logo

అక్రమార్కుల పట్టు.. చెదిరిన గట్టు

జగన్నాథగట్టును అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. అధికార పార్టీ అండదండలతో రాత్రింబవళ్లు తవ్వేస్తున్నారు. జర్నలిస్టులు, ఐఐఐటీ, క్లస్టర్‌ విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూముల్లో తవ్వకాలు చేపట్టడం కలకలం సృష్టిస్తోంది.

Updated : 31 Mar 2023 02:26 IST

ఈనాడు, కర్నూలు, న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణం

తవ్వేశారు ఇలా..

జగన్నాథగట్టును అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. అధికార పార్టీ అండదండలతో రాత్రింబవళ్లు తవ్వేస్తున్నారు. జర్నలిస్టులు, ఐఐఐటీ, క్లస్టర్‌ విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూముల్లో తవ్వకాలు చేపట్టడం కలకలం సృష్టిస్తోంది. మట్టి తరలింపులో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు కీలకంగా వ్యవహరిస్తుండటం వల్లే అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

పేదలకిస్తామని పెద్దల కన్ను

జగన్నాథగట్టు దాదాపు ఐదు వందల ఎకరాలు కల్లూరు, కర్నూలు మండలాల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ రూపాలసంగమేశ్వర స్వామి ఆలయం, ఈద్గా, 60 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం, ఐఐఐటీ, ఇందిరమ్మ కాలనీ ఉన్నాయి. 250 ఎకరాలు పోలీస్‌ పరేడ్‌కు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న కాలనీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. రూ.కోటి వెచ్చించి రోడ్లు, హద్దు రాళ్లు పాతారు. విలువైన స్థలం కావడంతో కొందరు ప్రజాప్రతినిధులు పేచీ పెట్టారు. 250 ఎకరాలు ఖాళీగా ఉండటం.. అక్కడ విలువైన ఎర్రమట్టి, కంకర రాళ్లు ఉండటంతో అక్రమార్కుల కన్నుపడింది.

కొరవడిన సమన్వయం

సహజ వనరుల పరిరక్షణ బాధ్యత పలు ప్రభుత్వ శాఖల పరిధిలో ఉంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. ఆమేరకు జిల్లా స్థాయి అధికారుల్లో సమన్వయం లేదు. సమష్టి వ్యూహాన్ని రచించి అమలు చేయకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. బహిరంగంగా ఎర్రమట్టిని భారీ లారీల్లో తరలిస్తున్నా అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. చారిత్రక నేపథ్యం ఉన్న జగన్నాథగట్టు కరిగిపోతున్నా కలెక్టర్‌స్థాయిలో సమీక్షలు జరగకపోవడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలు పూర్తిగా నిషేధిస్తే ఎలాంటి సమస్య ఉండదు.

అసలు సూత్రధారులను వదిలేసి

జగన్నాథగట్టు ప్రాంతంలోని సర్వే నంబరు 793-1లో ఏకంగా 1,71,308 క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టిని అక్రమంగా తవ్వినట్లు అధికారులు గుర్తించారు. గత సంవత్సరం డిసెంబరు నుంచి గనుల శాఖ అధికారులు, గనులశాఖ జిల్లా విజిలెన్స్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు చేశారు. పది మంది పాత్ర ఉన్నట్లు గుర్తించి రూ.9.49 కోట్ల జరిమానా విధించారు. అధికారుల నోటీసులకు ఇప్పటి వరకు ఒక్కరే సమాధానం ఇచ్చారు. జరిమానా మాత్రం ఒక్కరూ చెల్లించలేదు. మట్టి తరలింపులో తమ పాత్ర లేదని వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 2022-23 ఏడాది జనవరి నెలాఖరు వరకు 93 కేసులు నమోదు చేసి రూ.10,75,473 జరిమానా విధించినట్లు గనులశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు అసలు సూత్రధారులను వదిలేసి అనామకులకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది.


లోయలను తలపిస్తున్న జగన్నాథగట్టు

జగన్నాథగట్టు ప్రాంతంలో ఎర్రమట్టి నిల్వలు, కంకర తయారీకి ఉపయోగపడే బండరాళ్లు భారీగా ఉన్నాయి. భవనాలు, రహదారుల నిర్మాణాలకు అత్యంత కీలకమైన వీటి కోసం అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతోంది. నిత్యం 50 నుంచి 70 టిప్పర్లలో మట్టిని కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌ను రూ.4,000 నుంచి రూ.4,500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని