logo

ఇంటి పన్నులో చెత్త అనుసంధానం

కర్నూలు నగర వాసులపై భారం మోపేందుకు కార్పొరేషన్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కచ్చితంగా చెత్త పన్ను వసూలు చేయాలన్న లక్ష్యంతో ఆస్తి పన్నులో అనుసంధానం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 23 Mar 2023 02:06 IST

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: కర్నూలు నగర వాసులపై భారం మోపేందుకు కార్పొరేషన్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కచ్చితంగా చెత్త పన్ను వసూలు చేయాలన్న లక్ష్యంతో ఆస్తి పన్నులో అనుసంధానం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. నగర పరిధిలో 52 వార్డుల్లో ఆరు లక్షల జనాభా ఉంది. నిత్యం 181 టన్నుల చెత్త పోగవుతోంది. ఇంటింటి సేకరణ బాధ్యత ఏజెన్సీకి అప్పగించారు.. 91 ఆటోలు సమకూర్చారు. ప్రతి ఇంటికి మూడు ప్లాస్టిక్‌ డబ్బాలు ఇచ్చారు. తడి, పొడి, హానికారక వ్యర్థాలు అందులో వేసి ఉదయం వేళ వీధుల్లోకి వచ్చే ఆటోలకు ఇవ్వాలి. చెత్తను సేకరిస్తున్న ఏజెన్సీకి నగరపాలక సంస్థ ప్రతి నెలా రూ.63 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని ప్రజలపై మోపారు. ఆయా కాలనీల్లో ఒక్కో ఇంటి నుంచి రూ.60 మొదలు రూ.120 వరకు చెత్త పన్ను వసూలు చేయాలి. రూ.1 కోటి వరకు జమ కావాల్సి ఉంది.. చెల్లించేందుకు నగర వాసులు ముందుకురావడం లేదు. బాధ్యతను సచివాలయ సిబ్బందిపై పెట్టారు. వారు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. పింఛన్లలో కోత పెడుతున్నారు.. ఏదైనా పని నిమిత్తం సచివాలయానికి వెళ్తే చెత్త పన్ను చెల్లిస్తేనే పని చేసి పెడుతున్నారు. వసూలుకు తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఇంటి పన్నుకు చెత్తపన్నును అనుసంధానం చేసి వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకున్నా రాబోయే రోజుల్లో ఆర్నెళ్లకోసారి చెత్తపన్ను అనుసంధానం ప్రక్రియ చేపడుతున్నట్లు ఓ అధికారి చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు