logo

పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీఆర్‌

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి, గిన్నిస్‌ పుస్తకంలో స్థానం సంపాదించుకుందని కర్నూలు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Published : 30 Mar 2023 02:10 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి, గిన్నిస్‌ పుస్తకంలో స్థానం సంపాదించుకుందని కర్నూలు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా తెదేపా కార్యాలయంలో బుధవారం సోమిశెట్టి ఆధ్వర్యంలో, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత కార్యాలయంలోనూ, కలెక్టరేట్‌ దగ్గర పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోమిశెట్టి మాట్లాడుతూ ‘తెలుగువారి ఆత్మగౌరవం’ కాపాడాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. తొమ్మిది నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి, ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న ఎన్టీఆర్‌ ప్రజా సమస్యలే అజెండాగా రూపొందించుకొని 1983లో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెదేపాని తిరుగులేని ఆధిక్యంతో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్రను సృష్టించారన్నారు. అనేక పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, ఎంజీర్‌ సూచనల మేరకు తమిళనాడుకు తాగునీరు అందించిన మహనీయుడు ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన స్థాపించిన పార్టీలో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు తెదేపాను బలోపేతం చేశారని, పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అనునిత్యం ప్రజల కోసం పనిచేశారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అవినీతికి తావులేని పాలన అందించారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకొని వచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు గున్నామార్క్‌, నాగేంద్రకుమార్‌, సోమిశెట్టి నవీన్‌, కె.పరమేశ్‌, అబ్బాస్‌, పి.రవికుమార్‌, సంజీవలక్ష్మి, పి.జి.గోపినాథ్‌ యాదవ్‌, మహేశ్‌గౌడ్‌, హనుమంతరావు చౌదరి, నాగరాజు యాదవ్‌, నందిమధు, మధుసూదన్‌నాయుడు, తిరుపాల్‌బాబు, బాబురావు, డి.జేమ్స్‌, వెంకటస్వామి, పామన్న, చిన్నమ్మి, బాలవెంకటేశ్వరరెడ్డి, పి.రాజు, చంద్రకళాబాయి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని