logo

కాళ్లు కదపలేరు.. నడుము తిప్పలేరు

పట్టణ ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం రూ.లక్షలు వెచ్చించి పట్టణాల్లో  పార్కులు, ఖాళీ స్థలాల్లో బహిరంగ వ్యాయామ శాలలు (ఓపెన్‌ జిమ్ములు) ఏర్పాటు చేశారు

Updated : 24 Mar 2023 06:24 IST

 బహిరంగ వ్యాయామశాలలో పాడైన పరికాలు
నిర్వహణ మరచిన పురపాలక శాఖ అధికారులు

పట్టణ ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం రూ.లక్షలు వెచ్చించి పట్టణాల్లో  పార్కులు, ఖాళీ స్థలాల్లో బహిరంగ వ్యాయామ శాలలు (ఓపెన్‌ జిమ్ములు) ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతో ప్రస్తుతం పనికిరాకుండా పోయాయి. చాలాచోట్ల పరికరాలు దెబ్బతిన్నాయి. తుప్పుపట్టి, రబ్బరుసీళ్లు, బోల్టులు ఊడిపోయి విరిగిపోయాయి. మరికొన్ని చోట్ల పరికరాల విడి భాగాలు దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రీజు పూసే వారు లేకపోవడంతో వినియోగానికి పనికిరాకుండా పోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో చాలావరకు మూలకు చేరాయి. దీంతో ప్రజాధనం కరిగిపోయినా లక్ష్యం నెరవేరలేదు. ప్రజలకు వ్యాయామం నెరవేరని స్వప్నంగానే మిగిలింది.

వ్యాయంపై .. రాళ్లు

ఎమ్మిగనూరు పట్టణం మాచాని సోమప్ప పార్కులో రూ.20 లక్షలతో ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. నిత్యం వంద నుంచి రెండు వందల మంది వరకు ఇక్కడకు వస్తుంటారు. నిర్వహణ సరిగా లేక పరికరాలు మూలనపడ్డాయి. పుర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు


బిల్లులు ఇవ్వరు.. పరికరాలు వాడరు

నాలుగేళ్ల కిందట రూ.6 లక్షలు వెచ్చించి గత ప్రభుత్వం ఆత్మకూరు పురపాలక సంఘానికి ఓపెన్‌ జిమ్‌ పరికరాలు సమకూర్చించింది. వీటిని ఎక్కడా అమర్చకుండా గోదాములో ఉంచారు. ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేయాలని ఐదు నెలల కిందట నిర్ణయించారు. సామగ్రి సరఫరా చేసిన గుత్తేదారుడికి రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉందని అధికారులు పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. సాధారణ నిధులు తక్కువగా ఉండటంతో కొందరు కౌన్సెలర్లు అభ్యంతరం చెప్పారు. కనీసం రూ.లక్ష చెల్లిస్తే బిగిస్తామని గుత్తేదారు చెప్పారు.. అయినా పాలకవర్గం కరుణించలేదు. చేసేది లేక సామగ్రిని అర్బన్‌కాలనీలో మూతబడిన బీసీ వసతి గృహం ప్రదేశంలో పడేశారు.


తుప్పు పట్టాయి 

రూ.2.60 లక్షలు వెచ్చించి 2018లో వ్యాయామ పరికరాలు కొనుగోలు చేశారు.ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ వ్యాయామం చేసుకోవడానికి వీలుగా ఉండేలా పార్కుల్లో బిగించాలి. పార్కులు లేవంటూ 13 ఏళ్లుగా పుర కార్యాలయంలో వృథాగా పెట్టారు. 

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ


ఊడిన బోల్టులు

స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ కింద 2019లో ప్రభుత్వం రూ.7 లక్షలు వెచ్చించి డోన్‌ పురపాలక సంఘానికి వ్యాయామ పరికరాలు సమకూర్చింది.  కేవీఎస్‌ కాలనీలోని మున్సిపల్‌ పార్కులో వీటిని బిగించారు. రూ.70 వేలు వెచ్చించి కంచె, గేటు, పరికరాల మధ్యలో కంకర, సిమెంట్‌తో బెడ్‌ వేశారు. రోవర్‌ పరికరానికి బోల్టులు లూజుగా మారడంతో ఊడే స్థితికి చేరింది. సమయానికి గ్రీస్‌ పూయకపోవడం, బోల్టులు, బాల్స్‌ అరిగిపోవడంతో బలవంతంగా నెట్టాల్సి వస్తోందని యువకులు పేర్కొంటున్నారు.
న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం


రూ.15 లక్షలు వెచ్చించారు

నంద్యాల పట్టణంలో చెరువుకట్టపై రూ.15 లక్షలకుపైగా వ్యయం చేసి ఏడు నెలల కిందట మహిళలు, పురుషులకు వేర్వేరుగా వ్యాయామ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళలు వ్యాయామ కేంద్రంలోని చాలా పరికరాలకు గ్రీజు పూయలేదు. కొన్నింటికి బోల్టులు ఊడిపోయాయి. మరికొన్ని విరిగిపోయాయి. పురుషుల కోసం ఏర్పాటు చేసిన పరికరాల చుట్టూ పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగిపోయాయి. కొన్నింటికి గ్రీన్‌ మ్యాట్‌లు ఏర్పాటు చేయలేదు. దీంతో సిమెంటు దిమ్మెలపైనే నిల్చుని వ్యాయామం చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ కొన్ని పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రజలు చెబుతున్నారు. ఇక్కడికి ప్రతిరోజు వందల మంది వ్యాయామం కోసం వస్తుంటారు.

న్యూస్‌టుడే, నంద్యాల పురపాలకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని