దిగువ కాల్వ వద్ద నాగరాజును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతడి వద్ద వాహనం, వేట కొడవలి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐలు ఎరిషావలి, మధుసూదనరావు, ఎస్సై శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


అప్పులబాధతో రైతు బలవన్మరణం

అట్టెకల్‌ పెద్దసంజన్న (పాతచిత్రం)

దేవనకొండ, న్యూస్‌టుడే: పంటల దిగుబడి రాలేదు.. పెట్టిన పెట్టుబడీ చేతికందలేదు.. అప్పులు మరింత భారమయ్యాయి. దిక్కుతోచని స్థితిలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బంటుపల్లికి అట్టెకల్‌ పెద్దసంజన్న(66) ఐదు ఎకరాల్లో పత్తి, వేరుశనగ సాగు చేశారు. పంటలు పండక సుమారు రూ.8 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక దిగులు చెందేవాడని పెద్దసంజన్న భార్య లక్ష్మీదేవీ తెలిపారు. 29వ తేదీన ఇంటి దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజన్న పెద్దకుమారుడు సూర్యప్రకాశ్‌ బంటుపల్లి గ్రామ సర్పంచిగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు