logo

లేగ దూడలే రేపటి పాడి పశువులు

లేగ దూడలే రేపటి పాడి పశువులని, పాడి పశుపోషణ రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు, నంద్యాల పశుసంవర్దక శాఖ కార్యనిర్వహణాధికారి రాజశేఖర్‌ అన్నారు.

Published : 30 Mar 2023 02:43 IST

రహిమాన్‌పురం, బైనపల్లె (బేతంచెర్ల), న్యూస్‌టుడే: లేగ దూడలే రేపటి పాడి పశువులని, పాడి పశుపోషణ రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు, నంద్యాల పశుసంవర్దక శాఖ కార్యనిర్వహణాధికారి రాజశేఖర్‌ అన్నారు. బుధవారం మండలంలోని రహిమాన్‌పురం, బైనపల్లె గ్రామాల్లో పశుగణాభివృద్ధి సంస్థ, పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో జాతీయ కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ముర్రా, ఒంగోలు, గిర్‌ జాతుల దూడలను ప్రదర్శించి, వాటి యజమానులకు బహుమతులు, కాల్షియం టానిక్‌లు అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. దూడల పోషణలో జాగ్రత్తలు తీసుకోవాలని, దూడ పుట్టిన 7, 15, 30వ రోజు నట్టల నివారణ మందు తాగించాలన్నారు. 70 శాతం దూడలు ఏలిక పాముల బెడద వల్ల మరణిస్తాయన్నారు. సహాయ సంచాలకురాలు వసంతలక్ష్మి మాట్లాడుతూ. లింగ నిర్ధారిత వీర్యం అందుబాటులో ఉందని, రూ.1350 ధరకుగాను రైతుకు రూ.500 రాయితీ చెల్లిస్తే రెండు ఎద సూదులు వేస్తారన్నారు. రూ.850 రాయితీ ద్వారా ఈ వీర్యం ద్వారా ఆడదూడలు మాత్రమే పుడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యులు షంషాద్‌, రంగస్వామి, అజయ్‌, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని